చిన్న ఆసుపత్రుల పరిరక్షణే ప్రజారోగ్య రక్షణ
ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్ బకాయిలు వెంటనే చెల్లించాలి
నకిలీ వైద్యులపై ఉక్కుపాదం.. వైద్యులకు చట్టపరమైన రక్షణ
వైద్య రంగ సమస్యలపై థానాకాన్–2026లో అసోసియేషన్ నేతల విస్తృత చర్చ
థానా రాష్ట్ర అధ్యక్షుడిగా డా. పి. ప్రవీణ్ ప్రమాణ స్వీకారం
కాకతీయ, హన్మకొండ : చిన్న, మధ్యతరహా ఆసుపత్రుల మనుగడను కాపాడటంతోపాటు ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందేలా ప్రభుత్వం ప్రత్యేక విధానం రూపొందించాలని తెలంగాణ హాస్పిటల్స్ అండ్ నర్సింగ్ హోమ్స్ అసోసియేషన్ (టీహెచ్ ఎఎన్ ఏ) (తానా) మహాసభ డిమాండ్ చేసింది. ఆరోగ్య రంగంలో ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యాన్ని బలోపేతం చేయాలని, ప్రైవేట్ ఆసుపత్రులకు పెండింగ్లో ఉన్న ఆరోగ్యశ్రీ, పాత ఉద్యోగుల ఆరోగ్య పథకం బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరింది. నకిలీ వైద్యులపై కఠిన చర్యలు తీసుకోవడంతోపాటు వైద్యులు, వైద్య సిబ్బందికి బలమైన చట్టపరమైన రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేసింది. వరంగల్ అరేపల్లిలోని వజ్రా గార్డెన్స్లో తెలంగాణ హాస్పిటల్స్ అండ్ నర్సింగ్ హోమ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం 11వ వార్షిక రాష్ట్ర మహాసభ థానాకాన్–2026 ఘనంగా నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా వైద్యులు, చిన్న, మధ్యతరహా, పెద్ద ఆసుపత్రుల యాజమాన్య ప్రతినిధులు పాల్గొన్నారు. అగ్ని ప్రమాద భద్రత, ఐసీయూ ప్రొటోకాల్స్, రోగుల భద్రత, వైద్య నైతిక విలువలు, ఆరోగ్య బీమా, ఆసుపత్రుల ఆర్థిక నిర్వహణ, బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణ, డిజిటల్ హెల్త్కేర్, క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం తదితర అంశాలపై శాస్త్రీయ చర్చలు, నిరంతర వైద్య విద్యా కార్యక్రమాలు నిర్వహించారు.


ప్రభుత్వానికి పలు సూచనలు
థానాకాన్లో నిర్వహించిన ప్రత్యేక ప్యానల్ చర్చలో చిన్న, మధ్యతరహా ఆసుపత్రుల సమస్యలు, పెరుగుతున్న నియంత్రణ నిబంధనలు, ప్రభుత్వ ఆరోగ్య పథకాలు, బీమా, వైద్యుల భద్రత, నకిలీ వైద్యం, వైద్య విద్య తదితర అంశాలపై చర్చించారు. ఐఎంఏ, థానా, తాన్హా, హెచ్ఆర్డీఏ ప్రతినిధులతో రాష్ట్ర స్థాయిలో ఆరోగ్య సంరక్షణ కమిషన్, సమన్వయ కమిటీ ఏర్పాటు చేయాలని సూచించారు. క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్స్ చట్టంలో అవసరమైన సవరణలు చేసి రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో థానాకు ప్రాతినిధ్యం కల్పించాలని కోరారు. అగ్ని ప్రమాద భద్రత, మురుగునీటి శుద్ధి, కాలుష్య నియంత్రణ నిబంధనలను ఆసుపత్రి పరిమాణం, అందించే వైద్య సేవలు, ప్రమాద స్థాయికి అనుగుణంగా ఆచరణాత్మకంగా రూపొందించాలని విజ్ఞప్తి చేశారు. ఆసుపత్రుల వర్గీకరణలో పడకల సంఖ్యకే కాకుండా వైద్య సేవల నాణ్యత, సదుపాయాలు, వైద్యులు, సిబ్బంది అర్హతలు, రోగుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు.
బకాయిలు చెల్లించాలి
ఆరోగ్యశ్రీ, పాత ఉద్యోగుల ఆరోగ్య పథకం బకాయిలు దీర్ఘకాలంగా పెండింగ్లో ఉండటంతో చిన్న, మధ్యతరహా ఆసుపత్రుల ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ప్రభావం పడుతోందని మహాసభ పేర్కొంది. ప్రభుత్వం వెంటనే బకాయిలు విడుదల చేయాలని కోరింది. ప్రభుత్వ ఆరోగ్య పథకాల అమలులో ప్రైవేట్ ఆసుపత్రులను ప్రభుత్వ–ప్రైవేట్ భాగస్వామ్యంలో భాగస్వామ్యం చేయాలని సూచించింది. వైద్య వృత్తి నుంచి ఎన్నికైన ప్రజాప్రతినిధులను ఆరోగ్య విధానాల రూపకల్పనలో భాగస్వామ్యం చేయాలని కోరింది. నకిలీ వైద్యులపై నిరంతర పర్యవేక్షణకు జిల్లా స్థాయిలో ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయాలని, అర్హత లేని వ్యక్తులు వైద్య సేవలు అందించకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. వైద్యులు, వైద్య సిబ్బందిపై దాడులను అరికట్టేందుకు జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనరేట్, పోలీస్ శాఖ, పోలీస్ స్టేషన్ల స్థాయిలో తక్షణ స్పందన వ్యవస్థ ఏర్పాటు చేయాలని కోరింది. మారుమూల ప్రాంతాల్లో ఆసుపత్రులు ఏర్పాటు చేసే వారికి ప్రత్యేక ప్రోత్సాహకాలు అందించాలని విజ్ఞప్తి చేసింది.
డా. పి. ప్రవీణ్ ప్రమాణ స్వీకారం
ఈ సందర్భంగా థానా రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా డా. పి. ప్రవీణ్ ప్రమాణ స్వీకారం చేశారు. చిన్న, మధ్యతరహా ఆసుపత్రులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతోపాటు, ఆసుపత్రుల ప్రయోజనాలను పరిరక్షిస్తూ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు. ముఖ్య అతిథులుగా వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు హాజరయ్యారు. చిన్న, మధ్యతరహా ఆసుపత్రుల సమస్యలను ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే నాగరాజు తెలిపారు. డా. పి. ప్రవీణ్ థానా రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించడం వరంగల్ జిల్లాకు గర్వకారణమని నాయిని రాజేందర్ రెడ్డి పేర్కొన్నారు. ఆర్గనైజింగ్ చైర్మన్ డా. పి. ప్రవీణ్, కో-చైర్మన్ డా. ముక్కా దిలీప్ కుమార్, ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. ఎల్. నాగేశ్వర్ రావు, ట్రెజరర్ డా. వి. నరేష్ కుమార్ ఆధ్వర్యంలో మహాసభ జరిగింది. డా. పి. కాళీ ప్రసాదరావు, డా. టి. నర్సింగ రెడ్డి, డా. కె. అశోక్ రెడ్డి, డా. వి. రాకేష్, డా. నరసింహరావు, డా. పి. విజయ చంద్ర రెడ్డి, డా. కస్తూరి ప్రమీల, డా. ఎం. శేషు మాధవ్, డా. విద్యాసాగర్, డా. దశరథం, డా. జి. రమేష్, డా. ఎం. సుదీప్, డా. పి. సుధీర్ కుమార్, డా. కొత్తగట్టు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.టీహెచ్ ఎఎన్ ఏ (తానా) రాష్ట్ర అధ్యక్షులు డా. అరుణ్ కటారి, ప్రధాన కార్యదర్శి డా. ఎం.వి. ప్రసాద్, కోశాధికారి డా. కె. అశోక్ కుమార్, తక్షణ పూర్వ అధ్యక్షులు డా. ఎల్. సురేష్ గౌడ్, జాయింట్ సెక్రటరీ డా. ఎస్. నౌనిహాల్ సింగ్, ఉపాధ్యక్షులు డా. వి. అశోక్, డా. ఎన్. మహేష్ బాబు, డా. గుండేటి రమేష్ తదితరులు హాజరయ్యారు.

