- నిబంధనలన్నీ ‘గాలికి’!
- దామెర చెరువును కొల్లగొడుతున్న మాఫియా
- నిబంధనల విరుద్ధంగా భారీ తవ్వకాలు
- 15 రోజుల అనుమతి పొంది.. రెండు నెలలుగా ‘మట్టి’ దోపిడీ
- మైనింగ్ అధికారుల కనుసన్నల్లోనే చెరువు విధ్వంసం?
- డీఈ వ్యాఖ్యలతో బయటపడ్డ అధికార యంత్రాంగం నిర్లక్ష్యం
కాకతీయ, వరంగల్ బ్యూరో : పరకాల దామెర చెరువు ప్రస్తుతం అక్రమ మైనింగ్కు అడ్డాగా మారింది. ‘ఇంటిగ్రేటెడ్ స్కూల్’ నిర్మాణం పేరుతో మొదలైన మట్టి తవ్వకాలు, ఇప్పుడు నిబంధనలకు విరుద్ధంగా భారీ స్థాయి ‘మైనింగ్’గా మారాయి. పగలు, రాత్రి తేడా లేకుండా జేసీబీల సాయంతో చెరువు గర్భాన్ని తవ్వేస్తూ, విలువైన మట్టిని అక్రమంగా తరలిస్తున్నా మైనింగ్, ఇరిగేషన్ శాఖ అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడకపోవడం వెనుక భారీ కుంభకోణం దాగి ఉందనే ఆరోపణలు వస్తున్నాయి. చెరువుల్లో మైనింగ్ చేయాలంటే రెవెన్యూ, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ల నుంచి అనుమతి తప్పనిసరి. కానీ ఇక్కడ మాత్రం అధికార పార్టీ నేతల అండతో ఇవేవీ పాటించడం లేదు. కేవలం 15 రోజులు మాత్రమే అనుమతి ఇచ్చామని ఇరిగేషన్ శాఖ డీఈ చెబుతున్నా, గత రెండు నెలలుగా యథేచ్ఛగా మట్టిని తరలిస్తున్నారు. ఎంత మట్టి తీశారు? ఎంత రాయల్టీ చెల్లించారు? అసలు మైనింగ్ అనుమతులు ఉన్నాయా? అనే ప్రాథమిక ప్రశ్నలకు కూడా సమాధానం కరువైంది.
డీఈ సమాధానంలో ‘మైనింగ్’ లొసుగులు!
ఈ అక్రమ మైనింగ్పై కాకతీయ డీఈని వివరణ కోరగా.. “ఎమ్మెల్యేకు సీఎం లక్ష్యాన్ని నిర్దేశించారని, మట్టిని స్కూల్ కోసం వాడుతున్నామని, మీరు ఎన్ని వార్తలు రాసినా ఏమీ కాదు” అని వ్యాఖ్యానించడం గమనార్హం. చట్టం కంటే రాజకీయ ఒత్తిళ్లే ఇక్కడ రాజ్యమేలుతున్నాయని స్పష్టమవుతోంది. “ఎన్ని క్యూబిక్ మీటర్లకు అనుమతి ఇచ్చారో రికార్డులు చూసి చెబుతా” అని డీఈ తర్వాత సమాధానం ఇవ్వకపోవడం గమనార్హం. పక్కాగా నిబంధనలను ఉల్లంఘించి చేస్తున్న మైనింగ్ మాఫియాకు అధికారులే సహకరిస్తున్నారని తేటతెల్లమవుతోంది. ఇరిగేషన్, రెవెన్యూ, మైనింగ్ శాఖల అధికారులు ఎప్పటికప్పుడు చెరువుల్లో జరుగుతున్న పనులను పర్యవేక్షించాల్సి ఉంటుంది. కానీ దామెర చెరువు విషయంలో మాత్రం క్షేత్రస్థాయిలో తనిఖీలు జరిగిన ఆనవాళ్లు కనిపించడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. భారీ సంఖ్యలో ట్రాక్టర్లు తిరుగుతున్నా, యంత్రాలు పనిచేస్తున్నా అధికారులు స్పందించకపోవడం పలు అనుమానాలకు దారితీస్తోందని అంటున్నారు. దామెర చెరువులో జరుగుతున్న మట్టి తవ్వకాలపై జిల్లా కలెక్టర్, ఇరిగేషన్ ఉన్నతాధికారులు, మైనింగ్ శాఖ అధికారులు సంయుక్తంగా విచారణ జరపాలని ప్రజలు కోరుతున్నారు. అనుమతుల కాపీలు, క్యూబిక్ మీటర్ల వివరాలు, గడువు, మట్టి తరలింపు లెక్కలను ప్రజలకు వెల్లడ చేయాలని, అనుమతులకు విరుద్ధంగా తవ్వకాలు జరిగినట్లు తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
పర్యావరణానికి ముప్పు – విచారణకు డిమాండ్!
భూగర్భ జలాలు ఊరేంత లోతులో తవ్వకాలు జరపడంతో భవిష్యత్తులో చెరువు కట్టలు తెగిపోయే ప్రమాదం ఉందని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేవలం స్కూల్ నిర్మాణం కోసమే కాకుండా, అక్రమంగా మట్టిని విక్రయిస్తూ లక్షలాది రూపాయలు కొల్లగొడుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తక్షణమే జిల్లా కలెక్టర్ చాహత్బాజ్పేయి ఈ విషయంపై దృష్టి సారించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. చెరువులో జరుగుతున్న ఈ అక్రమ మైనింగ్పై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులైన మైనింగ్ మాఫియాను, వారికి సహకరిస్తున్న అధికారులను కఠినంగా శిక్షించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

