పోక్సో కేసుల్లో దర్యాప్తు వేగవంతం కావాలి
దర్యాప్తులో శాస్త్రీయ ఆధారాల సేకరణ కీలకం
గడువులోగా కోర్టులో అభియోగపత్రాలు సమర్పించాలి
మాదకద్రవ్యాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి పెట్టాలి
శాంతిభద్రతల విషయంలో రాజీ పడొద్దు
సమీక్షలో అధికారులకు ఖమ్మం పోలీస్ కమిషనర్ సూచనలు
కాకతీయ, ఖమ్మం బ్యూరో: పోక్సో కేసుల దర్యాప్తును వేగవంతంగా పూర్తిచేసి, అభియోగపత్రాలను నిర్ణీత గడువులోగా న్యాయస్థానంలో సమర్పించాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అధికారులను ఆదేశించారు. నేర విచారణలో నిందితులకు శిక్షల శాతం పెంపునకు పకడ్బందీ దర్యాప్తు, పోలీసు-ప్రాసిక్యూషన్ సమన్వయం అత్యంత ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. ఎన్డీపీఎస్ కేసుల్లో ఫోరెన్సిక్ సైన్స్ లేబరేటరీ నివేదికలే ప్రధాన ఆధారమని, గంజాయి రవాణా, విక్రయాలను అరికట్టడానికి ఈగల్ బృందాలు, టాస్క్ ఫోర్స్, స్థానిక పోలీసులు సమన్వయంతో పనిచేసి మూలాలను కనిపెట్టాలని కమిషనర్ సూచించారు. నిందితులపై పీడీ యాక్ట్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. నేరాలు జరిగిన తరువాత స్పందించడం కంటే, ముందస్తు నివారణ చర్యలు తీసుకోవడమే సమర్థవంతమైన పోలీసింగ్ అని ఆయన స్పష్టం చేశారు. చోరీల నివారణలో సాంకేతికతను వినియోగించుకుంటూ సొత్తు రికవరీని వేగవంతం చేయాలని ఆదేశించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు బ్లాక్ స్పాట్లలో ఇంజనీరింగ్ మార్పులు, సైన్ బోర్డులు, బ్లింకర్స్, స్పీడ్ బ్రేకర్ల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. కమ్యూనిటీ పోలీసింగ్ను మరింత సమర్థవంతంగా అమలు చేయాలని, సాక్షులు భయపడకుండా వారికి భరోసా కల్పిస్తూ న్యాయస్థానానికి హాజరయ్యేలా చూడాలని కమిషనర్ దిశానిర్దేశం చేశారు. శాంతిభద్రతలు, సైబర్ నేరాల నివారణ, ట్రాఫిక్ నియంత్రణ, పెండింగ్ కేసుల పురోగతిపై ఆయన సమీక్షించారు. పోలీస్ కమిషనర్ సునీల్ దత్, అడిషనల్ డీసీపీ రామానుజం, ఏసీపీలు వసుందర యాదవ్, రమణమూర్తి, తిరుపతి రెడ్డి, సారంగపాణి, ఫణిందర్, నర్సింహారావు, సర్వర్, సత్యనారాయణ, సాంబరాజుతదితరులు పాల్గొన్నారు.


