రేవంత్..! వనదేవతలకు ముందు క్షమాపణ చెప్పు..
సమ్మక్క–సారక్క తల్లులపై ప్రమాణాలు చేసి మోసం చేశారు
హామీలపై మాట తప్పినందుకు ప్రజలను నయవంచన
ప్రకృతి విపత్తులకు సీఎం వైఖరే కారణం
కేసీఆర్ వేసిన పునాదులపై కాంగ్రెస్ రంగులు
ములుగు ప్రజలు వాస్తవాలను గమనిస్తున్నారు
బీఆర్ఎస్ ములుగు జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణ్బాబు
కాకతీయ, ఏటూరునాగారం : ములుగు జిల్లాలో వరుసగా చోటుచేసుకుంటున్న ప్రకృతి విపత్తులకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి దేవుళ్లపై పదేపదే ప్రమాణాలు చేసి, అనంతరం మాట తప్పడమే కారణమని బీఆర్ఎస్ ములుగు జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణ్బాబు తీవ్ర ఆరోపణలు చేశారు. ములుగు జిల్లాలో అడుగుపెట్టే ముందు సీఎం రేవంత్రెడ్డి సమ్మక్క–సారక్క వనదేవతల వద్ద ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలని, ప్రజలకు ఇచ్చిన హామీల విషయంలో మాట తప్పినందుకు ప్రజల ముందు క్షమాపణ చెప్పిన తర్వాతే కలెక్టరేట్ను ప్రారంభించాలని డిమాండ్ చేశారు. కాకతీయ, ఏటూరునాగారం : ములుగు జిల్లాకు సీఎం రేవంత్రెడ్డి వస్తున్న నేపథ్యంలో లక్ష్మణ్బాబు ఈ వ్యాఖ్యలు చేశారు. దేవతలపై ఓట్లు వేసి మాట తప్పడం సీఎంకు పరిపాటిగా మారిందని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి 420 హామీలు, ఆరు గ్యారెంటీల పేరుతో ప్రజలను మభ్యపెడుతున్నారని లక్ష్మణ్బాబు విమర్శించారు. సమ్మక్క–సారక్క తల్లులపై పదేపదే ప్రమాణాలు చేసి మాట తప్పడం వల్లే ములుగు ప్రాంతంలో టోర్నాడోలు, సుడిగాలులు, ఇతర ప్రకృతి విపత్తులు సంభవిస్తున్నాయని వ్యాఖ్యానించారు. గోదావరి కూడా ప్రజలను భయపెడుతున్న పరిస్థితులు నెలకొన్నాయని అన్నారు.
వనదేవతలను అవమానిస్తే క్షమించరు
వనదేవతలను అవమానించి, ప్రజల విశ్వాసాలతో చెలగాటమాడితే సమ్మక్క–సారక్క తల్లులు కూడా సీఎం రేవంత్రెడ్డిని క్షమించరని లక్ష్మణ్బాబు హెచ్చరించారు. ములుగు ప్రజల ఆరాధ్య దైవాలపై చేసిన ప్రమాణాలను, ప్రజలకు ఇచ్చిన హామీలను సీఎం నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే ప్రజలే తగిన సమాధానం చెబుతారని హెచ్చరించారు. ములుగు కలెక్టరేట్ నిర్మాణానికి మాజీ సీఎం కేసీఆర్ ఫౌండేషన్ వేసి, రూపురేఖలు తీసుకొచ్చి నిర్మాణాన్ని ముందుకు తీసుకెళ్లారని లక్ష్మణ్బాబు తెలిపారు. తాము కట్టిన కలెక్టరేట్కు రంగులు వేసుకుని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించినట్లుగా ప్రచారం చేసుకోవడం రాజకీయ ప్రచారంలో భాగమేనని విమర్శించారు. ఎవరు పునాదులు వేశారు, ఎవరు నిర్మాణాన్ని ముందుకు తీసుకెళ్లారు, ఇప్పుడు ఎవరు ప్రారంభిస్తున్నారో ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. కేసీఆర్ హయాంలో ప్రారంభమైన అభివృద్ధి పనులకు రంగులు వేసుకుని తమ ఘనతగా చెప్పుకోవడం, మరోవైపు దేవతలపై ప్రమాణాలు చేసి మాట తప్పడం కాంగ్రెస్ ప్రభుత్వ ద్వంద్వ వైఖరికి నిదర్శనమని లక్ష్మణ్బాబు మండిపడ్డారు. ప్రజల విశ్వాసాలను గౌరవించి, ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, లేకపోతే ప్రజలే తగిన సమాధానం చెబుతారని స్పష్టం చేశారు.

