సింగరేణి చుట్టూ బీజేపీ రాజకీయ వ్యూహం
మూడో కోల్ బ్లాక్తో కేంద్రం ముద్ర వేయాలనే ప్రయత్నం
రూ.54 వేల కోట్ల బకాయిలపై రేవంత్ సర్కార్ను నిలదీసిన కిషన్ రెడ్డి
మెటా నోటీసులు, డీసీపీ బదిలీపై కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు
కాకతీయ, తెలంగాణ బ్యూరో : తెలంగాణలో రాజకీయంగా బలం పెంచుకోవడానికి బీజేపీ కొత్త వ్యూహంతో ముందుకెళ్తోంది. ఒకవైపు కేంద్రం మంజూరు చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తూనే, మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రక్షణాత్మక స్థితిలోకి నెట్టే అంశాలను ముందుకు తెస్తోంది. తాజాగా సింగరేణికి వరుసగా మూడో కోల్ బ్లాక్ దక్కడాన్ని కేంద్ర ప్రభుత్వ విజయంగా ప్రచారం చేస్తూనే, సింగరేణి బకాయిల అంశాన్ని ప్రధాన రాజకీయ అస్త్రంగా మార్చే ప్రయత్నం కనిపిస్తోంది. కేంద్ర బొగ్గు శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడిన తీరు కూడా ఇదే వ్యూహానికి అద్దం పట్టింది. మణుగూరు పీకేఓసీ-2 డిప్ సైడ్ బ్లాక్ సింగరేణికి దక్కడం కేంద్ర ప్రభుత్వ చొరవ వల్లే సాధ్యమైందని పేర్కొన్న ఆయన, సింగరేణి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వేలం ప్రక్రియలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నామని వివరించారు.
సింగరేణినే రాజకీయ అస్త్రంగా…
సింగరేణి కార్మికులకు సంబంధించిన రూ.54 వేల కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. గత ప్రభుత్వాల వల్లే సంస్థ ఆర్థికంగా దెబ్బతిన్నదని ఆరోపిస్తూ, బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండింటినీ ఒకే తీరులో విమర్శించారు. బీఆర్ఎస్ చేస్తున్న విమర్శలకు తాము బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. సింగరేణి అంశంపై కార్మికులు, ఉద్యోగులు, ఉత్తర తెలంగాణ ప్రజలను తమవైపు తిప్పుకోవాలనే రాజకీయ లక్ష్యంతో బీజేపీ అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై సామాజిక మాధ్యమాల్లో వచ్చిన అభ్యంతరకర పోస్టుల వ్యవహారాన్ని కూడా బీజేపీ రాజకీయంగా ముందుకు తెచ్చింది. ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి మెటా ఇండియాకు నోటీసులు జారీ చేసిన అధికారిపై ప్రభుత్వం చర్యలు తీసుకుందని కిషన్ రెడ్డి ఆరోపించారు. డీసీపీ అరవింద్ బాబు బదిలీని ప్రస్తావిస్తూ, అధికారులను రాజకీయ ఒత్తిడితో బదిలీలు చేయడం కాంగ్రెస్ ప్రభుత్వంలో పరిపాటిగా మారిందన్నారు. గతంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని ప్రస్తావిస్తూ బీఆర్ఎస్ పాలనపైనా విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో సైబర్ నేరాలు గణనీయంగా పెరిగిన నేపథ్యంలో చట్టప్రకారం చర్యలు తీసుకోవడంలో తప్పేముందని ప్రశ్నించిన ఆయన, ఏ సోషల్ మీడియా సంస్థ అయినా భారత చట్టాలకు లోబడాల్సిందేనని స్పష్టం చేశారు.

