వీర..లెవల్లో బియ్యం దందా
ఉత్తర తెలంగాణను గుత్త పట్టిన స్మగ్లర్
మహదేవ్పూర్లో శ్రవణం చెప్పినట్లే అధికారులు
సిరొంచ గోదాంకు చేరుతున్న పేదల బియ్యం
నిత్యం వందల టన్నుల బియ్యం అక్రమ రవాణా
పౌరసరఫరాల శాఖ సమగ్ర సమాచారం స్మగ్లర్ చేతిలోకి
అధికారులు, ప్రజాప్రతినిధుల అండదండలతో గోదావరి దాటుతున్న పీడీఎస్ రైస్
ఎస్కార్ట్ వాహనాలతో.. పక్కా సమాచారంతో మహారాష్ట్రకు తరలింపు
ఇక్కడ తక్కువ ధరకు.. అక్కడ మూడు రెట్లు అధిక లాభంతో అమ్మకం
కాకతీయ,తెలంగాణ బ్యూరో : ప్రభుత్వం పేదల ఆకలి తీర్చేందుకు ఉచితంగా పంపిణీ చేస్తున్న సన్నబియ్యం స్మగ్లర్కు వ్యాపారంగా మారుతోంది. ఓ బడా స్మగ్లర్ మనీ మేనేజ్మెంట్తో ఉత్తర తెలంగాణ జిల్లాలైన ఉమ్మడి కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాలను గుప్పిట పట్టాడు. ప్రభుత్వంలోని కొంతమంది పెద్దల సహకారంతో మహారాష్ట్రలోని సిరొంచకు బియ్యాన్ని తరలిస్తున్నట్లు సమాచారం. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో బియ్యం స్మగ్లింగ్లో హవా కొనసాగించిన స్మగ్లరే ఇప్పుడు వీర ప్రతాపం చూపిస్తుండటం గమనార్హం. బియ్యం దందాలో వీరప్పన్గా పేరు గడించిన సదరు వ్యక్తి.. సాదాసీదాగా కనిపిస్తూ.. వందల కోట్ల బియ్యం దందాను ఫోన్ కాల్స్తోనే సాగిస్తున్నట్లు సమాచారం. ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్,వరంగల్ జిల్లాల్లో బియ్యం దందాను శాసిస్తున్న స్మగర్ల్ అధికార పార్టీ నేతలకు ఎప్పుడూ వీర విధేయుడుగా ఉంటాడని విశ్వసనీయంగా తెలుస్తోంది. పక్కా లెక్కలతో ప్రజాప్రతినిధులకు, పోలీస్, రెవెన్యూ, సివిల్ సప్లై శాఖలోని ఉన్నతాధికారులకు మాముళ్లు వెళ్తుంటాయనే చర్చ జరుగుతోంది. ఈనేపథ్యంలో ప్రజాప్రతినిధుల బలం ఉండటంతో..తమకెందుకులే ..అనుకుంటూ .. తమ వాటా తాము తీసుకుంటూ గప్చుప్గా సదరు స్మగ్లర్కు సహకరిస్తున్నట్లు సమాచారం.
సిరొంచ వరకు పెద్ద నెట్వర్క్…
అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసిన సమాచారం ప్రకారం.. రేషన్ బియ్యం అక్రమంగా తరలించే వాహనం బయల్దేరగానే దాని పరిధిలోని సివిల్ సప్లయ్, రెవెన్యూ, పోలీసు అధికారులకు బండి నంబర్ సమాచారం అందిస్తారు. ఇక ఆ బండి సాఫీగా సిరోంచ వెళ్లేలా అధికారులు సహకరిస్తుంటారు. టాస్క్ఫోర్స్, విజిలెన్స్ అధికారులు ప్రత్యేక దృష్టి పడకుండా.. వారి కంట చిక్కకుండా ఉండేందుకు రేషన్ బియ్యం తరలించే వాహనం ముందు ఒక ఎస్కార్ట్లా టూ వీలర్ వెళ్తుంది. అధికారులు లేరని నిర్ధారించుకున్నాకే వాహనాలు ముందుకు కదులుతాయి. లోకల్ అధికారులు కాకుండా ఇంకా ఎవరైనా ఉన్నారా.. ఎవరైనా ఆపుతున్నారా..? అని నిర్ధారించుకుంటారు. ఏదైనా ఇబ్బంది ఉందని భావిస్తే సదరు ఎస్కార్ట్.. వాహన డ్రైవర్కు సమాచారం ఇస్తారు. అధికారి ముందు తనిఖీ చేస్తున్నాడని తెలిస్తే చాలు వాహనం వేరే రూట్ తీసుకొని వెళ్లడమో లేక అధికారులు అక్కడి నుంచి వెళ్లే వరకు ఎక్కడైనా సేఫ్ ప్లేస్లో ఆగి వెళ్లడమో జరుగుతుంటుంది. రేషన్ అక్రమ రావాణా చేసే వాహనాలను పట్టుకున్నారంటే అది ఏ టాస్క్ఫోర్స్ అధికారులో, విజిలెన్స్ అధికారులో పట్టుకుంటారు తప్పితే జిల్లాస్థాయి అధికారులు పట్టుకోరని సమాచారం. ఇంత పకడ్బందీగా రేషన్ అక్రమ దందా జరుగుతున్నా పట్టించుకునే నాథుడే లేకపోవడం పలు విమర్శలకు తావిస్తున్నది. క్షేత్రస్థాయిలో కొంతమంది అధికారుల సహకారం లేకుండా ఈ స్థాయిలో అక్రమ రవాణా సాగడం సాధ్యం కాదనే విమర్శలు వినిపిస్తున్నాయి. చెక్పోస్టుల వద్ద తనిఖీలు బలహీనంగా ఉండటం, ఏర్పాటు చేసిన నిఘా కెమెరాల నిర్వహణలో లోపాలు ఉండటం కూడా దళారులకు అనుకూలంగా మారిందని ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నాయి.
సరిహద్దు దాటితే మూడు రెట్లు లాభం
స్థానికంగా లబ్ధిదారుల నుంచి కిలో రూ.10 నుంచి రూ.12 వరకు కొనుగోలు చేస్తున్న దళారులు, అదే బియ్యాన్ని సిరొంచలోని ప్రత్యేక గోదాంకు తరలిస్తారు. అక్కడి నుంచి మిల్లులకు రీసైక్లింగ్ కోసం తరలిస్తారు. రైస్ మిల్లులకు కిలో రూ.32 నుంచి రూ.35 వరకు విక్రయిస్తున్నారు. దీంతో ప్రతి లోడుపై సుమారు లక్షన్నరకు పైగా లాభం పొందుతున్నట్లు సమాచారం. ఉమ్మడి వరంగల్ జిల్లాలో రోజుకు దాదాపు 50 టన్నుల వరకు బియ్యం సరిహద్దు దాటుతోందని, అదే కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల నుంచి దాదాపుగా ఇదే స్థాయిలో బియ్యం అక్రమ రవాణా జరుగుతున్నట్లుగా సమాచారం. బడా స్మగ్లర్కు మహదేవ్పూర్లోని ఓ శ్రవణం ఏం చెబితే అదే అన్నట్లుగా తెలుస్తోంది. మహారాష్ట్ర సరిహద్దు మండలం నుంచి మొత్తం వ్యవహారం ఆపరేట్ అవుతుండగా… ఈ శ్రవణం చెబితేనే.. స్మగ్లర్ చెవికి వినబడుతుందని తెలుస్తోంది.
చిక్కుతున్నవి చిన్న చేపలే..
ఇదిలా ఉండగా తాజాగా భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలో పౌరసరఫరాల శాఖ విజిలెన్స్ బృందం నిర్వహించిన దాడుల్లో ఏకంగా 170 క్వింటాళ్ల సన్నబియ్యం పట్టుబడటం ఈ అక్రమ దందా తీవ్రతను మరోసారి వెలుగులోకి తీసుకొచ్చింది. ప్రత్యేక సమాచారంతో టాస్క్ఫోర్స్ విజిలెన్స్ అధికారులు ఐదు రోజుల క్రితం గణపురం మండలంలో దాడులు నిర్వహించారు. రోడ్డుపై వెళ్తున్న టాటా ఏస్ వాహనాన్ని అనుమానంతో వెంబడించిన అధికారులు, ఓ ఇంటి వద్ద బియ్యం బస్తాలు దించుతున్న సమయంలో దాడి చేశారు. అక్కడ 20 క్వింటాళ్ల బియ్యం లభించగా, అదే ఇంటి గదిలో భద్రపరిచిన మరో 150 క్వింటాళ్ల సన్నబియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. సంఘటన స్థలంలో ఉన్న మోటెం సారంగపాణి, డ్రైవర్ తూర్పాటి కిషన్లను అదుపులోకి తీసుకున్నారు. స్థానిక వ్యాపారి భానుచందర్ ఆదేశాల మేరకే ఈ నిల్వలు ఏర్పాటు చేసినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. మొత్తం స్వాధీనం చేసుకున్న బియ్యం విలువ సుమారు రూ.5.10 లక్షలుగా అధికారులు అంచనా వేశారు. అనంతరం బియ్యాన్ని ప్రభుత్వ రైస్ మిల్లుకు తరలించి, వాహనాన్ని సీజ్ చేసి కేసు నమోదు చేశారు. అయితే పేదల నోటికి చేరాల్సిన ధాన్యం దళారుల గోదాముల్లో పేరుకుపోవడం ప్రభుత్వ సరఫరా వ్యవస్థలోని లోపాలను బట్టబయలు చేస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో కొందరు వ్యాపారులు లబ్ధిదారులను ప్రలోభపెట్టి రేషన్ బియ్యాన్ని భారీగా కొనుగోలు చేస్తున్నారు. అనంతరం వాటిని గోదాముల్లో నిల్వ చేసి సరిహద్దు మార్గాల ద్వారా మహారాష్ట్రకు తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.

