ఆహార భద్రతకు ప్రజా ప్రభుత్వ పెద్దపీట
ఆకలి లేని తెలంగాణే ప్రభుత్వ లక్ష్యం
అర్హులైన ప్రతి పేద కుటుంబానికి రేషన్ కార్డు
సన్న బియ్యంతో పేదలకు కడుపునిండా భోజనం
పీవీసీ స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీలో మంత్రి సీతక్క
కాకతీయ, ములుగు ప్రతినిధి : పేదల ఆకలి తీర్చడంతో పాటు అర్హత కలిగిన ప్రతి పేద కుటుంబానికి ఆహార భద్రత కార్డు అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు. పేద కుటుంబాలు సైతం నాణ్యమైన సన్న బియ్యంతో రెండు పూటలా కడుపునిండా భోజనం చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం రేషన్ దుకాణాల ద్వారా సన్న బియ్యం పంపిణీకి శ్రీకారం చుట్టిందన్నారు. శనివారం ములుగు జిల్లా కేంద్రంలోని తంగేడు మైదానంలో నిర్వహించిన పీవీసీ స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావుతో కలిసి లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పేద, ధనిక అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ నాణ్యమైన బియ్యం తినాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమన్నారు. సన్న బియ్యం ప్రయోజనం ప్రతి అర్హత కలిగిన కుటుంబానికి అందాలంటే రేషన్ కార్డు కీలకమని పేర్కొన్నారు.
అర్హులైన వారికి ప్రాధాన్యం
గతంలో రేషన్ కార్డుల కోసం ఎంతోమంది పేదలు ఎదురుచూశారని మంత్రి సీతక్క తెలిపారు. ప్రజా ప్రభుత్వం అర్హులైన కుటుంబాలను గుర్తించి వారికి రేషన్ కార్డులు అందించే ప్రక్రియను వేగవంతం చేసిందన్నారు. అర్హత ఉన్నప్పటికీ రేషన్ కార్డు లేని పేద కుటుంబాలను గుర్తించి వారికి ముందుగా కార్డులు అందేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు. ఆర్థికంగా స్థిరంగా ఉన్నవారి కంటే నిజమైన పేదలు, నిరుపేద కుటుంబాలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. కొనుగోలు శక్తి లేని కుటుంబాలకు ప్రభుత్వ సహాయం ముందుగా అందాలన్నారు. రేషన్ కార్డు కేవలం బియ్యం పొందేందుకు మాత్రమే కాకుండా ఆరోగ్యశ్రీతో పాటు పలు ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలను పొందేందుకు ఉపయోగపడుతుందని మంత్రి వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లోని పేదలకు ప్రభుత్వ పథకాలకు ఎలా దరఖాస్తు చేసుకోవాలి, ఎవరిని సంప్రదించాలి అనే అంశాలపై అధికారులు అవగాహన కల్పించాలని సూచించారు.

ప్రతి పేద కుటుంబానికి సంక్షేమ ఫలాలు
తహసీల్దార్లు, ఎంపీడీవోలు, రేషన్ డీలర్లు, పంచాయతీ కార్యదర్శులు, స్థానిక ప్రజాప్రతినిధులు బాధ్యత తీసుకుని అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ పథకాలు చేరేలా చర్యలు తీసుకోవాలని మంత్రి సీతక్క అన్నారు. రేషన్ కార్డులతో పాటు ఇందిరమ్మ ఇళ్లు, గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, మహిళా స్వయం సహాయక సంఘాలకు వడ్డీలేని రుణాలు వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. మహిళలందరూ స్వయం సహాయక సంఘాల్లో చేరి ప్రభుత్వం కల్పిస్తున్న ఆర్థిక అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అర్హులైన ఒంటరి మహిళలు, వితంతువులకు పింఛన్లు అందించడంతో పాటు తలసేమియా బాధితులకు కూడా పింఛన్ సౌకర్యం కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు.
పేదల జీవితాల్లో భరోసా
పేదల కష్టాలు, కన్నీళ్లు తుడిచి వారి జీవితాల్లో భరోసా కల్పించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు సిహెచ్. మహేందర్ జి, సంపత్ రావు, ఆర్డీవో కృష్ణవేణి, సివిల్ సప్లై అధికారి షా ఫైజల్ హుస్సేని, డీఎం కృష్ణవేణి, ఆత్మ కమిటీ చైర్మన్ రవీందర్ రెడ్డి, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

