చర్చి అనుబంధ ఆస్తులతో వ్యాపారమా..?
వైరా రోడ్ ఆర్సీఎం చర్చి భవన విక్రయంపై ఆరోపణలు
ఆంధ్ర వెల్ఫేర్ సొసైటీ పేరుతో వ్యవహారాలపై వివాదం
కలెక్టర్ దృష్టి సారిస్తే మరిన్ని అంశాలు వెలుగులోకి?
విచారణ చేపట్టాలని కోరుతున్న క్రైస్తవ భక్తులు
కాకతీయ, ఖమ్మం బ్యూరో: ఖమ్మం నగరంలోని వైరా రోడ్డులో ఉన్న ఆర్సీఎం చర్చి అనుబంధ ఆస్తుల వ్యవహారం వివాదాస్పదంగా మారుతోంది. చర్చి పేరుతో ఉన్న స్థలంలో బహుళ అంతస్తుల భవనం నిర్మించి, అందులోని కొంత భాగాన్ని ప్రైవేటు వ్యక్తులకు విక్రయించినట్లు స్థానిక భక్తులు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంలో ఆంధ్ర వెల్ఫేర్ సొసైటీ పేరును వినియోగించారని, చర్చి ఆస్తుల నిర్వహణలో నిబంధనలు పాటించలేదనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఈ అంశంపై జిల్లా యంత్రాంగం సమగ్ర విచారణ చేపడితే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశముందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
చర్చి ఆస్తులపై వివాదం..
ఖమ్మం పట్టణంలోని వైరా రోడ్డులో ఉన్న ఆర్సీఎం చర్చికి ఆనుకుని ఉన్న స్థలం గత కొన్ని సంవత్సరాలుగా చర్చి యాజమాన్య పరిధిలోనే కొనసాగుతోందని స్థానికులు చెబుతున్నారు. ఇటీవల ఆ స్థలంలో బహుళ అంతస్తుల భవనం నిర్మించి, అందులోని కొంత భాగాన్ని ప్రైవేటు వ్యక్తులకు విక్రయించినట్లు ఆరోపిస్తున్నారు. కొందరు ఫాదర్లు సొసైటీలు, ట్రస్టుల పేరుతో చర్చి ఆస్తులను ఇష్టానుసారంగా విక్రయిస్తున్నారనే విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. క్యాథలిక్ డయాసిస్ పరిధిలో ఉండే ఆర్సీఎం చర్చిల్లో ఆస్తుల నిర్వహణకు కఠినమైన నిబంధనలు అమలులో ఉంటాయని, అలాంటి పరిస్థితుల్లో ఈ వ్యవహారం ఎలా జరిగిందన్న ప్రశ్నలు స్థానికంగా వినిపిస్తున్నాయి.
అనుమతులు తీసుకున్నారా..?
చర్చి ఆస్తుల విక్రయానికి చర్చి నిబంధనల ప్రకారం పలు దశల్లో అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుందని చర్చి వ్యవహారాలపై అవగాహన ఉన్నవారు చెబుతున్నారు. ముందుగా ప్యారిష్ ప్రీస్ట్, ప్యారిష్ కౌన్సిల్ తీర్మానం, అనంతరం సంబంధిత బిషప్ అనుమతి, డయాసిస్ ఆర్థిక కమిటీ ఆమోదం తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొంటున్నారు. ఆస్తి విలువ అధికంగా ఉంటే రోమ్లోని సంబంధిత చర్చి అధికారుల అనుమతి కూడా అవసరమవుతుందని చెబుతున్నారు. అలాగే, ఆస్తి విక్రయం ద్వారా వచ్చిన నిధులను కొత్త చర్చి నిర్మాణం, విద్యాసంస్థలు, ఆసుపత్రులు, అప్పుల చెల్లింపులు వంటి చర్చి ప్రయోజనాలకే వినియోగించాల్సి ఉంటుందని పేర్కొంటున్నారు. అయితే, ఈ నిబంధనలు పాటించలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయని స్థానికులు అంటున్నారు. ఈ ఆరోపణల నిజానిజాలను సంబంధిత అధికారులు విచారించాలని కోరుతున్నారు.
ఆంధ్ర వెల్ఫేర్ సొసైటీపై ప్రశ్నలు
ఈ వ్యవహారంలో ఆంధ్ర వెల్ఫేర్ సొసైటీ పాత్రపైనా స్థానికులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. స్వచ్ఛంద సేవా కార్యక్రమాల కోసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలంలో ఈ సొసైటీ నమోదు చేసుకున్నట్లు చెబుతున్నప్పటికీ, ప్రస్తుతం తెలంగాణ రిజిస్ట్రేషన్ పోర్టల్లో సంబంధిత పత్రాలు అందుబాటులో కనిపించడం లేదని పేర్కొంటున్నారు. సొసైటీ రెన్యువల్కు పలుమార్లు దరఖాస్తు చేసినట్లు ఆన్లైన్లో నమోదై ఉన్నప్పటికీ, పూర్తి వివరాలు కనిపించడం లేదని ఆరోపిస్తున్నారు. ఈ అంశాలపై జిల్లా యంత్రాంగం, రిజిస్ట్రేషన్ శాఖ సమగ్రంగా పరిశీలించి వాస్తవాలను వెల్లడించాలని స్థానికులు కోరుతున్నారు. చర్చి ఆస్తుల విక్రయం, సొసైటీ వ్యవహారాలు, అనుమతుల ప్రక్రియ, ఆర్థిక లావాదేవీలపై సమగ్ర విచారణ జరిపితే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. జిల్లా కలెక్టర్ ఈ వ్యవహారంపై దృష్టి సారించి సంబంధిత శాఖలతో విచారణ చేపట్టించాలని, ఆరోపణల్లో వాస్తవం ఉంటే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

