మెట్రో ఫేజ్-2కు ఎన్ఓసీ ఇవ్వండి
లేదంటే ప్రాజెక్టును వదిలేయండి
సొంతంగానే మెట్రో పనులు పూర్తి చేసుకుంటాం
కేంద్ర ప్రభుత్వానికి సీఎం రేవంత్ రెడ్డి స్పష్టీకరణ
హైదరాబాద్ మెట్రో విస్తరణపై కేంద్రం నాన్చుడు ధోరణి
రాష్ట్ర ప్రభుత్వం అడిగినా లోన్ ట్రాన్స్ఫర్ చేయడం లేదు
రాష్ట్రాభివృద్ధికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సహకరించడం లేదు
సచివాలయంలో మీడియా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి
కాకతీయ,తెలంగాణ బ్యూరో : మెట్రో ఫేజ్-2 నిర్మాణంలో కేంద్రం భాగస్వామ్యం వద్దు అనుకుంటే, స్పష్టంగా ఎన్ఓసీ ఇచ్చేయాలని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తాము పూర్తిగా బాధ్యత వహించి, మెట్రో విస్తరణ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తామని తెలిపారు. అన్ని రాష్ట్రాల్లో మెట్రో విస్తరణకు కేంద్రం 50 శాతం నిధులు ఇస్తున్నప్పుడు, తెలంగాణ విషయంలో ఎందుకు వివక్ష చూపుతున్నారని ఆయన ప్రశ్నించారు. హైదరాబాద్ అభివృద్ధి కోసం తాము అందరినీ కలుపుకుని వెళ్లాలని చూస్తున్నామని, రాజకీయాలకు అతీతంగా సామరస్యపూర్వకంగా సమస్యను పరిష్కరించాలని కోరుతున్నామని ఆయన చెప్పారు. అవసరమైతే ఈ ఒప్పందాలన్నింటినీ రాష్ట్ర ఎంపీలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరిస్తానని ఆయన తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణాలతో హైదరాబాద్ను తీర్చిదిద్దడమే లక్ష్యంగా పెట్టుకున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. జంటనగరాల ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందించేందుకు తాము కట్టుబడి ఉన్నామని ఆయన తెలిపారు. మెట్రో ఫేజ్-2 విస్తరణలో భాగంగా కేంద్రం నిధుల విడుదలలో చేస్తున్న జాప్యంపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కేంద్రం అడ్డుపడుతున్నా పనులను ఎంతటి ఖర్చయినా సరే తామే పూర్తి చేస్తామని, అవసరమైతే ఎన్ఓసీ ఇచ్చి కేంద్రం తన భాగస్వామ్యాన్ని వదులుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. సచివాలయంలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ధనసరి అనసూయ సీతక్క, వాకిటి శ్రీహరి, మహమ్మద్ అజారుద్దీన్, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలతో కలిసి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.
నిధులు ఎందుకు విడుదల చేయడం లేదు..?
హైదరాబాద్ మహానగరానికి అత్యంత ఆవశ్యకత కలిగిన మెట్రో విస్తరణ కోసం ఎల్ అండ్ టీ నుంచి మెట్రోను స్వాధీనం చేసుకోవడానికి అన్ని ఒప్పందాలు కుదిరినప్పటికీ, ఐఆర్ఎఫ్సీ నుంచి నిధులు ఎందుకు విడుదల కాలేదని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. మెట్రో స్వాధీనానికి అవసరమైన రూ.13,600 కోట్ల కోసం కేంద్ర ప్రభుత్వ సంస్థ ఐఆర్ఎఫ్సీతో అన్ని ఒప్పందాలు పూర్తయ్యాయని ఆయన తెలిపారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కౌంటర్ గ్యారెంటీ కూడా ఉందని, జపాన్ ఆర్థిక సంస్థ ద్వారా నిధులు ఇప్పటికే ఐఆర్ఎఫ్సీ ఖాతాలోకి చేరాయని ఆయన చెప్పారు. అయినప్పటికీ నిధులు విడుదల చేయకుండా ఎందుకు ఆపుతున్నారని, దీనికి కారణం ఎవరు? అని ఆయన నిలదీశారు. ప్రాజెక్టు కోసం ప్రభుత్వం రూ.84 కోట్ల ఫీజుతో పాటు ఈక్విటీ కింద రూ.1400 కోట్లను ఇప్పటికే చెల్లించిందని ఆయన వివరించారు.
మెట్రో విస్తరణలో రాజకీయ కుట్రలు
మెట్రో ఫేజ్-1 ప్రాజెక్టు వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో అంకురార్పణ జరిగిందని, అప్పట్లో ఢిల్లీ మెట్రోను ఆదర్శంగా తీసుకుని టెండర్లు పిలిచారని సీఎం గుర్తుచేశారు. మొదట్లో రూ.15 వేల కోట్లతో మొదలైన ప్రాజెక్టు వ్యయం, పాలకుల నిర్లక్ష్యంతో రూ.22 వేల కోట్లకు చేరిందని ఆయన విమర్శించారు. గత పదేళ్లలో మెట్రో విస్తరణపై కనీస ఆలోచన చేయకపోవడంతో, దేశంలో రెండో స్థానంలో ఉన్న హైదరాబాద్ మెట్రో 9వ స్థానానికి పడిపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సికింద్రాబాద్ ఎంపీగా ఉండి కూడా ప్రాజెక్టుకు అడ్డంకులు సృష్టించడం సరికాదని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వ మంత్రుల వద్దకు వెళ్లిన ప్రతిసారీ కిషన్ రెడ్డి అడ్డుపడుతున్నారని, ఇది హైదరాబాద్ అభివృద్ధిపై కుట్ర అని ఆయన ఆరోపించారు.
ప్రజా ప్రయోజనాలే లక్ష్యంగా విస్తరణ
హైదరాబాద్లో జనాభా 1.34 కోట్లకు చేరుకున్న తరుణంలో మెట్రో విస్తరణ అత్యంత కీలమని సీఎం నొక్కి చెప్పారు. ఎల్ అండ్ టీ సంస్థ ఫేజ్-2 నిర్మాణానికి నిరాకరించినప్పుడు, ప్రభుత్వమే బాధ్యత తీసుకుని ప్రజా రవాణా సౌకర్యాలను మెరుగుపరచాలని నిర్ణయించిందని ఆయన తెలిపారు. రూ.30 వేల కోట్ల విలువైన మెట్రో ప్రాజెక్టును రూ.15 వేల కోట్లకే రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసిందని ఆయన వెల్లడించారు. ఇతర ప్రాజెక్టులకు 8 నుంచి 11 శాతం వడ్డీ తీసుకున్న గత ప్రభుత్వాల వలె కాకుండా, తాము జపాన్ సంస్థ ద్వారా కేవలం 4 శాతం వడ్డీకే రుణ ఒప్పందం చేసుకున్నామని సీఎం వివరించారు.

