ప్రభుత్వ బడులే భవిష్యత్తుకు బాటలు
మట్టిలో మాణిక్యాల వెలికితీతకు శ్రీకారం
కార్పొరేట్కు దీటుగా ప్రపంచ స్థాయి ప్రమాణాలు
ఆరుట్ల పాఠశాల తెలంగాణకు ఆదర్శం
విద్యపై చేసే వ్యయం భవిష్యత్తు పెట్టుబడి
ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్ వరకూ నాణ్యమైన విద్య
వంద శాతం అడ్మిషన్లతో ఆదర్శంగా కమిటీ
కులాల అడ్డుగోడలను తొలగించేలా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు
మాదకద్రవ్యాల మహమ్మారిపై విద్యార్థుల్లో చైతన్యం
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
ఆరుట్లలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ప్రారంభోత్సవం
కాకతీయ,తెలంగాణ బ్యూరో : ప్రభుత్వ పాఠశాలలంటే కేవలం ఆర్థికంగా చితికిపోయిన వారి కోసమో, అనాథల కోసమో మాత్రమేనన్న అపోహలు ఇక చెల్లవు, మట్టిలో మాణిక్యాలను వెలికితీసే సమయం ఆసన్నమైంది, తెలంగాణ విద్యార్థి లోకానికి ఆరుట్ల పబ్లిక్ స్కూల్ ఒక దిక్సూచిలా నిలవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వ పాఠశాల అనగానే తక్కువగా చూసే సమాజపు దృక్పథం మారాలి, ప్రభుత్వ బడుల్లో చదువుకునే పిల్లలు కూడా డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులుగా రాణించగలరన్న బలమైన నమ్మకాన్ని కల్పించాలి, ఆరుట్ల పాఠశాల ప్రాంగణంలోకి అడుగుపెట్టిన ప్రతి విద్యార్థిలో అద్భుతమైన ఆత్మవిశ్వాసం కనిపించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. రంగారెడ్డి జిల్లా ఆరుట్లలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన తెలంగాణ పబ్లిక్ స్కూలును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఇదే సందర్భంలో విద్యార్థుల కోసం ఉదయం అందించే పౌష్టికాహార పథకాన్ని కూడా ఆయన లాంఛనంగా ప్రారంభించి, విద్యార్థులతో కలిసి కాసేపు ముచ్చటించారు. ఈ కార్యక్రమం రాష్ట్ర విద్యా విధానంలో ఒక నూతన అధ్యాయానికి నాంది పలికింది.





అపనమ్మకాలకు స్వస్తి.. ఆత్మవిశ్వాసానికి భరోసా
సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న 27 లక్షల మంది విద్యార్థులకు ఆరుట్ల స్కూలు ఆదర్శమని స్పష్టం చేశారు. ఈ పాఠశాల ఏర్పాటులో కృషి చేసిన మేనేజ్మెంట్ కమిటీ, ఉపాధ్యాయులను ముఖ్యమంత్రి ప్రత్యేకంగా అభినందించారు. ముఖ్యంగా ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు సీట్లు ఖాళీ లేవని, అడ్మిషన్లు నిండిపోయాయని బోర్డు పెట్టే పరిస్థితికి చేరుకోవడం ఈ పాఠశాల నాణ్యతకు నిదర్శనమని కొనియాడారు. ప్రభుత్వ బడుల్లో నాణ్యమైన విద్య అందుతుందని నమ్మినప్పుడే తల్లిదండ్రులు తమ పిల్లలను చేర్పించడానికి ముందుకు వస్తారని, ఆ నమ్మకాన్ని కల్పించడమే తమ ప్రాథమిక లక్ష్యమని చెప్పారు.

అభివృద్ధి అంటే అద్దాల మేడలు కావు
అభివృద్ధి అంటే అద్దాల మేడలు, రంగుల గోడలు మాత్రమే కాదు, తెలంగాణ భవిష్యత్తు తరగతి గదుల్లోనే ఉంది, విద్యపై పెట్టే ప్రతి రూపాయి భవిష్యత్తుకు చేసే పెట్టుబడి అని ముఖ్యమంత్రి ఉద్ఘాటించారు. సుమారు 3 లక్షల కోట్ల రూపాయల రాష్ట్ర బడ్జెట్లో, విద్యారంగం కోసం 8 శాతానికి పైగా అంటే దాదాపు 26 వేల కోట్ల రూపాయలను కేటాయించడం, ఈ ప్రభుత్వం విద్యకు ఇస్తున్న ప్రాధాన్యతకు నిదర్శనమని తెలిపారు. విద్యతోనే సమాజంలో మార్పు తీసుకురావచ్చని, అంటరానితనం మరియు అసమానతలను నిర్మూలించడానికి విద్యాభ్యాసమే ఏకైక మార్గమని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ విద్యా విధానంలో చేపడుతున్న పలు కీలక నిర్ణయాలను వివరించారు. కుల, మత, వర్గ విభజనలకు ఆస్కారం లేకుండా, సమాజంలోని అన్ని వర్గాల విద్యార్థులు కలిసి చదువుకునే వాతావరణాన్ని కల్పించడానికి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను నిర్మిస్తున్నామని వెల్లడించారు. ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు నాణ్యమైన స్కూల్ డ్రెస్సులు, షూలు, సాక్సులు, దుప్పట్లు, స్కూల్ బ్యాగులతో కూడిన కిట్లను అంతర్జాతీయ ప్రమాణాలతో తయారు చేయిస్తున్నామని, 688 కోట్ల రూపాయలతో టెండర్లు పిలిచామని, జూలై నెలాఖరు నుంచి వీటి పంపిణీ చేపడతామని చెప్పారు.
విమర్శలను దాటి వికాసం వైపు
యువతను పట్టి పీడిస్తున్న మాదకద్రవ్యాల మహమ్మారిని అరికట్టడం ప్రభుత్వ బాధ్యత అని, ఈ నెల 19న ఎల్బీ స్టేడియంలో వేలాది మంది విద్యార్థులతో డ్రగ్స్ వ్యతిరేక ప్రమాణం చేయిస్తామని ప్రకటించారు. ఎక్కడైనా గంజాయి లేదా ఇతర డ్రగ్స్ వినియోగం తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని విద్యార్థులను కోరారు. కృత్రిమ మేధస్సు రాకతో ప్రపంచవ్యాప్తంగా వైట్ కాలర్ ఉద్యోగాలు ప్రమాదంలో ఉన్న నేపథ్యంలో, విద్యార్థులకు నైపుణ్యాలను నేర్పించి బ్లూ కాలర్ ఉద్యోగాలు కల్పించే ఉద్దేశంతో స్కిల్స్ యూనివర్సిటీని ప్రారంభించామని, మొదటి ఏడాదిలోనే అద్భుతమైన ఉపాధి అవకాశాలు లభించాయని తెలిపారు. దేశ జనాభా 140 కోట్లు ఉన్నా ఒలింపిక్స్లో పతకాలు సాధించలేకపోవడం ఆందోళనకరమని, అందుకే పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంతో స్పోర్ట్స్ యూనివర్సిటీని ప్రారంభించామని చెప్పారు. ప్రపంచ ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీని హైదరాబాద్ రప్పించడం ద్వారా విద్యార్థులకు క్రీడల పట్ల స్ఫూర్తినింపే ప్రయత్నం చేస్తున్నామని గుర్తు చేశారు.
ఆరుట్ల దంపతుల అలుపెరగని పోరాటం..
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో అలుపెరగని పోరాటం చేసిన ఆరుట్ల రామచంద్రారెడ్డి, ఆరుట్ల కమలాదేవి దంపతుల సేవలను ముఖ్యమంత్రి ఈ సందర్భంగా స్మరించుకున్నారు. వారి త్యాగాల పునాదులపై నిర్మించిన ఈ గ్రామంలో, ఇటువంటి విద్యా కేంద్రాన్ని ఏర్పాటు చేయడం ద్వారా వారికి నిజమైన నివాళి అర్పించామని అన్నారు. పాఠశాల మేనేజ్మెంట్ కమిటీలో స్థానిక ప్రజలను, తల్లిదండ్రులను భాగస్వాములను చేయడం ద్వారా ప్రజా భాగస్వామ్యంతో విద్యాభివృద్ధికి బాటలు వేశామని చెప్పారు. ఎవరెన్ని విమర్శలు చేసినా వెనకడుగు వేసే ప్రసక్తే లేదని, కేజీ నుంచి పీజీ వరకు అత్యుత్తమ విద్యను అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రిగా నేనే కాదు, దేశంలో గొప్ప గొప్ప స్థానాల్లో ఉన్నవారంతా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్నవారేనని, సంక్షేమ పథకాలు తాత్కాలిక ఉపశమనాన్ని ఇస్తాయేమో కానీ, చదువు మాత్రమే భవిష్యత్తును మారుస్తుందని, ఆత్మగౌరవంతో జీవించాలంటే విద్య ఒక్కటే మార్గమని ఆయన యువతకు ఉద్బోధించారు. ఆరుట్ల పబ్లిక్ స్కూల్ అనుభవాలను పాఠాలుగా తీసుకుని, భవిష్యత్తులో రాష్ట్రంలోని ఇతర పాఠశాలలను కూడా ఇదే తరహాలో ఆధునీకరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. విద్యార్థులు చదువులో రాణించి రేపటి బాధ్యతాయుతమైన నాయకులుగా ఎదగాలని ముఖ్యమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వ బడుల్లో చదువుకుంటున్న 27 లక్షల మంది విద్యార్థులకు భరోసా కల్పిస్తూ, నాణ్యమైన విద్య, ఉపాధి అవకాశాలను అందించే దిశగా ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని ఆయన స్పష్టం చేశారు.

