కోల్డ్ స్టోరేజీల్లో ‘జీరో దందా’పై ఉక్కుపాదం!
ధరల వ్యత్యాసం.. ఆర్డీ అక్రమాలపై రాష్ట్రవ్యాప్త తనిఖీలు
ఖమ్మం ఘటనతో ప్రభుత్వం అప్రమత్తం
వరంగల్లో వెంకటసాయి కోల్డ్ స్టోరేజ్లో తనిఖీలు
కాకతీయ, వరంగల్ ప్రతినిధి: ఖమ్మం మార్కెట్లో ఇటీవల చోటుచేసుకున్న ఆర్డీ అనుమతి వ్యవహారం నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కోల్డ్ స్టోరేజీల్లో జరుగుతున్న ‘జీరో దందా’, ధరల వ్యత్యాసం, ఆర్డీ పేరుతో జరిగే అక్రమ లావాదేవీలపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక బృందాలను రంగంలోకి దించి కోల్డ్ స్టోరేజీల్లో ఆకస్మిక తనిఖీలు చేపడుతోంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు కరీంనగర్ జిల్లా నుంచి వచ్చిన ప్రత్యేక బృందం గురువారం వరంగల్ మార్కెట్ పరిధిలోని కోల్డ్ స్టోరేజీల్లో తనిఖీలు నిర్వహించింది. కరీంనగర్ జిల్లా బోయినపల్లి మార్కెట్ కార్యదర్శి పి. రమణ, కోరుట్ల మార్కెట్ కార్యదర్శి ఎం. ప్రశాంత్, మానకొండూరు సెక్రటరీ ఎం. శ్రావణ్తో కూడిన ప్రత్యేక బృందం వరంగల్ మార్కెట్ కార్యదర్శి శ్రీనివాస్, డీఎంఓ సురేఖ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టింది. తొలుత వెంకటసాయి కోల్డ్ స్టోరేజ్ను సందర్శించిన అధికారులు అక్కడి నిల్వలు, అమ్మకాలు, ప్రస్తుత స్టాక్ రిజిస్టర్లను క్షుణ్ణంగా పరిశీలించారు.


కాంటా చీటీలు.. సీసీ ఫుటేజ్ సేకరణ
కోల్డ్ స్టోరేజ్ యాజమాన్యం నుంచి కాంటా చీటీలు, స్టాక్ లావాదేవీలకు సంబంధించిన రికార్డులను అధికారులు తీసుకున్నారు. గత నెల రోజుల సీసీ కెమెరా ఫుటేజ్ను కూడా పరిశీలన కోసం కోరారు. స్టాక్కు సంబంధించిన అన్ని లావాదేవీల వివరాలను ఆన్లైన్లో తప్పనిసరిగా అప్లోడ్ చేయాలని ఆదేశించారు. కోల్డ్ స్టోరేజీలో రైతులకు చెందిన సరుకు ఎంత ఉంది? వ్యాపారులకు చెందిన సరుకు ఎంత ఉంది? ప్రస్తుతం ఎంత స్టాక్ ఉంది? ఎంత సరుకు విక్రయించారు? వంటి వివరాలు స్పష్టంగా నమోదు చేసి ఉంచాలని అధికారులు సూచించారు. ఇటీవల ఖమ్మం మార్కెట్లో ధరల్లో వ్యత్యాసం, ఆర్డీకి అనుమతి వంటి అంశాల నేపథ్యంలో వ్యాపారులు లావాదేవీలు నిలిపివేసిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఈ వ్యవహారం నేపథ్యంలో కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ ఉన్న సరుకు, విక్రయాల తీరుపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. కోల్డ్ స్టోరేజీల్లో సరుకు నిల్వలు, విక్రయాల్లో ‘జీరో దందా’, ఆర్డీ పేరుతో అక్రమ లావాదేవీలు జరుగుతున్నాయనే ఆరోపణల నేపథ్యంలో ప్రత్యేక బృందాలతో తనిఖీలు చేపడుతోంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో కొనసాగుతున్న తనిఖీల్లో రికార్డులు, స్టాక్ వివరాలు, కాంటా చీటీలు, సీసీ ఫుటేజ్ తదితరాలను అధికారులు పరిశీలిస్తున్నారు.
బయటపడనున్న అక్రమాలెన్ని?
కోల్డ్ స్టోరేజీల్లో రైతులు, వ్యాపారుల సరుకు నిల్వల మధ్య వ్యత్యాసాలు ఉన్నాయా? రికార్డుల్లో ఒక రకంగా.. క్షేత్రస్థాయిలో మరో రకంగా స్టాక్ చూపిస్తున్నారా? ఆర్డీ పేరుతో నిబంధనలకు విరుద్ధంగా లావాదేవీలు జరుగుతున్నాయా? అనే అంశాలపై అధికారులు దృష్టి సారించారు. ప్రత్యేక బృందాల తనిఖీల్లో ఇప్పటివరకు ఎలాంటి అక్రమాలు బయటపడ్డాయన్నది అధికారులు వెల్లడించాల్సి ఉంది. తనిఖీల అనంతరం రికార్డులు, స్టాక్ వివరాలను సరిపోల్చి అక్రమాలు గుర్తిస్తే సంబంధిత వ్యాపారులు, కోల్డ్ స్టోరేజ్ నిర్వాహకులపై ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. ఖమ్మం ఘటనతో మొదలైన ఈ తనిఖీలు రాష్ట్రవ్యాప్తంగా ‘జీరో దందా’పై ప్రభుత్వ నిఘా ఎంత మేరకు పనిచేస్తుందో తేల్చనున్నాయి.

