డీఎల్ఈడీ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
ఏజెన్సీ గిరిజన అభ్యర్థులకు సువర్ణావకాశం
భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి.రాహుల్
కాకతీయ, కొత్తగూడెం : 2026-28 విద్యా సంవత్సరమునకు గాను భద్రాచలం ఐటీడీఏ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ప్రత్యేక గిరిజన డీఎల్ఈడీ కళాశాలలో ప్రవేశానికి అర్హులైన ఏజెన్సీ షెడ్యూల్డ్ ప్రాంత గిరిజన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతున్నట్లు ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంత గిరిజన అభ్యర్థుల సంక్షేమార్థం తెలుగు మీడియం 12వ బ్యాచ్ రెగ్యులర్ కోర్సులో ఈ ప్రవేశాలు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయ విద్యా కళాశాలలో మొత్తం 50 సీట్లు అందుబాటులో ఉన్నాయని, ఇంటర్మీడియట్ పరీక్షలో సాధించిన మెరిట్ ఆధారంగానే ఎంపిక ప్రక్రియ ఉంటుందని పీవో బి. రాహుల్ వివరించారు. అభ్యర్థులు తెలంగాణ రాష్ట్రంలోని ఏజెన్సీ షెడ్యూల్ ప్రాంతాలకు చెందిన గిరిజన అభ్యర్థులై ఉండాలని, మే లేదా జూన్ 2026 నాటికి ఇంటర్మీడియట్ పూర్తి చేసి కనీసం 45 శాతం మార్కులు సాధించి ఉండాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం మహిళలకు, ప్రత్యేక కేటగిరీ అభ్యర్థులకు సీట్ల రిజర్వేషన్లు వర్తిస్తాయని, పూర్తి పారదర్శకంగా మెరిట్ ప్రాతిపదికన అడ్మిషన్లు నిర్వహిస్తామని తెలిపారు.
ఉచితంగా దరఖాస్తుల పంపిణీ
ఈ కోర్సులో చేరాలనుకునే అభ్యర్థులు ఏటూరునాగారం, ఉట్నూర్, మన్ననూర్ ఐటీడీఏ కార్యాలయాలతో పాటు భద్రాచలం గిరిజన డీఎల్ఈడీ కళాశాలలో దరఖాస్తులు, ప్రాస్పెక్టస్ను ఉచితంగా పొందవచ్చని పీవో తెలిపారు. పోస్టు ద్వారా దరఖాస్తులు పొందగోరే వారు 10 రూపాయల స్టాంపుతో కూడిన స్వంత చిరునామా గల కవరును ప్రిన్సిపాల్, గిరిజన విద్యా కళాశాల, భద్రాచలం చిరునామాకు పంపాలని సూచించారు. పూర్తి చేసిన దరఖాస్తులను వచ్చే నెల 11వ తేదీలోపు సమర్పించాలని, అసంపూర్తిగా ఉన్న దరఖాస్తులను తిరస్కరిస్తామని పేర్కొన్నారు. మరిన్ని వివరాల కోసం 9959575539, 8639084543, 8309972776 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని కోరారు.

