నాటు సారా స్థావరాలపై ఎక్సైజ్ దాడులు
1,900 లీటర్ల చక్కెర పానకం ధ్వంసం
55 లీటర్ల నాటు సారా, 60 కిలోల బెల్లం స్వాధీనం
నాటు సారా తయారీకి పాల్పడుతున్న 9 మందిపై కేసులు
కాకతీయ, నల్లబెల్లి: నాటు సారా నిర్మూలనలో భాగంగా ఎక్సైజ్ అధికారులు నల్లబెల్లి మండలంలో గురువారం విస్తృతంగా దాడులు నిర్వహించారు. డిప్యూటీ కమిషనర్ దత్త రాజు గౌడ్, అసిస్టెంట్ కమిషనర్ నవీన్కుమార్ ఆదేశాల మేరకు నర్సంపేట స్టేషన్ పరిధిలోని నందిగామ, రేలకుంట గ్రామాల్లో ఈ తనిఖీలు చేపట్టారు. నర్సంపేట, పరకాల ఎక్సైజ్ స్టేషన్లతో పాటు టాస్క్ఫోర్స్, ఎన్ఫోర్స్మెంట్ బృందాలు సంయుక్తంగా దాడులు నిర్వహించాయి. దాడుల్లో నాటు సారా తయారీకి సిద్ధంగా ఉంచిన 1,900 లీటర్ల చక్కెర పానకాన్ని అధికారులు ధ్వంసం చేశారు. 55 లీటర్ల నాటు సారా, 60 కిలోల బెల్లం, 10 కిలోల పట్టికను స్వాధీనం చేసుకున్నారు. నాటు సారా తయారీకి పాల్పడుతున్న 9 మందిపై కేసులు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. దాడుల్లో ట్రైనీ అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్లు లక్ష్మణ్ ఆనంద్, నీలోఫర్, సుచిత, టాస్క్ఫోర్స్ సీఐ రమేష్చందర్, ఎన్ఫోర్స్మెంట్ సీఐలు నాగయ్య, నాగేశ్వరరావు, ఎస్సైలు చంద్రశేఖర్, సులోచన, షరీష్, సురేష్రెడ్డి తదితరులు, సిబ్బంది పాల్గొన్నారు. నాటు సారా తయారీ, విక్రయాలపై నిరంతరం నిఘా కొనసాగుతుందని ఎక్సైజ్ అధికారులు తెలిపారు.

