కర్రెగుట్టల్లో చరిత్రాత్మక మార్పు!
50 ఏళ్లుగా అడుగుపెట్టని ప్రాంతంలో తొలిసారి ప్రభుత్వ యంత్రాంగం
మావోయిస్టు ప్రభావం తగ్గడంతో అభివృద్ధికి బాటలు
రహదారి, విద్య, వైద్యం.. మౌలిక వసతులపై దృష్టి
తెలంగాణ–ఛత్తీస్గఢ్ పోలీసుల సమన్వయంతో భద్రత కట్టుదిట్టం
రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్.. కర్రెగుట్టల్లో పర్యటన
సరిహద్దులో జాతీయ జెండా ఆవిష్కరించిన డీజీపీ
కాకతీయ, ములుగు ప్రతినిధి : ‘‘కర్రెగుట్టలో చరిత్ర సృష్టించే రోజు ఇది.. దాదాపు 50 ఏళ్లుగా దట్టమైన అటవీ ప్రాంతం, మావోయిస్టుల భయంతో ప్రభుత్వ పరంగా ఎవరూ వెళ్లలేని పరిస్థితి ఉండేది. ఇకపై కర్రెగుట్ట ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలకు నాంది పలుకుతున్నాం’’ అని తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ అన్నారు. మావోయిస్టు ప్రభావం గణనీయంగా తగ్గడంతో ఇప్పటివరకు అభివృద్ధికి దూరంగా ఉన్న సరిహద్దు ప్రాంతాలపై ప్రభుత్వం దృష్టి సారించిందని తెలిపారు. కర్రెగుట్ట చుట్టుపక్కల గ్రామాలకు విద్య, వైద్యం, రహదారులు, ఇతర మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు చేపడతామని వెల్లడించారు. ములుగు జిల్లా వాజేడు, వెంకటాపురం మండలాల పరిధిలోని కర్రెగుట్టల్లో పర్యటించిన డీజీపీ.. అంతర్రాష్ట్ర సరిహద్దులో జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం తెలంగాణ, ఛత్తీస్గఢ్ పోలీసు అధికారులు, భద్రతా బలగాలతో సరిహద్దు భద్రత, రహదారి నిర్మాణం, ఇరు రాష్ట్రాల సమన్వయంపై సమీక్ష నిర్వహించారు.

50 ఏళ్ల తర్వాత ప్రభుత్వ అడుగు
వాజేడు మండలంలోని మొరుమూరు, మిద్గువ మీదుగా వెంకటాపురం మండలంలోని పామునూరు, జెల్ల ప్రాంతాల మీదుగా డోలి గ్రామానికి డీజీపీ చేరుకున్నారు. అక్కడి నుంచి తడపల గ్రామ సమీపంలోని అంతర్రాష్ట్ర సరిహద్దు ప్రాంతానికి వెళ్లారు. జాతీయ జెండాను ఎగురవేసి, జాతీయ గీతాన్ని ఆలపించారు. విధుల్లో ఉన్న పోలీసు సిబ్బంది, భద్రతా బలగాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. కర్రెగుట్ట ప్రాంతానికి తొలిసారిగా పోలీసు శాఖతో పాటు కలెక్టర్, రెవెన్యూ, అటవీ శాఖ అధికారులు, సీఆర్పీఎఫ్, గ్రేహౌండ్స్, ఎస్ఐబీ తదితర భద్రతా విభాగాల అధికారులు కలిసి వెళ్లారని డీజీపీ తెలిపారు. ఇంతకాలం మావోయిస్టు భయంతో ప్రభుత్వ యంత్రాంగం చేరుకోలేని ప్రాంతంలో ఇప్పుడు అధికారులు అడుగుపెట్టడం కీలక పరిణామమన్నారు.

మావోయిస్టు ప్రభావం తగ్గింది
తెలంగాణ ప్రాంతంలో గత 15 ఏళ్లుగా మావోయిస్టు సమస్య పెద్దగా లేకపోయినా.. ఏటూరునాగారం, ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతాల్లో మాత్రం ప్రభావం కొనసాగుతూ వచ్చిందని డీజీపీ వివరించారు. గత రెండేళ్లుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో చేపట్టిన చర్యలతో మావోయిస్టు సమస్యను గణనీయంగా నియంత్రించగలిగామని చెప్పారు. మావోయిస్టు సంస్థకు చెందిన సీనియర్ నాయకత్వంతో పాటు సెంట్రల్ కమిటీ సభ్యులు పలువురు లొంగిపోయారని, మరికొందరు ఎన్కౌంటర్లలో మృతి చెందారని తెలిపారు. వివిధ స్థాయిల్లోని క్యాడర్, దళ సభ్యులు, గ్రామ కమిటీ సభ్యులు పెద్ద సంఖ్యలో ఆయుధాలతో సహా ప్రభుత్వానికి లొంగిపోయారని చెప్పారు. లొంగిపోయిన వారికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో పునరావాస కార్యక్రమాలు అమలు చేస్తున్నామని డీజీపీ తెలిపారు. రివార్డు ఉన్న వారికి ఆ మొత్తాన్ని అందించడంతో పాటు.. రివార్డు లేని వారికి కూడా ఆర్థిక సహాయం అందిస్తున్నామని చెప్పారు. వ్యవసాయం చేసుకునేందుకు, ఇళ్లు నిర్మించుకునేందుకు భూమి కల్పించే చర్యలు కూడా చేపడుతున్నట్లు వివరించారు.

సరిహద్దులో భద్రతపై సమీక్ష
ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లా పూజెర్ కాంకేర్ పోలీస్స్టేషన్ పరిధిలోని తడపల సరిహద్దు ప్రాంతంలో ఉన్న సీఆర్పీఎఫ్ 196వ బెటాలియన్ క్యాంపును డీజీపీ సందర్శించారు. తెలంగాణ, ఛత్తీస్గఢ్ పోలీసు అధికారులు, భద్రతా బలగాల ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. సరిహద్దు ప్రాంతంలో భద్రతను మరింత పటిష్టం చేయడం, ఇరు రాష్ట్రాల పోలీసు బలగాల మధ్య సమన్వయం పెంచడం, రాకపోకలకు అనువుగా రహదారి సౌకర్యాలు కల్పించడం వంటి అంశాలపై చర్చించారు. ముఖ్యంగా సరిహద్దు ప్రాంతంలో సుమారు కిలోమీటరు మేర రహదారి నిర్మాణానికి సంబంధించిన అంశంపైనా సమీక్ష జరిగినట్లు సమాచారం. కర్రెగుట్ట చుట్టుపక్కల గ్రామాలు దాదాపు నాలుగు నుంచి ఐదు దశాబ్దాలుగా అభివృద్ధికి దూరంగా ఉన్నాయని డీజీపీ తెలిపారు. అక్కడ పాఠశాలలు, విద్యా సదుపాయాలు, ఆస్పత్రులు వంటి కనీస మౌలిక వసతులు కూడా లేవని పేర్కొన్నారు. ఇకపై ఆ ప్రాంతానికి విద్య, వైద్యం, రహదారులు, ఇతర మౌలిక వసతులను అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుందని స్పష్టం చేశారు. ‘‘సరిహద్దులో జాతీయ జెండా ఎగురవేయడం కేవలం ఒక కార్యక్రమం కాదు. ఇకపై కర్రెగుట్టలో అభివృద్ధి కార్యక్రమాలకు నాంది’’ అని డీజీపీ పేర్కొన్నారు. అనంతరం పామునూరు క్యాంపు వద్దకు చేరుకున్న డీజీపీకి పోలీసు అధికారులు, సిబ్బంది గౌరవ వందనం సమర్పించారు. గుత్తికోయ గూడెంలో ఎనిమిది కుటుంబాలకు పోలీసు ఉన్నతాధికారులతో కలిసి నిత్యావసర సరుకులు అందించారు. డీజీపీ పర్యటన నేపథ్యంలో ములుగు జిల్లా పోలీసు యంత్రాంగం, సీఆర్పీఎఫ్ బలగాలు ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేపట్టాయి.

