మాపై వ్యాఖ్యల వెనుక ‘అదృశ్య హస్తం’!
మా కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని సమన్వయంతో వ్యాఖ్యలు
క్రమశిక్షణ కమిటీ విచారణను ప్రభావితం చేసే ప్రయత్నాలు
నోటీసుకు ఇప్పటికే వివరణ ఇచ్చా.. ఉపసంహరించుకోవాలి
టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవికి మంత్రి కొండా సురేఖ లేఖ
కాకతీయ, తెలంగాణ బ్యూరో : తనను, తన కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని పలువురు కాంగ్రెస్ నేతలు ఒకే తరహాలో బహిరంగ వ్యాఖ్యలు చేయడం వెనుక ‘అదృశ్య హస్తం’ ఉన్నట్లు అనుమానం కలుగుతోందని మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. ఎవరో ఒకరు నేతలను ప్రేరేపిస్తూ, సమన్వయం చేస్తూ నిర్దిష్ట లక్ష్యంతో తనపై, తన కుటుంబంపై వ్యాఖ్యలు చేయిస్తున్నారనే అనుమానం ఉందని తెలిపారు. ఈ వ్యవహారంపై నిష్పక్షపాతంగా విచారణ జరిపి.. వ్యాఖ్యలు చేయిస్తున్న అసలు వ్యక్తులను గుర్తించి పార్టీ క్రమశిక్షణ నియమావళి ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవిని కోరారు. ఈ మేరకు శనివారం ఆయనకు లేఖ రాశారు. టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ తనకు జారీ చేసిన నోటీసుకు ఇప్పటికే వివరణ సమర్పించినట్లు సురేఖ తెలిపారు. పార్టీ నాయకత్వంపై, క్రమశిక్షణ నియమావళిపై తనకు పూర్తి గౌరవం ఉందని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య విలువలను పరిగణనలోకి తీసుకుని తనకు జారీ చేసిన నోటీసును ఉపసంహరించుకోవాలని కోరారు.
ఒకే తరహాలో వరుస వ్యాఖ్యలు
పలువురు సీఎల్పీ నేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ హోదాల్లోని ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, మహిళా నేతలు తనను, తన కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని ఒకే తరహాలో వ్యాఖ్యలు చేస్తున్నారని సురేఖ పేర్కొన్నారు. వారి వ్యాఖ్యలను పరిశీలిస్తే.. వాటి వెనుక ఎవరో ఒకరు ఉండి ప్రేరేపిస్తున్నారనే అనుమానం కలుగుతోందన్నారు. తాను, తన కుటుంబ సభ్యులపై స్వతంత్రంగా అభిప్రాయాలు వ్యక్తం చేయడం కంటే.. ఒక నిర్దిష్ట లక్ష్యంతో, ఎవరో నిర్దేశించిన విధంగా మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తోందని తెలిపారు. ముఖ్యంగా పార్టీ క్రమశిక్షణ కమిటీ తనపై విచారణ కొనసాగిస్తున్న సమయంలోనే ఇలాంటి వ్యాఖ్యలు వెలువడటం ఆందోళన కలిగించే అంశమని పేర్కొన్నారు. తనపై వ్యాఖ్యలు చేస్తున్న నేతలను వెనుక నుంచి ప్రోత్సహిస్తూ, సమన్వయం చేస్తూ వ్యవహారాన్ని నడిపిస్తున్న అసలు వ్యక్తులు ఎవరో గుర్తించాలని సురేఖ కోరారు. ఈ వ్యవహారంపై నిష్పక్షపాతంగా విచారణ జరిపి బాధ్యులపై కఠిన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. సీనియర్ బీసీ మహిళా నాయకురాలైన తనపై తీవ్ర వ్యాఖ్యలతో సామూహిక దాడులు జరుగుతున్న సమయంలో పార్టీ నాయకత్వం మౌనం వహించడం ఆందోళన కలిగిస్తోందన్నారు. తనను బహిరంగంగా నిందిస్తూ, రాజకీయ భవిష్యత్తుపై తీర్పులు ఇస్తూ, తనపై చర్యలు తీసుకోవాలని మీడియా ముందుకు రావడం ద్వారా క్రమశిక్షణ కమిటీ స్వతంత్ర నిర్ణయాన్ని ప్రభావితం చేసే ప్రయత్నం జరిగిందా అనే కోణంలోనూ పరిశీలించాలని కోరారు.
పార్టీ క్రమశిక్షణపై పూర్తి గౌరవం
కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్య విలువలు, సామాజిక న్యాయం, మహిళా సాధికారత, బలహీన వర్గాల ఆత్మగౌరవానికి కట్టుబడి ఉన్న పార్టీ అని సురేఖ పేర్కొన్నారు. పార్టీ నాయకత్వంపై, పార్టీ క్రమశిక్షణ నియమావళిపై తనకు పూర్తి గౌరవం ఉందని స్పష్టం చేశారు. తనపై జరుగుతున్న వ్యాఖ్యలను కేవలం వ్యక్తిగత విమర్శలుగా చూడకుండా.. వాటి వెనుక ఉన్న సమన్వయం, ప్రేరేపణ, లక్ష్యాన్ని కూడా పరిశీలించాలని కోరారు. తనపై, తన కుటుంబ సభ్యులపై ఒకే విధమైన వ్యాఖ్యలు చేయిస్తున్న వారి వ్యవహారంపై వాస్తవాలను వెలికితీసి, బాధ్యులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. తనకు జారీ చేసిన నోటీసుకు ఇప్పటికే వివరణ ఇచ్చినందున దానిని ఉపసంహరించుకోవాలని కోరుతూ.. అదే సమయంలో తనపై, తన కుటుంబంపై జరుగుతున్న వరుస వ్యాఖ్యల వెనుక ఉన్న వ్యక్తులను గుర్తించి చర్యలు తీసుకోవాలని మంత్రి కొండా సురేఖ టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవిని కోరారు.

