వృత్తి విద్యతో ఉపాధి అవకాశాలు
టెన్త్ తర్వాత సంప్రదాయ కోర్సులకే పరిమితం కావద్దు
చేనేత రంగంలో సాంకేతికత విద్యతో విస్తృత అవకాశాలు
తక్కువ ఫీజుతో నాణ్యమైన శిక్షణ.. నెలకు స్టైఫండ్ సౌకర్యం
జిల్లా చేనేత, జౌళి శాఖ సహాయ సంచాలకులు విజయలక్ష్మి
డిప్లొమా కోర్సు ప్రవేశాలపై విద్యార్థులకు అవగాహన సదస్సు
కాకతీయ, ఖమ్మం : పదవ తరగతి పూర్తయిన తర్వాత విద్యార్థులు కేవలం సంప్రదాయ కోర్సులకే పరిమితం కాకుండా, ఉపాధికి హామీ ఇచ్చే సాంకేతిక వృత్తి విద్యను ఎంచుకోవాలని హన్మకొండ జిల్లా చేనేత, జౌళి శాఖ సహాయ సంచాలకులు ఎం. విజయలక్ష్మి సూచించారు. మంగళవారం ఖమ్మం జిల్లా కలెక్టరేట్లో కొండా లక్ష్మణ్ బాపూజీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ , హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక అవగాహన సదస్సులో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా విజయలక్ష్మి మాట్లాడుతూ.. నేటి ఆధునిక కాలంలో చేనేత రంగం ఫ్యాషన్ డిజైనింగ్, టెక్స్టైల్ కెమిస్ట్రీ వంటి అత్యాధునిక సాంకేతికతతో వేగంగా అభివృద్ధి చెందుతోందని తెలిపారు. 2026-27 విద్యా సంవత్సరానికి గాను ‘డిప్లొమా ఇన్ హ్యాండ్లూమ్ మరియు టెక్స్టైల్ టెక్నాలజీస కోర్సులో ప్రవేశానికి ఉన్న అవకాశాలను విద్యార్థులు, తల్లిదండ్రులకు వివరించారు. కేవలం మగ్గం నేయడమే కాకుండా కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్ , స్మార్ట్ గార్మెంట్స్ తయారీలో అంతర్జాతీయ స్థాయి శిక్షణ ఈ కోర్సు ద్వారా అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు.
స్టైఫండ్ తో కూడిన నాణ్యమైన శిక్షణ
ఈ కోర్సు చదువుతున్న కాలంలో విద్యార్థులకు నెలకు రూ. 2,500 స్టైఫండ్ లభిస్తుందని, చేనేత కుటుంబాలకు చెందిన వారికి అదనంగా రూ. 5,000 వరకు వచ్చే అవకాశం ఉందని ఆమె వెల్లడించారు. ఏడాదికి కేవలం రూ. 4,250 ఫీజుతో నాణ్యమైన శిక్షణ పొందవచ్చని, కోర్సు పూర్తయ్యాక ప్రముఖ టెక్స్టైల్ కంపెనీలలో ఉద్యోగాలు లేదా స్వయం ఉపాధి పొందే వీలుందని తెలిపారు. పదవ తరగతి ఉత్తీర్ణత సాధించిన వారు ఈ కోర్సులో మెరిట్ ప్రాతిపదికన భర్తీ చేసే 60 సీట్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. ఆసక్తి గల అభ్యర్థులు ఏప్రిల్ మొదటి వారం లోపు తమ దరఖాస్తులను హైదరాబాద్ నాంపల్లిలోని తెలుగు యూనివర్సిటీ ప్రాంగణంలో సమర్పించాలని సూచించారు. ఖమ్మం జిల్లా విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ భవిష్యత్తుకు బలమైన పునాది వేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా చేనేత శాఖ సిబ్బంది, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

