రేపటి నుంచి రైతు సంఘం రాష్ట్ర మహాసభలు
రైతు సమస్యలపై విస్తృత చర్చలు
భవిష్యత్ పోరాట కార్యాచరణ సిద్ధం
మహాసభలకు ఏఐకేఎస్ జాతీయ నేతలు హాజరు
తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్
కాకతీయ, కొత్తగూడెం : తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర మూడవ మహాసభలు కొత్తగూడెంలో రేపటి నుంచి ఘనంగా ప్రారంభం కానున్నాయని సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్ వెల్లడించారు. ఏప్రిల్ 23, 24, 25 తేదీల్లో జరిగే ఈ సభలకు దేశవ్యాప్త రైతాంగ పోరాటాలకు నాయకత్వం వహించిన అతిరథ మహారథులు హాజరవుతున్నట్లు తెలిపారు. బుధవారం కొత్తగూడెంలోని మంచికంటి భవన్లో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మహాసభల వివరాలను వెల్లడించారు. ఢిల్లీ రైతు పోరాటంలో కీలక పాత్ర పోషించిన ఏఐకేఎస్ జాతీయ అధ్యక్షులు అశోక్ థావలే, జాతీయ ప్రధాన కార్యదర్శి విజ్జు క్రిష్ణన్ ఈ సభలకు ముఖ్య అతిథులుగా వస్తున్నారని పోతినేని సుదర్శన్ తెలిపారు. ఖమ్మం మాజీ ఎంపీ తమ్మినేని వీరభద్రం, ఇతర రాష్ట్ర నాయకులు కూడా పాల్గొంటారని పేర్కొన్నారు. రాష్ట్రంలోని రైతాంగం ఎదుర్కొంటున్న భూమి హక్కులు, సాగునీరు, కనీస మద్దతు ధర, రుణమాఫీ, రైతు భరోసా, అటవీ హక్కులు మరియు త్రీ ఫేస్ విద్యుత్ వంటి కీలక సమస్యలపై అన్ని జిల్లాల నుంచి వచ్చే ప్రతినిధులు ఈ సభల్లో సుదీర్ఘంగా చర్చించనున్నట్లు వివరించారు. దళారుల దోపిడీని అరికట్టేలా భవిష్యత్ ఉద్యమ ప్రణాళికను ఇక్కడ రూపొందిస్తామని స్పష్టం చేశారు.
ప్రభుత్వ విధానాలపై సెమినార్లు
మహాసభల సందర్భంగా పంటలు-ప్రణాళికలు అనే అంశంపై జరిగే సెమినార్లో వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ జానయ్య ప్రసంగిస్తారని సుదర్శన్ తెలిపారు. రైతాంగ పోరాటాలు-ప్రభుత్వ విధానాలు అనే అంశంపై ఏఐకేఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి విజ్జు క్రిష్ణన్ ప్రసంగించనున్నట్లు పేర్కొన్నారు. ఆహ్వాన సంఘం అధ్యక్షులు జలసూత్రం శివరాం ప్రసాద్ మాట్లాడుతూ సభల జయప్రదం కోసం సహకరించిన కొత్తగూడెం ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులు, భూమి హక్కుల సాధన కోసం నూతన ఉద్యమాలను రూపొందిస్తామని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు మచ్చ వెంకటేశ్వర్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా కార్యదర్శి అన్నవరపు సత్యనారాయణ, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు అన్నవరపు కనకయ్య, సీఐటీయూ జిల్లా అధ్యక్షులు కొలగాని బ్రహ్మచారి, రేపాకుల శ్రీనివాస్, లిక్కి బాలరాజు, కున్సోత్ ధర్మ తదితరులు పాల్గొన్నారు.

