పారదర్శకంగానే భూముల వేలం
రూ.100 కోట్లకు పైగా ప్రభుత్వానికి ఆదాయం
ఆధారాలుంటే విచారణ సంస్థలకు సమర్పించాలి
రాజకీయ ఉనికి కోసం తప్పుడు ప్రచారాలు తగదు
నిరాధార ఆరోపణలు చేస్తే చట్టపరంగా చర్యలు
మర్రి యాదవరెడ్డిపై కుడా చైర్మన్ ఇనుగాల ఆగ్రహం
కుడా ప్రతిష్టను దెబ్బతీస్తే సహించమని హెచ్చరిక
కాకతీయ, వరంగల్ బ్యూరో: కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ (కుడా) భూముల వేలంపై మాజీ చైర్మన్ మర్రి యాదవరెడ్డి చేసిన అవినీతి ఆరోపణలను ప్రస్తుత చైర్మన్ ఇనగాల వెంకట్రామిరెడ్డి తీవ్రంగా ఖండించారు. ప్రజలను తప్పుదోవ పట్టించేలా, ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసేలా ఆధారాలు లేకుండా మాట్లాడటం దురదృష్టకరమని ఆయన అన్నారు. శుక్రవారం హనుమకొండలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బాలసముద్రం భూముల వేలం ప్రక్రియ పూర్తిగా నిబంధనలకు అనుగుణంగా, అత్యంత పారదర్శకంగా జరిగిందని, దీని ద్వారా ప్రభుత్వానికి రూ.100 కోట్లకు పైగా ఆదాయం లభించిందని స్పష్టం చేశారు.

సమాధానం చెప్పేందుకు సిద్ధం
మాజీ చైర్మన్ చేసిన ప్రతి ఆరోపణకు అధికారిక రికార్డులు, వేలం పత్రాలతో సమాధానం చెప్పేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ఇనగాల తెలిపారు. ఈ క్రమంలోనే ఆధారాలతో భద్రకాళి అమ్మవారి ఆలయానికి వెళ్లాలని నిర్ణయించుకున్నానని, అయితే రామకృష్ణ కాలనీ వద్ద పోలీసులు తనను అడ్డుకోవడం బాధాకరమన్నారు. చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా పోలీసుల సూచన మేరకు వెనుదిరిగానని, నిజాన్ని నిరూపించుకునే అవకాశం కల్పించకపోవడం విచారకరమని పేర్కొన్నారు. రాజకీయ ఉనికి కోసం భద్రకాళి ఆలయం వద్ద తడిబట్టలతో ప్రమాణాలు చేయడం సరికాదని ఇనగాల విమర్శించారు. నిజంగా అవినీతి జరిగి ఉంటే ఆధారాలను మీడియాకు లేదా దర్యాప్తు సంస్థలకు సమర్పించాలని ఆయన సవాల్ విసిరారు. దేవాలయాలను రాజకీయ వేదికలుగా మార్చడం ప్రజల విశ్వాసాలను దెబ్బతీయడమేనని, దేవుడి పేరును రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవడం తగదని హెచ్చరించారు.
కుడా ప్రతిష్టను దెబ్బతీస్తే సహించం
కుడా ప్రతిష్టను దిగజార్చేలా ఉద్దేశపూర్వకంగా అసత్య ప్రచారం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని చైర్మన్ హెచ్చరించారు. వేలానికి సంబంధించిన అన్ని పత్రాలు ప్రభుత్వ రికార్డుల్లో ఉన్నాయని, ఏ విచారణకైనా సిద్ధమని స్పష్టం చేశారు. మీడియా సంస్థలు ధృవీకరించని ఆరోపణలకు ప్రాధాన్యం ఇవ్వకుండా, వాస్తవాలను ప్రజలకు చేరవేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. రాజకీయ ఆరోపణలతో అభివృద్ధిని అడ్డుకోలేరని, సత్యమే చివరకు గెలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

