నీటి కష్టాలకు కేసీఆర్ వైఫల్యాలే కారణం
రూ.1.81 లక్షల కోట్లు ఖర్చు చేసినా ప్రాజెక్టులు పూర్తి చేయలేదు
పాలమూరు–రంగారెడ్డిపై 90 శాతం పనులంటూ పచ్చి అబద్ధాలు
గడిచిన 3 జల సంవత్సరాల్లో కృష్ణా న్యాయవాటాను సమర్థంగా వినియోగించాం
కాళేశ్వరం బ్యారేజీలను శాస్త్రీయ పద్ధతుల్లో పునరుద్ధరిస్తాం
తెలంగాణ నదీజల హక్కుల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదు
నీటిపారుదల, పౌర సరఫరాల శాఖల మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి
కాకతీయ,తెలంగాణ బ్యూరో : తెలంగాణ రైతులు ప్రస్తుతం ఎదుర్కొంటున్న నీటి కష్టాలకు ఒకవైపు ఎల్నినో, మరోవైపు కేసీఆర్ వైఫల్యాలే కారణమని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖల మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. తెలంగాణ రైతుల ఇబ్బందులకు ఇద్దరే కారణమని, ఒకరు మిస్టర్ ఎల్నినో అయితే మరొకరు మిస్టర్ కేసీఆర్ అని వ్యాఖ్యానించారు. ప్రకృతి సృష్టించిన ప్రతికూల పరిస్థితులకు గత బీఆర్ఎస్ ప్రభుత్వ అసమర్థ సాగునీటి విధానాలు తోడవడంతో రాష్ట్రంలో నీటి ఎద్దడి తీవ్రరూపం దాల్చిందన్నారు. శాసనసభ లాబీల్లో సోమవారం మీడియా ప్రతినిధులతో ఉత్తమ్కుమార్రెడ్డి చిట్చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో నెలకొన్న నీటి పరిస్థితి, గత ప్రభుత్వ హయాంలో సాగునీటి ప్రాజెక్టులపై చేసిన వ్యయం, కృష్ణా జలాల వినియోగం, కాళేశ్వరం పునరుద్ధరణ తదితర అంశాలపై మాట్లాడారు. ఎల్నినో కారణంగా ప్రపంచవ్యాప్తంగా వర్షపాతం, నీటి లభ్యతపై ప్రభావం పడుతుందని, అది తెలంగాణ ప్రభుత్వం సృష్టించిన పరిస్థితి కాదని అన్నారు. దాని ప్రభావం ఒక్క తెలంగాణకే పరిమితం కాలేదని తెలిపారు. నీటి లభ్యత తగ్గే అవకాశాలను ముందుగానే అంచనా వేసి, నీటి వసతి అనిశ్చితంగా ఉన్న ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని రైతులకు పలుమార్లు సూచించామని చెప్పారు.
రూ.1.81 లక్షల కోట్లు ఖర్చు.. ప్రాజెక్టులు మాత్రం అసంపూర్తి
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో సాగునీటి రంగంపై సుమారు రూ.1.81 లక్షల కోట్లు ఖర్చు చేసినట్లు చెప్పుకున్నప్పటికీ, రాష్ట్ర ఆవిర్భావ సమయంలో పెండింగ్లో ఉన్న ప్రధాన ప్రాజెక్టుల్లో ఒక్కదానినీ సంపూర్ణంగా పూర్తి చేయలేకపోయారని ఉత్తమ్కుమార్రెడ్డి విమర్శించారు. కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయిల్సాగర్, భీమా, ఎస్ఎల్బీసీ సొరంగం వంటి కీలక ప్రాజెక్టులు భారీగా నిధులు వెచ్చించినా అసంపూర్తిగానే మిగిలిపోయాయని అన్నారు. సాగునీటి ప్రయోజనాలకు అనుగుణంగా ఫలితాలు సాధించకుండా పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, ఆర్ఈసీ వంటి సంస్థల నుంచి అధిక వడ్డీలకు భారీగా రుణాలు తీసుకున్నారని, ఆ అప్పుల భారాన్ని తెలంగాణ ప్రజలే మోయాల్సి వస్తోందన్నారు. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన ప్రచారాన్ని ఆయన తప్పుబట్టారు. సుమారు రూ.27,500 కోట్లు ఖర్చు చేసినప్పటికీ పంట పొలాలకు నీటిని చేర్చే డిస్ట్రిబ్యూటరీ కాలువల వ్యవస్థను నిర్మించలేదన్నారు. కాలువల నిర్మాణానికి అవసరమైన భూసేకరణ కూడా నామమాత్రంగానే జరిగిందని, అలాంటి ప్రాజెక్టును 90 శాతం పూర్తి చేశామని చెప్పడం పచ్చి అబద్ధమని విమర్శించారు. జూరాల నుంచి శ్రీశైలానికి నీటి వనరును మార్చడంపైనా ప్రశ్నించారు. జూరాల పూర్తిగా తెలంగాణ భూభాగంలో ఉండగా, శ్రీశైలం తెలంగాణ–ఆంధ్రప్రదేశ్ జల సంబంధాల్లో ఉమ్మడి జలాశయమని గుర్తుచేశారు.
బీఆర్ఎస్కు కాంగ్రెస్ను ప్రశ్నించే నైతిక హక్కు లేదు
పదేళ్లు అధికారంలో ఉండి సాగునీటి ప్రాజెక్టులను అసంపూర్తిగా వదిలేసిన బీఆర్ఎస్కు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించే నైతిక హక్కు లేదని ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. డిండి, గౌరవెల్లి, సీతారామ ప్రాజెక్టులకు సంబంధించిన కీలక అనుమతులు, ప్రధాన పనులను గత ప్రభుత్వం పూర్తి చేయలేకపోయిందన్నారు. డిండి ప్రాజెక్టుకు నీటి వనరును ఖరారు చేయడంతోపాటు పనులను ముందుకు తీసుకెళ్లేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సుమారు రూ.1,800 కోట్లు మంజూరు చేసిందని తెలిపారు. ప్రధాన ప్రాజెక్టులకు అవసరమైన పర్యావరణ అనుమతులను కూడా గత ప్రభుత్వం సాధించలేకపోయిందని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగిపోయి నిర్మాణ భద్రతే ప్రశ్నార్థకంగా మారిన పరిస్థితుల్లో ప్రజలను అక్కడికి తీసుకెళ్లి ఏం చూపిస్తారని కేసీఆర్ను ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు ఈ దుస్థితి ఎందుకు వచ్చిందో ముందుగా తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలని అన్నారు. నిపుణుల పరిశీలనల్లో బ్యారేజీల పునాదులు, నిర్మాణ వ్యవస్థలకు సంబంధించి తీవ్రమైన లోపాలు వెలుగుచూశాయని తెలిపారు. దేశీయ, అంతర్జాతీయ నిపుణుల సలహాలతో డయాఫ్రం వాల్స్, స్టిల్లింగ్ బేసిన్ వ్యవస్థల మెరుగుదలతోపాటు దీర్ఘకాలిక భద్రతకు అవసరమైన పునరుద్ధరణ చర్యలు చేపడుతున్నామని చెప్పారు.
కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా వదులుకోం
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గడిచిన 3 జల సంవత్సరాల్లో తెలంగాణకు న్యాయంగా దక్కాల్సిన కృష్ణా జలాలను సమర్థంగా వినియోగించుకున్నామని ఉత్తమ్కుమార్రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణకు దక్కాల్సిన ప్రతి నీటి బొట్టునూ సద్వినియోగం చేసుకోవాలన్న చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని తెలిపారు. కృష్ణా, గోదావరి నదీజలాల్లో తెలంగాణ న్యాయమైన వాటా కోసం జల వివాదాల ట్రిబ్యునళ్లు, కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సహా ప్రతి సమర్థ వేదికపైనా రాజీలేని పోరాటం కొనసాగిస్తున్నామని అన్నారు. కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్ విచారణల కోసం తాను స్వయంగా న్యూఢిల్లీ వెళ్లి న్యాయవాదులు, ఇంజినీర్లు, ఉన్నతాధికారులతో సమన్వయం చేసుకుంటూ తెలంగాణ వాదనను బలంగా వినిపించేలా చర్యలు తీసుకున్నానని చెప్పారు. ఆంధ్రప్రదేశ్కు అనుకూలంగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తోందన్న బీఆర్ఎస్ విమర్శలను ఖండించారు. తాను తెలంగాణ ప్రజలకు మాత్రమే జవాబుదారినని స్పష్టం చేశారు. నీటిపారుదల శాఖకు అవసరమైన నిపుణుల సేవలను మంత్రిగా తానే నిర్ణయిస్తానన్నారు. గత ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాలను సరిదిద్దాల్సిన బాధ్యత తమపై పడిందని ఉత్తమ్కుమార్రెడ్డి తెలిపారు. 2014లోనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఉంటే ప్రాణహిత–చేవెళ్ల, జూరాల ఆధారిత పాలమూరు–రంగారెడ్డి, కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయిల్సాగర్, భీమా, ఎస్ఎల్బీసీ, డిండి, గౌరవెల్లి ప్రాజెక్టులను తక్కువ వ్యయంతో పూర్తి చేసి ఉండేవారమన్నారు. రీడిజైన్ల పేరుతో అంచనా వ్యయాలను పెంచిన బీఆర్ఎస్ ప్రభుత్వం అందుకు అనుగుణంగా సాగునీటి సామర్థ్యాన్ని మాత్రం సృష్టించలేకపోయిందని విమర్శించారు. పంపులను ఎప్పుడు ప్రారంభించాలో, రిజర్వాయర్లను ఎలా నిర్వహించాలో, నీటిని ఎప్పుడు విడుదల చేయాలో తమకు తెలుసని అన్నారు. రాబోయే వేసవిలో సాగునీరు, తాగునీటి అవసరాలకు ఇబ్బందులు రాకుండా అందుబాటులో ఉన్న జలాశయ నిల్వలను శాస్త్రీయంగా పరిరక్షిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలోని ప్రధాన పెండింగ్ ప్రాజెక్టులను ప్రాధాన్య క్రమంలో పూర్తి చేస్తామని, కాళేశ్వరం బ్యారేజీలను నిపుణుల సూచనల మేరకు శాస్త్రీయ పద్ధతుల్లో పునరుద్ధరిస్తామని ఉత్తమ్కుమార్రెడ్డి వెల్లడించారు.

