పెద్ది అంటే వ్యక్తి కాదు..శక్తి!
ఉద్యమ సహచరుడిగా పెద్ది అనుబంధాన్ని గుర్తుచేసుకున్న హరీశ్రావు
పెద్ది జన్మ ధన్యమైంది.. అలాంటి జనాభిమానాన్ని చూడలేదు
బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే పెద్ది పేరుతో మెమోరియల్ ఆస్పత్రి
గద్దె కూల్చినా.. ప్రజల గుండెల్లోంచి పెద్ది జ్ఞాపకాలను చెరపలేరు
బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
సంస్మరణ సభలో నేతల భావోద్వేగ ప్రసంగాలు
కాకతీయ, నల్లబెల్లి : ‘‘పెద్ది అంటే ఒక వ్యక్తి కాదు.. ఒక శక్తి’’ అని మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో నెలల తరబడి కలిసి పనిచేసిన అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ.. ప్రజల కోసం, తెలంగాణ కోసం పెద్ది సుదర్శన్రెడ్డి చేసిన పోరాటాన్ని కొనియాడారు. మాజీ మంత్రి కేటీఆర్ సైతం పెద్ది సుదర్శన్రెడ్డికి దక్కిన ప్రజాభిమానాన్ని గుర్తుచేస్తూ.. ‘‘పెద్ది జన్మ ధన్యమైంది.. అలాంటి జనాభిమానాన్ని నేను ఎప్పుడూ చూడలేదు’’ అన్నారు. దివంగత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి సంస్మరణ సభ సోమవారం నల్లబెల్లిలో భావోద్వేగ వాతావరణంలో జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడిన బీఆర్ఎస్ నేతలు.. ఉద్యమ సహచరుడిగా, ప్రజా నాయకుడిగా పెద్ది సుదర్శన్రెడ్డితో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి వస్తే పెద్ది పేరును మెమోరియల్ ఆస్పత్రికి పెడతామని కేటీఆర్ ప్రకటించారు. పెద్ది విగ్రహం కోసం ఏర్పాటు చేసిన గద్దెను కూల్చినంత మాత్రాన ప్రజల గుండెల్లో ఆయన జ్ఞాపకాలను చెరపలేరని వ్యాఖ్యానించారు.


నెలల తరబడి ఒకే ఇంట్లో..
తెలంగాణ ఉద్యమ సమయంలో పెద్ది సుదర్శన్రెడ్డితో కలిసి ఒకే ఇంట్లో ఉంటూ నెలల తరబడి ఉద్యమ కార్యక్రమాల్లో పాల్గొన్నామని హరీశ్రావు గుర్తుచేశారు. ధర్నాలు, రాస్తారోకోలు, ఆందోళనల్లో కలిసి పాల్గొన్నామని.. అమరవీరుల కోసం పోరాడుతూ లాఠీ దెబ్బలు తిన్నామని చెప్పారు. పెద్ది ఒక నియోజకవర్గానికి పరిమితమైన నాయకుడు కాదని.. తెలంగాణ ఉద్యమానికి వరంగల్ జిల్లాను అండగా నిలిపిన ఉద్యమ కెరటం అని కొనియాడారు. అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించే సమయంలో తాను ప్రమాదవశాత్తు జారిపడుతుండగా పెద్ది పట్టుకుని కాపాడిన ఘటనను హరీశ్రావు గుర్తుచేసుకున్నారు. అనంతరం తనకు యశోద ఆస్పత్రిలో చికిత్స చేయించారని తెలిపారు. ‘‘అలాంటి పెద్ది సుదర్శన్రెడ్డిని అదే ఆస్పత్రిలో అనారోగ్య పరిస్థితుల్లో చూడాల్సి వస్తుందని ఎప్పుడూ ఊహించలేదు’’ అంటూ భావోద్వేగానికి గురయ్యారు.
రైతుల కోసం రూ.100 కోట్ల అండ
ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో పెద్ది సుదర్శన్రెడ్డి రైతుల కోసం చేసిన సేవలను హరీశ్రావు ప్రత్యేకంగా ప్రస్తావించారు. తుఫాన్తో పంటలు దెబ్బతిన్న సమయంలో నియోజకవర్గ రైతులకు అండగా నిలిచారని తెలిపారు. సుమారు రూ.100 కోట్ల విలువైన వ్యవసాయ పరికరాలు, పంపులు, మోటార్లను రాయితీపై అందించేలా చర్యలు తీసుకున్నారని పేర్కొన్నారు. ఎకరాకు రూ.10 వేల చొప్పున రైతులకు సహాయం అందించిన నాయకుడిగా పెద్ది గుర్తుండిపోతారని అన్నారు. ప్రజల సమస్యలపై స్పందించే తత్వం, రైతుల పట్ల చిత్తశుద్ధి కారణంగానే పెద్ది సుదర్శన్రెడ్డి కేసీఆర్కు అత్యంత ఇష్టమైన నాయకుల్లో ఒకరిగా నిలిచారని హరీశ్రావు చెప్పారు. ప్రజల కోసం, తెలంగాణ కోసం ఆయన చేసిన పోరాటాన్ని ఎప్పటికీ మరిచిపోలేమన్నారు.
‘‘అలాంటి జనాభిమానాన్ని చూడలేదు’’
కేటీఆర్ మాట్లాడుతూ.. పెద్ది సుదర్శన్రెడ్డి జన్మ ధన్యమైందన్నారు. ముఖ్యమంత్రులు, ప్రముఖ నాయకులు మరణించినప్పుడు భారీగా ప్రజలు తరలిరావడం చూశామని.. అయితే పెద్ది అంతిమయాత్రలో కనిపించిన జనసందోహం, ప్రజాభిమానాన్ని తాను ఎప్పుడూ చూడలేదని పేర్కొన్నారు. పెద్దికి చివరి వీడ్కోలు పలికేందుకు ప్రజలు గంటల తరబడి వేచి ఉన్నారని, సుమారు 12 గంటలపాటు ఓపికగా నిలిచి నివాళులర్పించారని గుర్తుచేశారు. ఒక్కసారి ఎమ్మెల్యేగా పనిచేసిన నాయకుడి అంతిమయాత్రకు ఈ స్థాయిలో ప్రజలు స్వచ్ఛందంగా తరలిరావడం ఆయనకు ప్రజల్లో ఉన్న ఆదరణకు నిదర్శనమన్నారు.
పెద్ది పేరుతో మెమోరియల్ ఆస్పత్రి
మరో రెండేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే పెద్ది సుదర్శన్రెడ్డి పేరును మెమోరియల్ ఆస్పత్రికి అధికారికంగా పెట్టేలా చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. పెద్ది కుటుంబానికి బీఆర్ఎస్ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ‘‘గోదావరి నీళ్లు ప్రవహించినంతకాలం.. ఆస్పత్రిలో పుట్టే ప్రతి బిడ్డలో పెద్ది సుదర్శన్రెడ్డి జ్ఞాపకం ఉండేలా ఆయన పేరు నిలిచిపోతుంది’’ అని కేటీఆర్ అన్నారు. ప్రజల కోసం పెద్ది చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. పెద్ది సుదర్శన్రెడ్డి విగ్రహం కోసం ఏర్పాటు చేసిన గద్దెను కూల్చినంత మాత్రాన ఆయనను ప్రజల మనసుల్లోంచి తొలగించలేరని కేటీఆర్ అన్నారు. విగ్రహాలు, గద్దెలు తొలగించవచ్చేమో కానీ.. ప్రజల గుండెల్లో ఉన్న పెద్ది జ్ఞాపకాలను ఎవరూ చెరపలేరని వ్యాఖ్యానించారు. పెద్ది పదవుల కోసం కాకుండా ప్రజల కోసం పనిచేశారని.. అందుకే ఆయన మరణించిన సమయంలో ప్రజలు, అభిమానులు స్వచ్ఛందంగా భారీగా తరలివచ్చారని కేటీఆర్ గుర్తుచేశారు. ఆయనకు లభించిన అపూర్వమైన ప్రజాభిమానమే పెద్ది సుదర్శన్రెడ్డి ప్రజా జీవితానికి అసలైన గుర్తింపు అని అన్నారు. సంస్మరణ సభలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, ఎమ్మెల్సీ రవీందర్రావు, శంకర్నాయక్, మాలోత్ కవిత, వినయభాస్కర్, చల్లా ధర్మారెడ్డి, బడే నాగజ్యోతి, బండ ప్రకాశ్, ఎర్రల శ్రీనివాస్ తదితర బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, పెద్ది అభిమానులు పాల్గొన్నారు.

