నిలిచిన వాహన్ సారథి సేవలు
ఆర్టీఏ కార్యాలయాల్లో పూర్తిగా స్తంభించిన సేవలు
రెండు రోజులుగా పనిచేయని సాఫ్ట్వేర్
వాహనదారులకు తప్పని సుదీర్ఘ నిరీక్షణ
సీజ్ చేసిన ట్రాక్టర్లు విడుదల కాక రైతుల ఇబ్బందులు
నిలిచిన కొత్త వాహనాల రిజిస్ట్రేషన్లు జరిమానాల చెల్లింపులు
మా చేతిలో ఏమీ లేదంటూ చేతులెత్తేసిన రవాణా శాఖ అధికారులు
సాఫ్ట్వేర్ సమస్యను వెంటనే పరిష్కరించాలంటూ వాహనదారుల డిమాండ్
కాకతీయ,తెలంగాణ బ్యూరో : తెలంగాణ వ్యాప్తంగా వాహన్ సారథి పోర్టల్ కార్యకలాపాలు సాంకేతిక కారణాల వల్ల పూర్తిగా నిలిచిపోయాయి. నిన్నటి నుంచి రవాణా శాఖలో సారథి సాఫ్ట్వేర్ పనిచేయకపోవడంతో రెండు రోజులుగా ఆర్టీఏ సేవలు నిలిచిపోయి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో రాష్ట్రంలోని అన్ని రవాణా శాఖ కార్యాలయాలకు వాహనదారులు భారీగా చేరుకోవడంతో సుదీర్ఘమైన క్యూ లైన్లు దర్శనమిస్తున్నాయి. సమస్యపై అక్కడి అధికారులు స్పందించకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వాహనదారులు అధికారులతో వాగ్వాదానికి దిగుతున్నారు. సాంకేతిక సమస్య తమ చేతిలో లేదంటూ సంబంధిత రవాణా శాఖ అధికారులు చేతులెత్తేయడంపై వాహనదారులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.
నాలుగు రోజులుగా నిలిచిన పనులు
రెండవ శనివారం సెలవు కావడం, ఆపై సోమవారం నుండి సాఫ్ట్వేర్ పనిచేయకపోవడంతో గడిచిన నాలుగు రోజులుగా పనులన్నీ ఆగిపోయాయని వాహనదారులు వాపోతున్నారు. సాఫ్ట్వేర్ను వెంటనే సవరించి కొత్త వాహనాల రిజిస్ట్రేషన్లు, ఇతర సేవలను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నారు. ఏదో ఒక రకంగా ఈరోజు సమస్యను పరిష్కారం చేయాలంటూ కొన్ని చోట్ల కార్యాలయాల వద్ద అధికారులను వాహనదారులు వేడుకుంటున్నారు. కొత్త వాహనాల రిజిస్ట్రేషన్లు, పాత వాహనాల జరిమానాల చెల్లింపులు పూర్తిగా నిలిచిపోవడంతో అవసరానికి వాహనాలు అందుబాటులో లేక యజమానులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో రైతన్నల ఆవేదన
మరోవైపు వివిధ కారణాల వల్ల అధికారులు సీజ్ చేసిన వాహనాల యజమానులకు ఈ సాఫ్ట్వేర్ సమస్య వల్ల మరిన్ని ఇబ్బందులు వచ్చిపడ్డాయి. ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయ పనులు ముమ్మరంగా సాగుతున్న తరుణంలో, రవాణా శాఖ అధికారులు సీజ్ చేసిన ట్రాక్టర్లు, ఇతర ట్రాలీ వాహనాలు విడుదల కాకపోవడంతో యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పొలం పనులకు అత్యంత కీలకమైన సమయంలో వాహనాలు పోలీస్ స్టేషన్లు, ఆర్టీఏ కార్యాలయాలకే పరిమితమవడంతో వ్యవసాయ పనులకు ఆటంకం కలుగుతోందని ఆందోళన చెందుతున్నారు.
లగేజీ వాహనాలను విడుదల చేయాలని విజ్ఞప్తి
కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియ కంటే ముందుగా గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయ అవసరాలకు ఉపయోగపడే ట్రాక్టర్లు, ట్రాలీలు, ఆటోలు, ఇతరత్రా లగేజీ ట్రాన్స్పోర్ట్ వాహనాలను సీజ్ నుండి విడుదల చేసేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని యజమానులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ సమస్యపై రవాణా శాఖ ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి సాఫ్ట్వేర్ లోపాలను సరిచేయాలని, ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా అయినా సీజ్ చేసిన వాహనాల విడుదలకు అనుమతులు ఇవ్వాలని కోరుతున్నారు. ఈ నిరసనలు, విజ్ఞప్తుల కార్యక్రమంలో వందలాది మంది రైతులు, లగేజీ వాహనదారులు, రవాణా రంగ ప్రతినిధులు పాల్గొన్నారు.

