కాంగ్రెస్ సీనియర్లకే తొలి ప్రాధాన్యం
60% నామినేటెడ్ పదవులు వారికే
కష్టకాలంలో పార్టీని నిలబెట్టిన కార్యకర్తలకు న్యాయం
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళలకు తగిన ప్రాధాన్యం
వర్ధన్నపేట పరిధిలో 1, 65, 66 డివిజన్లకు ప్రత్యేక ఇంచార్జ్ల నియామకం
పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని మరింత బలోపేతం చేస్తాం
హనుమకొండ డీసీసీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి
కాకతీయ, హనుమకొండ : ఢిల్లీలో జరిగిన ఏఐసీసీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసే దిశగా కీలక మలుపు అవుతాయని హనుమకొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుడు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి అన్నారు. సుదీర్ఘకాలంగా పార్టీని నమ్ముకుని కష్టకాలంలోనూ కాంగ్రెస్ జెండాను మోసిన సీనియర్ నాయకులు, కార్యకర్తలకు రానున్న నామినేటెడ్ పదవుల్లో 60 శాతం ప్రాధాన్యం కల్పించాలని అధిష్ఠానం నిర్ణయించడం చారిత్రాత్మకమని పేర్కొన్నారు. మాజీ మండల అధ్యక్షులు, జిల్లా కార్యవర్గ సభ్యులు, అనుబంధ సంఘాల నాయకులు, నియోజకవర్గ సీనియర్ నాయకులకు ప్యాక్స్ డైరెక్టర్లు, చైర్మన్లు, మార్కెట్ కమిటీలు తదితర నామినేటెడ్ పదవుల్లో తొలి ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా నిజమైన పార్టీ కార్యకర్తలకు న్యాయం జరుగుతుందని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళలకు తగిన ప్రాధాన్యం కల్పించాలని నిర్ణయించడం కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయంపై ఉన్న నిబద్ధతకు నిదర్శనమని చెప్పారు.
సమన్వయంతోనే తుది జాబితా
ఉమ్మడి జిల్లాల ఇంచార్జ్ మంత్రులు, స్థానిక మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, డీసీసీ అధ్యక్షులు, నియోజకవర్గ అభ్యర్థులు, సీనియర్ నాయకులతో సమన్వయం చేసుకుని ఆశావహుల తుది జాబితా రూపొందించేలా అధిష్ఠానం స్పష్టమైన విధివిధానాలు రూపొందించిందన్నారు. క్షేత్రస్థాయి కార్యకర్తల త్యాగాలను గుర్తించి ఈ నిర్ణయం తీసుకున్న ఏఐసీసీ ప్రతినిధి మీనాక్షీ నటరాజన్, ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్లకు జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలిపారు.
డివిజన్ కమిటీల ఏర్పాటుకు ప్రత్యేక ఇంచార్జ్లు
టీపీసీసీ ఆదేశాల మేరకు వర్ధన్నపేట నియోజకవర్గ పరిధిలోని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 1, 65, 66 డివిజన్లలో పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని వేగవంతం చేసేందుకు ప్రత్యేక ఇంచార్జ్లను నియమించినట్లు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి ప్రకటించారు. ఈ బాధ్యతలను డీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఈర్ల చిన్ని, డీసీసీ జనరల్ సెక్రటరీలు బిన్ని లక్ష్మణ్, మారంరెడ్డి కౌశిల్ రెడ్డి, డీసీసీ సెక్రటరీలు కట్ట రఘుపాల్ రెడ్డి, ముక్కెర సురేష్, కొక్కిరాల స్వాతి, డీసీసీ ఈసీ సభ్యుడు కొత్త వాసుదేవ రెడ్డికి అప్పగించినట్లు తెలిపారు. నియమితులైన ఇంచార్జ్లు వెంటనే క్షేత్రస్థాయిలో పనిచేస్తూ స్థానిక నాయకులతో సమన్వయం చేసుకుని నిర్దేశిత గడువులోగా డివిజన్ కమిటీల ఏర్పాటు పూర్తి చేయాలని సూచించారు. పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని బలోపేతం చేయడం, సీనియర్ నాయకులకు తగిన గౌరవం కల్పించడం అనే రెండు లక్ష్యాలతో కాంగ్రెస్ అధిష్ఠానం ముందుకు సాగుతోందని, ఈ నిర్ణయాలు రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపి పార్టీని మరింత శక్తివంతం చేస్తాయని ఇనగాల వెంకట్రామ్ రెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు.

