నకిలీ కరెన్సీ ముఠా అరెస్టు..
1:3 ఆఫర్ పేరుతో భారీ మోసం
ల్యాప్టాప్లు ప్రింటర్లతో వంద రూపాయల నకిలీ నోట్ల ముద్రణ
బ్లాక్ మనీని అసలు నోట్లుగా మారుస్తామంటూ రసాయనాలతో మాయాజాలం
నిందితుల నుంచి 28 లక్షల రూపాయల విలువైన సామగ్రి స్వాధీనం
ఉమ్మడి వరంగల్ ఖమ్మం జిల్లాల్లో పలువురిని ముంచిన కేటుగాళ్లు
ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్
కాకతీయ, వరంగల్ బ్యూరో : నకిలీ కరెన్సీ నోట్లను తయారు చేసి మార్కెట్లో చలామణి చేస్తున్న గ్యాంగ్పై వరంగల్ టాస్క్ఫోర్స్, నర్సంపేట పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించి ఎనిమిది మందిని అరెస్టు చేశారు. సోమవారం ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్ కేసు వివరాలను వెల్లడించారు. నర్సంపేటకు చెందిన ముగ్గురు నిందితులు ల్యాప్టాప్, ప్రింటర్ల సహాయంతో అసలు రూ.100 నోట్లను కలర్ ప్రింట్ తీసి నకిలీ నోట్లుగా చలామణి చేస్తున్నారు. మరో ఐదుగురు నిందితులు తక్కువ డబ్బులకు ఎక్కువ డబ్బులు ఇస్తామంటూ 1:3 నిష్పత్తి ఆశచూపి ప్రజలను మోసం చేస్తున్నట్లు తెలిపారు.
రసాయనాలతో నోట్ల మాయ
ఈ మోసంలో భాగంగా నిందితులు అసలు రూ.500 నోట్లను రసాయన ద్రావణాల్లో ముంచి నల్లగా మార్చి, తిరిగి అవి అసలు రూపంలోకి వస్తాయని నమ్మబలికి బాధితుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేస్తున్నారు. నల్ల కాగితాలను నోట్లుగా చూపిస్తూ మాయాజాలం చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుల నుంచి నకిలీ నోట్లు, 1.48 లక్షల అసలు నగదుతో పాటు సుమారు 28 లక్షల రూపాయల విలువైన ల్యాప్టాప్లు, ప్రింటర్లు, 13 సెల్ఫోన్లు, రెండు కార్లను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టైన వారిలో శాగంటి కిరణ్, నీరటి శివ, నీరటి రంజిత్, గుడికందుల రవి, పోరిక రాజ్కుమార్, తనమాల రాజశేఖర్, ముదురుకోల యాకంబరం, చేను సాయికిరణ్ ఉన్నారు.
పాత నేరస్థులే..
అరెస్టైన వారు నర్సంపేట, ములుగు, ఖమ్మం, భువనగిరి, కొత్తగూడెం ప్రాంతాలకు చెందినవారని డీసీపీ వివరించారు. ఈ గ్యాంగ్ గతంలో ములుగు ఘన్పూర్, సికింద్రాబాద్ మోండా మార్కెట్, కొత్తగూడెం, కాకతీయ యూనివర్సిటీ, సుబేదారి తదితర ప్రాంతాల్లో మోసాలకు పాల్పడి కేసులు ఎదుర్కొన్నట్లు విచారణలో తేలింది. తాజాగా హైదరాబాద్ చత్రినాక, నర్సంపేట ప్రాంతాల్లో కూడా మోసాలు చేసినట్లు గుర్తించారు. నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన టాస్క్ఫోర్స్ ఏసీపీ మదుసూధన్, నర్సంపేట ఏసీపీ రవీందర్ రెడ్డి, ఇన్స్పెక్టర్లు బాబులాల్, శ్రీనివాస్ సహా పోలీసు సిబ్బందిని సీపీ అభినందించారు.

