బల్దియాలో ఇంటి నంబర్ల గోల్మాల్
అదనపు కమిషనర్ తీరుపై బాధితుడి ఆగ్రహం
లేని సర్వే నంబర్ చూపి 9 ఏళ్ల ఇంటి నంబర్ల రద్దు బల్దియా గ్రీవెన్స్ లో కమిషనర్ కు ఫిర్యాదు
ఏడీ సర్వేలో 624 అని తేలినా పట్టించుకోలేదు పునరుద్ధరించాలని వినతి
కాకతీయ, వరంగల్ ప్రతినిధి: గ్రేటర్ వరంగల్ పరిధిలో ఇంటి నంబర్ల కేటాయింపులో అక్రమం జరిగిందంటూ ఓ బాధితుడు జీడబ్ల్యూఎంసీ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు.
కరీమాబాద్ కు చెందిన శీక్ష కుమారస్వామి తన ఇంటి నంబర్ 18-5-241 ను ఫిర్యాదులో పేర్కొన్నారు. వివరాల ఇలా..
సర్వే నం. 527లో భూమి, ఇల్లు లేకపోయినా రామస్వామి వెంకటరెడ్డి అనే వ్యక్తి తన సర్వే నం. 624లోని భూమిని, ఇంటిని 527గా తప్పుగా చూపి తనకు 9 ఏళ్లుగా ఉన్న ఇంటి నంబర్లను అడిషనల్ కమిషనర్ ద్వారా రద్దు చేయించాడని ఆరోపించారు.
నా ఇంటి నంబర్ 47-5-1395/1/5, మంజుల ఇంటి నంబర్ 47-5-1395/1/4, పెంచాల రాజు ఇంటి నంబర్ 47-5-1395/1/3 కాగా, 9 ఏళ్లుగా పన్ను కడుతున్నామని, మేము రిజిస్ట్రేషన్ చేసుకోకముందే ఇక్కడ ఇంటి నంబర్ ఉందని పేర్కొన్నారు. ఏడీ సర్వే నివేదికలో కూడా మా భూమి 624లో ఉన్నట్లు స్పష్టంగా తేలిందన్నారు. అయినా పరిశీలించకుండా రద్దు చేసినట్లు తెలిపారు. ఇంతకు ముందు కమిషనర్ ఆ వ్యక్తికి ఇచ్చిన నంబర్ ను Roc.No.C.No.1/E-119307/2021 ద్వారా రద్దు చేశారు అని ఫిర్యాదులో తెలిపారు.
వెంటనే సర్వే నం. 624ను ప్రత్యక్షంగా పరిశీలించి, ఏడీ సర్వే రిపోర్టును పరిగణనలోకి తీసుకుని, తన ఇంటి నంబర్లను పునరుద్ధరించాలని, అక్రమంగా రద్దు చేసిన అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని కుమారస్వామి కమిషనర్ ను కోరారు.

