పీఎంజీఎస్వై పనులకు మరిన్ని నిధులివ్వాలి
తెలంగాణకు అదనపు అనుమతులు మంజూరు చేయాలి
రాష్ట్రాలపై నలభై శాతం భారం వేయడం తగదు
గతంలో మాదిరిగా వంద శాతం నిధులు కేంద్రమే భరించాలి
ఆదివాసీల అభివృద్ధికి అడ్డుగా ఉన్న చట్టాలను సవరించాలి
అటవీ నిబంధనలతో ఏజెన్సీ ప్రాంతాల్లో పనులు ఆలస్యం
దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ సమావేశంలో మంత్రి సీతక్క విజ్ఞప్తి
కాకతీయ,తెలంగాణ బ్యూరో : ప్రధాన్ మంత్రి గ్రామ సడక్ యోజన కింద తెలంగాణ రాష్ట్రానికి మరిన్ని రహదారి పనులు మంజూరు చేయాలని, ముఖ్యంగా ఆదివాసి, గిరిజన మారుమూల ప్రాంతాల్లో రహదారి అనుసంధానానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ సీతక్క కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. హైదరాబాద్లో జరిగిన దక్షిణాది రాష్ట్రాల పీఎంజీఎస్వై ప్రాంతీయ సమావేశంలో మంత్రి సీతక్క పాల్గొని రాష్ట్ర సమస్యలు, అవసరాలను కేంద్ర ప్రభుత్వ ప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ ఉన్నత స్థాయి సమావేశంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సంయుక్త కార్యదర్శి అతిథి సింగ్, ఎన్ఆర్ఐడీఏ డైరెక్టర్ జనరల్, దక్షిణాది రాష్ట్రాల అధికారులు, ఈఎన్సీలు, సీఈలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ గత 25 ఏళ్లుగా పీఎంజీఎస్వై గ్రామీణ ప్రాంతాల్లో విద్య, వైద్యం, ఉపాధి, మార్కెట్లకు రాకపోకలను మెరుగుపరిచిందన్నారు. ప్రస్తుతం ఈ పథకం మారుమూల గ్రామాలు, ఆదివాసి గిరిజన గూడెలను మైదాన ప్రాంతాలతో అనుసంధానం చేస్తోందని చెప్పారు. అయితే గతంలో ప్రధానమంత్రి గ్రామీణ యోజన పథకానికి 100 శాతం నిధులను కేంద్ర ప్రభుత్వమే భరించేదని గుర్తుచేశారు. కానీ ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం నిబంధనలు మార్చి రాష్ట్రాలపై 40 శాతం భారం వేస్తోందని, ఆ విధానాన్ని తక్షణమే పునఃసమీక్షించాలని డిమాండ్ చేశారు. ఆర్థికంగా వెనుకబడిన, భౌగోళికంగా క్లిష్టమైన ప్రాంతాల రాష్ట్రాలకు ప్రత్యేక సడలింపులు అవసరమని స్పష్టం చేశారు.
అటవీ చట్టాలతో పనులకు ఆటంకం
ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఆదిలాబాద్, ఆసిఫాబాద్ వంటి ఆదివాసి, గిరిజన ప్రాంతాల్లో అటవీ, వన్యప్రాణి చట్టాల కారణంగా రోడ్డు పనులకు అనుమతులు తీవ్రంగా ఆలస్యమవుతున్నాయని మంత్రి సీతక్క పేర్కొన్నారు. గిరిజనాభివృద్ధి, గ్రామీణ రవాణా సౌకర్యాల దృష్ట్యా అటవీ, వన్యప్రాణి నిబంధనల్లో అనుకూల మార్పులు చేయాలని కేంద్రాన్ని కోరారు. ఇప్పటికే ఉన్న పాత రహదారులు, కల్వర్టులు దెబ్బతిన్న ప్రాంతాల్లో పునర్నిర్మాణం, అప్గ్రేడేషన్ పనులకు కూడా అటవీ నిబంధనలు అడ్డంకిగా మారాయని, ఆయా పనులకు సులభంగా అనుమతులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అటవీ సంరక్షణ చట్టాల్లో ఈ మధ్య కాలంలో తెచ్చిన మార్పులు ఆదివాసీల అభివృద్ధికి అటంకంగా మారుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
మౌలిక వసతులకు ప్రాధాన్యం
తెలంగాణ ప్రభుత్వం గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధికి అత్యంత అధిక ప్రాధాన్యం ఇస్తోందని, నాణ్యమైన రోడ్ల నిర్మాణం, నిర్వహణలో ఆధునిక సాంకేతికతలను వినియోగిస్తోందని మంత్రి సీతక్క తెలిపారు. గ్రామీణ రహదారుల నిర్వహణ కోసం హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ను రాష్ట్రం విజయవంతంగా అమలు చేస్తోందన్నారు. పీఎంజీఎస్వై-4 కింద తెలంగాణలో ఇంకా అనేక ప్రాంతాలకు రోడ్డు అనుసంధానం అవసరమని, మార్కెట్లు, పాఠశాలలు, ఆస్పత్రులు, అభివృద్ధి కేంద్రాలకు గ్రామీణ ప్రజలు సులభంగా చేరుకునేలా మరిన్ని పనులు మంజూరు చేయాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖను కోరారు.
కేంద్ర ప్రతినిధుల సానుకూల స్పందన
మంత్రి సీతక్క చేసిన విజ్ఞప్తులపై కేంద్ర ప్రతినిధులు సానుకూలంగా స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తావించిన కీలక అంశాలు, అభిప్రాయాలు, అభ్యంతరాలను కేంద్ర ప్రభుత్వానికి నివేదిస్తామని కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ సెక్రెటరీ అతిథి సింగ్ తెలిపారు. అటవీ, వన్యప్రాణి చట్టాల కారణంగా ఎదురవుతున్న సమస్యలపై కేంద్ర స్థాయిలో చర్చించి, పనుల వేగవంతానికి తీసుకోవాల్సిన చర్యలను పరిశీలిస్తామని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక అనుమతుల మంజూరు అంశాన్ని కూడా సానుకూలంగా పరిశీలిస్తామని హామీ ఇచ్చారు.

