మందకొడిగా నైరుతి రుతుపవనాలు
రాష్ట్రమంతా విస్తరణ ఆలస్యం అవుతోంది
తెలంగాణ అంతటా విస్తరించేందుకు ఇంకా నాలుగైదు రోజుల సమయం
ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వేడిగాలులతో పాటు మండుతున్న ఎండలు
ఉమ్మడి ఆదిలాబాద్ కరీంనగర్ నిజామాబాద్ జిల్లాలకు వడగాల్పుల హెచ్చరిక
రేపటి నుంచి తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు
హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్
కాకతీయ,తెలంగాణ బ్యూరో : నైరుతి రుతుపవనాలు మందకొడిగా ముందుకు సాగడం వల్లే తెలంగాణ అంతటా విస్తరించడంలో ఆలస్యం అవుతోందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ తెలిపారు. రాష్ట్రమంతా రుతుపవనాలు పూర్తిగా విస్తరించేందుకు ఇంకా నాలుగైదు రోజుల సమయం పట్టే అవకాశం ఉందని వెల్లడించారు. ఈ లోపు ఉత్తర భారతదేశం నుంచి ఉత్తర తెలంగాణలోకి వేడిగాలుల రాక ఇంకా కొనసాగుతుందని, దీనివల్ల అక్కడ ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటూ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటుతున్నాయని స్పష్టం చేశారు. అయితే మరో 4 రోజుల్లో ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉందని ఆయన అంచనా వేశారు. ఉత్తర తెలంగాణలోని పలు జిల్లాల్లో హీట్ వేవ్ పరిస్థితులు తీవ్రంగా ఉన్నాయని శ్రీనివాస్ పేర్కొన్నారు. ఇవాళ, రేపు ఉమ్మడి ఆదిలాబాద్తో పాటు కరీంనగర్, పెద్దపల్లి, నిజామాబాద్ జిల్లాల్లో వడగాల్పులు వీస్తాయని స్పష్టం చేశారు. ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. క్యూములోనింబస్ మేఘాల ప్రభావం వల్ల ప్రస్తుతం దక్షిణ, మధ్య తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడా వర్షాలు కురుస్తున్నాయని, ఆ తర్వాత ఈ నెల 18 నుంచి 24 వరకు రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు.
పది శాతం లోటు వర్షపాతం
నైరుతి రుతుపవనాలు ఈ నెల 8న దక్షిణ తెలంగాణలోకి ప్రవేశించి జోగులాంబ గద్వాల జిల్లాను ఆవరించగా, ప్రస్తుతం హైదరాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల మీదుగా ఉత్తర సరిహద్దు కొనసాగుతోందని శ్రీనివాస్ వివరించారు. దక్షిణ తెలంగాణలోని అన్ని జిల్లాలతో పాటు మధ్య తెలంగాణలోని వివిధ జిల్లాలను రుతుపవనాలు తాకాయన్నారు. రాష్ట్రంలో జూన్ 1 నుంచి ఇప్పటివరకు 49.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవగా, సాధారణ వర్షపాతంతో పోలిస్తే సుమారు 10 శాతం లోటు ఉందని తెలిపారు. రానున్న రోజుల్లో ద్రోణి, అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నందున ఉత్తర, ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. ఈనెల 18 నుంచి కురిసే భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్ర ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని రాష్ట్ర రెవెన్యూ, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనల మేరకు రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు విపత్తుల నిర్వహణ యంత్రాంగాన్ని పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉంచినట్లు తెలిపారు. జిల్లా కలెక్టర్లు, రెవెన్యూ అధికారులు వాతావరణ శాఖ హెచ్చరికలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ నిరంతరం సమన్వయంతో పనిచేయాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఈ సమీక్షా సమావేశంలో వాతావరణ శాఖ శాస్త్రవేత్తలు, విపత్తు నిర్వహణ విభాగం ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

