పోలీసింగ్కు కొత్త సవాళ్లు..!
నక్సలిజం నుంచి సైబర్ నేరాల వరకు భారీ మార్పు
మౌలిక పోలీసింగ్ను విస్మరించొద్దు..
క్షేత్రస్థాయిలో అధికారులు అందుబాటులో ఉండాలి
డగ్స్, సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి : డీజీపీ సీవీ ఆనంద్
కాకతీయ, వరంగల్ బ్యూరో : ఒకప్పుడు నక్సలిజం పోలీసింగ్కు అతిపెద్ద సవాలుగా ఉండేదని, ప్రస్తుతం సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలు, ఆర్థిక నేరాలు, రోడ్డు ప్రమాదాలు ప్రధాన సవాళ్లుగా మారాయని తెలంగాణ డీజీపీ సి.వి. ఆనంద్ అన్నారు. సాంకేతిక పరిజ్ఞానం పోలీసింగ్లో కీలకంగా మారినప్పటికీ, మౌలిక పోలీసింగ్ను ఎట్టి పరిస్థితుల్లోనూ విస్మరించరాదని స్పష్టం చేశారు. పోలీస్ స్టేషన్లకు వచ్చే ఫిర్యాదులను వెంటనే స్వీకరించి పరిష్కరించాలని, దర్యాప్తులు, కోర్టు కేసుల పురోగతిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ఆదివారం వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఎన్ఐటీలో పోలీసింగ్ పనితీరుపై డీజీపీ సమీక్ష నిర్వహించారు. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో, టీ-స్పార్క్, సీఐడీ అధికారులు సైబర్ నేరాల ధోరణులు, దర్యాప్తు విధానాలు, నూతన సాంకేతిక వ్యవస్థలపై ప్రజెంటేషన్లు ఇచ్చారు.

సైబర్ మోసాలతో రూ.1,700 కోట్ల నష్టం
గత ఏడాది తెలంగాణలో సైబర్ నేరాల కారణంగా ప్రజలు సుమారు రూ.1,700 కోట్లు నష్టపోయారని డీజీపీ తెలిపారు. మోసానికి గురైన వెంటనే ఫిర్యాదు చేయకపోవడం వల్ల నగదు రికవరీ అవకాశాలు తగ్గుతున్నాయని చెప్పారు. అధిక లాభాల పేరుతో జరిగే పెట్టుబడి మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సైబర్ నేరాల నియంత్రణలో తెలంగాణకు దేశంలోనే తొలి స్థానం లభించిందన్నారు. డీసీపీలు, ఏసీపీలు, డీఎస్పీలు క్షేత్రస్థాయిలో ఎక్కువ సమయం గడుపుతూ ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. సాంకేతికత పోలీసింగ్కు తోడ్పాటు మాత్రమేనని, మౌలిక పోలీసింగ్కు ప్రత్యామ్నాయం కాదని స్పష్టం చేశారు. చాక్లెట్ల రూపంలో చిన్నారులను మాదకద్రవ్యాలకు అలవాటు చేసేందుకు జరుగుతున్న ప్రయత్నాలు ఆందోళనకరంగా ఉన్నాయని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డ్రగ్స్ నివారణలో విద్యాసంస్థలు కీలక పాత్ర పోషించాలని సూచించారు.
20 శాతం పోస్టులు ఖాళీ
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 50 పోలీస్ స్టేషన్లు ఉన్నాయని అధికారులు తెలిపారు. 3,758 మంజూరైన పోస్టులకు 2,976 మంది మాత్రమే విధుల్లో ఉండగా, 782 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు వెల్లడించారు. సుమారు 20 శాతం సిబ్బంది కొరత ఉందని తెలిపారు. కమిషనరేట్ పరిధిలో నేరాల నమోదు సుమారు 10 శాతం పెరిగినట్లు డీజీపీ దృష్టికి తీసుకెళ్లారు. బీహార్, ఛత్తీస్గఢ్, ఒడిశా నుంచి రైళ్లలో వరంగల్, కాజీపేట ప్రాంతాలకు వచ్చి చైన్స్నాచింగ్, బైక్ చోరీలకు పాల్పడి తిరిగి వెళ్లే అంతర్రాష్ట్ర ముఠాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు అధికారులు వివరించారు. ఎన్ఏటిజిఆర్ఐడీ సహకారంతో సమాచార మార్పిడి, నిఘా వ్యవస్థను బలోపేతం చేస్తున్నట్లు తెలిపారు. కమిషనరేట్లో దోపిడీ కేసులు 7 నుంచి 18కు, తాజాగా 29కు పెరిగినట్లు సమీక్షలో వెల్లడైంది. సైబర్ మోసాల కేసులు 25 నుంచి 59కు పెరగగా, 2026 జనవరి నుంచి జూలై వరకు 119 కేసులు నమోదయ్యాయి. ఉద్యోగాల పేరుతో మోసాలకు సంబంధించి 40 కేసులు, ప్రజా పంపిణీ వ్యవస్థకు సంబంధించి 117 కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. ప్రజల భాగస్వామ్యంతో సీసీ కెమెరాల ఏర్పాటుకు చేపట్టిన నేను సైతం కార్యక్రమాన్ని డీజీపీ అభినందించారు. నల్లబెల్లి, పర్వతగిరి పోలీస్ స్టేషన్ల పరిధిలో చేపట్టిన చర్యలను ప్రశంసించారు. సమీక్షలో వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపీఎస్, ఇతర అధికారులు పాల్గొన్నారు. డీజీపీ తన ఐపీఎస్ ఉద్యోగ జీవితం వరంగల్లో జిల్లా శిక్షణతో ప్రారంభమైందని, నక్సలిజం తీవ్రంగా ఉన్న సమయంలో ల్యాండ్మైన్ పేలుళ్లు, దాడుల మధ్య పోలీసులు విధులు నిర్వహించిన రోజులను గుర్తుచేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న శాంతిభద్రతలు పోలీసు అమరుల త్యాగాల ఫలితమని పేర్కొన్నారు.

