బీఆర్ఎస్ నేతల ఉత్తర కుమార ప్రగల్భాలు
కాళేశ్వరం ప్రాజెక్టుపై అడ్డగోలుగా కోతలు
వారం రోజుల్లో నీళ్లు ఇస్తామనడం హాస్యాస్పదం
మేడిగడ్డ కుంగినప్పుడు ఎందుకు రిపేర్లు చేయించలేదు
రూ.లక్ష కోట్ల వృథా చేసినందుకు బీఆర్ ఎస్ నేతలు క్షమాపణ చెప్పాలి
కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై సీబీఐ విచారణకు సిద్ధం
ఎన్డీఎస్ఏ నివేదికలను పక్కనపెట్టి పంపులు ఆన్ చేస్తామనడం నేరం
వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ధ్వజం
కాకతీయ,తెలంగాణ బ్యూరో : కాళేశ్వరం ప్రాజెక్టుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరియు ఇతర నేతలు చేస్తున్న వ్యాఖ్యలు కేవలం ఉత్తర కుమార ప్రగల్భాలు మాత్రమేనని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. హైదరాబాద్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ వారం రోజుల్లో తెలంగాణ మొత్తానికి నీళ్లు ఇస్తామనడం వారి అవగాహన రాహిత్యానికి నిదర్శనమని ఎద్దేవా చేశారు. 2016లో శంకుస్థాపన చేసి 2019లో ప్రారంభించిన కాళేశ్వరం ప్రాజెక్టు 209 వారాల పాటు కేసీఆర్ చేతిలోనే ఉందని ఆ సమయంలో మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగినప్పుడు ఎందుకు రిపేర్లు చేయించలేకపోయారని ఆయన నిలదీశారు. ప్రాజెక్టు డిజైన్ తానే చేశానని అపర భగీరథుడినని చెప్పుకున్న కేసీఆర్ మేడిగడ్డ ఘటన జరిగినప్పటి నుంచి ఇప్పటివరకు ఎందుకు నోరు విప్పడం లేదని ఆది శ్రీనివాస్ దుయ్యబట్టారు. లక్ష కోట్ల ప్రజాధనాన్ని గోదావరి పాలు చేసినందుకు కేసీఆర్ కేటీఆర్ మరియు హరీశ్ రావు ముగ్గురూ ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
కమిషన్ల కోసమే రీ-డిజైన్ డ్రామాలు
గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం కమిషన్ల కోసమే ఎటువంటి పద్ధతి మరియు సరైన డిజైన్ లేకుండా కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించిందని ఆది శ్రీనివాస్ ఆరోపించారు. అంతకుముందు 30 శాతం పనులు పూర్తయిన చేవెళ్ల-ప్రాణహిత ప్రాజెక్టును పక్కనపెట్టి రీ-డిజైన్ పేరుతో డ్రామాలు ఆడారని ఆయన మండిపడ్డారు. కన్నెపల్లి పంప్హౌస్ గతంలో 2 సార్లు మునిగిపోయి మోటర్లు కాలిపోయిన విషయం కేటీఆర్కు తెలియదా అని ప్రశ్నించారు. గతంలో కాళేశ్వరం నుంచి నీళ్లు ఎత్తి మళ్లీ సముద్రంలోకి వదిలారని భారీగా కరెంట్ బిల్లులు దండగ కావడం తప్ప ఆ ప్రాజెక్టు వల్ల సాధించిందేమీ లేదని ఆయన స్పష్టం చేశారు. ఇప్పుడు కాళేశ్వరం నీళ్లు లేకపోయినా కాంగ్రెస్ హయాంలో రికార్డు స్థాయిలో ధాన్యం పండించి దేశంలోనే 1 వ స్థానంలో నిలిచామని ఆయన వివరించారు.
ఎన్డీఎస్ఏ సూచనల ప్రకారమే నడుచుకుంటాం
మేడిగడ్డలో నీళ్లు ఆపితే డ్యాం కొట్టుకుపోతుందని కింద ఉన్న గ్రామాలు మునిగిపోతాయని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ స్పష్టంగా చెప్పిందని ఆది శ్రీనివాస్ గుర్తుచేశారు. అలాగే అన్నారం మరియు సుందిళ్ల బ్యారేజీల్లో సీపేజీలు పడ్డాయని ఆయన తెలిపారు. ప్రభుత్వానికి ఎలాంటి దురుద్దేశాలు లేవని ఎన్డీఎస్ఏ సూచనల ప్రకారమే నడుచుకుంటామని ఆయన చెప్పారు. ఈ పరిస్థితుల్లో 50 వేల మందితో వెళ్లి పంపులు ఆన్ చేస్తామనడం సంఘ విద్రోహ చర్య అవుతుందని ఆయన హెచ్చరించారు. కాళేశ్వరం అవినీతిపై అసెంబ్లీలో తీర్మానం చేసి సీబీఐ విచారణకు పంపామని బీజేపీతో బీఆర్ఎస్ చేస్తున్న ములాఖత్ రాజకీయాల వల్లే విచారణ ఆలస్యమవుతోందని ఆయన ఆరోపించారు. నిష్పక్షపాతంగా విచారణ జరిగితే బీఆర్ఎస్ నేతలు జైలుకు వెళ్లడం ఖాయమని ఆది శ్రీనివాస్ స్పష్టం చేస్తూ కేసీఆర్ ఇప్పటికైనా అసెంబ్లీకి వచ్చి కాళేశ్వరంపై మాట్లాడాలని సవాల్ విసిరారు.

