‘నార్మల్ లేదు… బలవంతంగా పవర్ పెట్రోల్..?
పెట్రోల్ బంకుల తీరుపై వాహనదారుల ఆగ్రహం
అధిక ధరల ఇంధనం కొనాలని ఒత్తిడి
నార్మల్ పెట్రోల్ నిల్వలపై అనుమానాలు
విక్రయ విధానంపై సమగ్ర విచారణకు ప్రజల డిమాండ్
ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని అధికారులకు విజ్ఞప్తి
కాకతీయ, కారేపల్లి : కారేపల్లి ప్రాంతంలోని కొన్ని పెట్రోల్ బంకుల్లో “నార్మల్ పెట్రోల్ లేదు” అంటూ వినియోగదారులకు పవర్ పెట్రోల్ మాత్రమే విక్రయిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సాధారణ పెట్రోల్ అడిగిన వాహనదారులకు అది అందుబాటులో లేదని చెప్పి అధిక ధర కలిగిన పవర్ పెట్రోల్ కొనుగోలు చేయాల్సిందేనని చెబుతున్నారని పలువురు వినియోగదారులు ఆరోపిస్తున్నారు. వాస్తవంగా నార్మల్ పెట్రోల్ నిల్వలు లేకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందా? లేక అధిక లాభాల కోసం ఉద్దేశపూర్వకంగా పవర్ పెట్రోల్ను మాత్రమే విక్రయిస్తున్నారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే పవర్ పెట్రోల్ పేరుతో విక్రయిస్తున్న ఇంధనం నిజంగానే అదేనా? లేక సాధారణ పెట్రోల్ను అధిక ధరకు విక్రయిస్తున్నారా? అనే అంశాలపై కూడా సంబంధిత అధికారులు స్పష్టత ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు.

ఇప్పటికే పెరుగుతున్న ఇంధన ధరలతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో, నార్మల్ పెట్రోల్ లేదనే కారణంతో ఖరీదైన ఇంధనం కొనుగోలు చేయాల్సి రావడం అదనపు భారంగా మారిందని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వినియోగదారుల హక్కులను పరిరక్షించాల్సిన శాఖలు ఈ వ్యవహారాన్ని సీరియస్గా తీసుకోవాలని కోరుతున్నారు. చమురు సంస్థల అధికారులు, లీగల్ మెట్రాలజీ శాఖ, పౌర సరఫరాల శాఖ అధికారులు కారేపల్లి ప్రాంతంలోని పెట్రోల్ బంకులపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. నార్మల్ పెట్రోల్ నిల్వలు, విక్రయ విధానం, ధరల వసూళ్లపై సమగ్ర విచారణ చేపట్టి వాస్తవాలను బహిర్గతం చేయాలని కోరుతున్నారు. ఒకవేళ నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని వాహనదారులు విజ్ఞప్తి చేస్తున్నారు.

