ములుగు ముస్తాబు..!
మేడారం నుంచి మహిళలకు ‘పింఛన్’
వనదేవతల సన్నిధిలో సీఎం రేవంత్రెడ్డి పూజలు
పైలాన్, కలెక్టరేట్ పనులకు తుది మెరుగులు
రూ.16 వేల కోట్ల హ్యామ్ రోడ్లకు శ్రీకారం
సీఎంను ఆహ్వానించేందుకు సర్వం సిద్ధం
ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి సీతక్క
కాకతీయ,ములుగు ప్రతినిధి : ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పర్యటనతో ములుగు జిల్లాలో సందడి నెలకొంది. ఈ నెల 16న సీఎం ములుగులో పర్యటించనుండటంతో అధికార యంత్రాంగం ఏర్పాట్లలో నిమగ్నమైంది. వనదేవతల కొలువైన మేడారం నుంచే ఒంటరి, వితంతు మహిళలకు పింఛన్ల పంపిణీకి సీఎం శ్రీకారం చుట్టనుండటంతో ఈ పర్యటనకు ప్రాధాన్యం ఏర్పడింది. సమ్మక్క–సారలమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ములుగు జిల్లా కేంద్రానికి చేరుకోనున్న సీఎం.. నూతన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయాన్ని ప్రారంభించడంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. దీంతో మేడారం నుంచి ములుగు వరకు అధికారులు ఏర్పాట్లను పరుగులు పెట్టిస్తున్నారు. పైలాన్ నిర్మాణం తుది దశకు చేరుకోగా.. కలెక్టరేట్ భవన సముదాయం సైతం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది.


తల్లుల చెంత నుంచే పింఛన్..
వనదేవతల సన్నిధి నుంచి అర్హులైన ఒంటరి, వితంతు మహిళలకు పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని సీఎం ప్రారంభించనున్నట్లు మంత్రి ధనసరి అనసూయ సీతక్క తెలిపారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ పింఛన్ అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఆగస్టు 31 వరకు దరఖాస్తులు స్వీకరించి అర్హులను గుర్తించి పింఛన్లు అందించనున్నట్లు చెప్పారు. సమ్మక్క–సారలమ్మ తల్లుల దీవెనలతో మహిళలు సంతోషంగా, ఆత్మగౌరవంతో జీవించాలన్న సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని మేడారం నుంచే ప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నారు. గతంలో అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం దరఖాస్తులను పరిశీలించి అర్హులను ఎంపిక చేస్తామని తెలిపారు.
పైలాన్కు తుది మెరుగులు..
సీఎం పర్యటన నేపథ్యంలో మేడారం, గట్టమ్మ, నూతన కలెక్టరేట్ ప్రాంతాల్లో పనులు వేగంగా సాగుతున్నాయి. గురువారం మంత్రి సీతక్క కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు, ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్, ఐటీడీఏ పీవో లెనిన్ వస్సల్ టోప్పోతో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. పైలాన్ నిర్మాణ పనులను పరిశీలించి నాణ్యతా ప్రమాణాలతో గడువులోపు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఎలాంటి జాప్యానికి తావులేకుండా అధికారులు, కాంట్రాక్టర్లు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కలెక్టరేట్ భవన సముదాయంలో వివిధ విభాగాల కార్యాలయాలు, సమావేశ మందిరాలు, పరిసర ప్రాంతాలను పరిశీలించిన మంత్రి.. పారిశుధ్యం, విద్యుత్, తాగునీరు, రహదారులు, పార్కింగ్ తదితర ఏర్పాట్లను పూర్తిచేయాలని ఆదేశించారు. సీఎం పర్యటనలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు.
మేడారంపై ప్రత్యేక దృష్టి..
మేడారం ఆలయ ప్రాంగణంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తున్నామని సీతక్క తెలిపారు. సీఎం రేవంత్రెడ్డి ఇప్పటికే రెండుసార్లు మేడారం వచ్చి ఆలయ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టారని గుర్తుచేశారు. తాజా పర్యటనలోనూ ఆలయ ప్రాంగణాన్ని పరిశీలించి భవిష్యత్ విస్తరణ, అభివృద్ధి పనులపై సీఎం సూచనలు, ఆదేశాలు ఇవ్వనున్నారని చెప్పారు. సీఎం ఆలోచనలు, మార్గదర్శకత్వానికి అనుగుణంగా మేడారాన్ని మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు. ముఖ్యమంత్రి పర్యటనకు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు హాజరుకానున్న నేపథ్యంలో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని మంత్రి సూచించారు. సీఎం పర్యటన సందర్భంగా భక్తులు, స్థానిక ప్రజలు అధికార యంత్రాంగానికి సహకరించాలని కోరారు.
రూ.16 వేల కోట్ల హ్యామ్ రోడ్లు..
మేడారం కార్యక్రమాల అనంతరం సీఎం ములుగు జిల్లా కేంద్రానికి చేరుకోనున్నారు. గట్టమ్మ సమీపంలో రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో మూడు విడతల్లో సుమారు రూ.16 వేల కోట్లతో చేపట్టనున్న హ్యామ్ రోడ్ల అభివృద్ధి పనుల పైలాన్ను ఆవిష్కరించనున్నారు. ప్రతి గ్రామానికి మెరుగైన రహదారి అనుసంధానం కల్పించాలనే లక్ష్యంతో హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ విధానంలో ఈ పనులు చేపడుతున్నట్లు సీతక్క తెలిపారు.
కలెక్టరేట్ ప్రారంభం..
హ్యామ్ రోడ్ల పైలాన్ ఆవిష్కరణ అనంతరం సీఎం నూతన కలెక్టరేట్ భవన సముదాయానికి చేరుకోనున్నారు. తొలుత తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించి, అనంతరం నూతన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయాన్ని ప్రారంభించనున్నారు. కలెక్టరేట్ ఆవరణలో ఏర్పాటు చేసే సభలో సీఎం రేవంత్రెడ్డి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేసేందుకు ప్రతి శాఖకు అప్పగించిన బాధ్యతలను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సీతక్క స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఏటూర్నాగారం ఏఎస్పీ మనన్ భట్, అదనపు కలెక్టర్లు సీహెచ్ మహేందర్ జి, సంపత్రావు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోతు రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రేగ కళ్యాణి, ఆర్డీవో కృష్ణవేణి, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

