నాణ్యతతో నిర్మాణాలు పూర్తవ్వాలి
ఖమ్మం జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్
మధిరలో యూజీడీ, మహా ప్రస్థానం, రిటైనింగ్ వాల్ పనుల పరిశీలన
పనులు వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశం
కాకతీయ, మయూరి సెంటర్ : మధిర పట్టణంలో చేపట్టిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ (యూజీడీ) పనులతో పాటు మహాప్రస్థానం, వైరా చెరువుపై నిర్మిస్తున్న రిటైనింగ్ వాల్ పనుల పురోగతిని జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ మంగళవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పనులు జరుగుతున్న ప్రాంతాలను సందర్శించిన ఆయన, నిర్మాణ పురోగతి, నాణ్యత మరియు వేగంపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. మధిర పట్టణ అభివృద్ధికి కీలకమైన యూజీడీ వ్యవస్థ పూర్తయితే పారిశుద్ధ్య పరిస్థితులు గణనీయంగా మెరుగుపడతాయని జిల్లా కలెక్టర్ తెలిపారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పనులను ప్రణాళికాబద్ధంగా నిర్వహిస్తూ, నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. వైరా నదిపై నిర్మిస్తున్న రిటైనింగ్ వాల్ భవిష్యత్తులో వరదల ప్రభావాన్ని తగ్గించడంలో, నది పరివాహక ప్రాంత ప్రజల ఆస్తులు, ప్రాణాలకు రక్షణ కల్పించడంలో కీలక పాత్ర పోషిస్తుందని ఆయన వివరించారు.
నాణ్యత విషయంలో రాజీ వద్దు
నిర్మాణ పనుల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ నాణ్యతలో రాజీ పడకుండా, ఇంజినీరింగ్ ప్రమాణాలను కచ్చితంగా పాటించాలని కలెక్టర్ సూచించారు. నిర్మాణ సామగ్రి నాణ్యతను నిరంతరం పరీక్షించాలని, ప్రతి దశను ఇంజనీరింగ్ అధికారుల పర్యవేక్షణలో చేపట్టాలని ఆదేశించారు. పనులు జరుగుతున్న ప్రాంతాల్లో రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా తగిన భద్రతా చర్యలు తీసుకోవాలని, హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. అభివృద్ధి పనుల అమలులో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి, ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ తనిఖీలో ఖమ్మం ఆర్డీవో శ్రీనివాస్, మధిర మున్సిపల్ చైర్ పర్సన్, తహసీల్దారు రాంబాబు, సంబంధిత శాఖల అధికారులు, ఇంజినీర్లు మరియు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

