మహిళా మండలికి ఆర్థిక ప్రోత్సాహం
సేవల విస్తరణకు టీజీఎన్పీడీసీఎల్ చారిటబుల్ ట్రస్ట్ చొరవ
సొసైటీ నిర్వాహకురాలుకు చెక్కు అందజేత
సమాజ సేవలో నిమగ్నమైన సంస్థలకు ప్రొత్సాహం
: సూపరింటెండింగ్ ఇంజనీర్ బిక్షపతి
కాకతీయ, ములుగు ప్రతినిధి : సామాజిక సేవా కార్యక్రమాలను ప్రోత్సహించే లక్ష్యంతో టీజీఎన్పీడీసీఎల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ములుగు జిల్లాలో సేవలు అందిస్తున్న కస్తూరిబాయి మహిళా మండలి సొసైటీకి 20 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని సోమవారం అందజేశారు. ఈ సందర్భంగా ములుగు జిల్లా సూపరింటెండింగ్ ఇంజనీర్ బిక్షపతి, డివిజనల్ ఇంజనీర్ జై పురుషోత్తం, అకౌంట్స్ ఆఫీసర్ రాజ్ కుమార్ సంయుక్తంగా సొసైటీ నిర్వాహకురాలు సామ్రాజ్యానికి చెక్కును అందజేశారు. సమాజ సేవలో నిమగ్నమై పేదలు, వృద్ధులు, అనాథలకు సేవలందిస్తున్న స్వచ్ఛంద సంస్థలను ప్రోత్సహించేందుకు టీజీఎన్పీడీసీఎల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ప్రతి నెలా 20 వేల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తున్నామని అధికారులు తెలిపారు. ఈ నిధులను మహిళా సంక్షేమం మరియు సేవా కార్యక్రమాల విస్తరణకు సద్వినియోగం చేసుకోవాలని వారు సూచించారు. సమాజ అభ్యున్నతికి కృషి చేస్తున్న సంస్థలకు భవిష్యత్తులో కూడా సహకారం కొనసాగుతుందని పేర్కొన్నారు. అందిన ఆర్థిక సహాయానికి కృతజ్ఞతలు తెలుపుతూ, ఈ నిధులను సేవా కార్యక్రమాల నిర్వహణకు వినియోగిస్తామని సొసైటీ నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంగపేట మండల ఇన్చార్జి కృష్ణారావు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చెట్టుపల్లి వెంకటేశ్వర్లు, జిల్లా అధికార ప్రతినిధి యానయ్య, జిల్లా ప్రచార కమిటీ చైర్మన్ పూజారి సురేంద్రబాబు, ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడు చాద మల్లయ్య, నాగార్జున పాల్గొన్నారు.

