డిజిటల్ జర్నలిస్టులకు సమాన హక్కులు కల్పించాలి
ప్రత్యేక అక్రిడిటేషన్.. రక్షణ, సంక్షేమం అందించాలి
దాడులు, బెదిరింపులపై ప్రత్యేక రక్షణ వ్యవస్థ ఉండాలి
ప్రభుత్వం ప్రత్యేక డిజిటల్ మీడియా పాలసీ తీసుకురావాలి
రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టులను ఏకతాటిపైకి తెస్తాం
టీడీఎంయూ రాష్ట్ర అధ్యక్షుడు అరెల్లి కిరణ్ గౌడ్
సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి : కార్యదర్శి నాగరాజు
తెలంగాణ డిజిటల్ మీడియా యూనియన్ ఆవిర్భావం
కాకతీయ, తెలంగాణ బ్యూరో : డిజిటల్ మీడియా జర్నలిస్టులకు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులతో సమానంగా హక్కులు, గుర్తింపు, రక్షణ, సంక్షేమం కల్పించాలని తెలంగాణ డిజిటల్ మీడియా యూనియన్ అధ్యక్షుడు అరెల్లి కిరణ్ గౌడ్ ప్రభుత్వాన్ని కోరారు. డిజిటల్ మీడియా విస్తరిస్తున్న నేపథ్యంలో జర్నలిస్టుల హక్కులు, బాధ్యతలు, సంక్షేమాన్ని స్పష్టంగా నిర్వచించేలా ప్రత్యేక డిజిటల్ మీడియా పాలసీని తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న డిజిటల్ మీడియా ప్రతినిధులను ఏకతాటిపైకి తీసుకొచ్చి వారి సమస్యల పరిష్కారానికి, హక్కుల పరిరక్షణకు యూనియన్ కృషి చేస్తుందని తెలిపారు.
టీడీఎంయూ రాష్ట్ర కార్యవర్గం
తెలంగాణ డిజిటల్ మీడియా యూనియన్(టీడీఎంయూ)కు సంబంధించిన రిజిస్ట్రేషన్ (రిజిస్ట్రేషన్ నంబర్ 468 ఆఫ్ 2026) ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో సభ్యులు నూతన కమిటీని బుధవారం ఎన్నుకున్నారు. రాష్ట్ర అధ్యక్షుడిగా అరెల్లి కిరణ్, కార్యదర్శిగా పల్లెబోయిన నాగరాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.యూనియన్ ఉపాధ్యక్షుడిగా కౌడగాని మోహన్రావు, కోశాధికారిగా పల్లె వంశీ మోహన్, సహాయ కార్యదర్శిగా బూర నగేష్గౌడ్, గౌరవ అధ్యక్షుడిగా గడ్డం కేశవమూర్తి, గౌరవ సలహాదారుగా రాజేశ్వరరావు ఎన్నికయ్యారు. కార్యవర్గ సభ్యులుగా దాసరి ధనుంజయ, సలేంద్ర రవీందర్ ఎంపికయ్యారు. ఈసందర్భంగా అధ్యక్షుడు కిరణ్ గౌడ్ మాట్లాడుతూ డిజిటల్ మీడియా జర్నలిస్టుల సంక్షేమం, సమస్యల పరిష్కారానికి సమష్టిగా పనిచేస్తుందని వారు తెలిపారు. డిజిటల్ పేపర్లలో పనిచేస్తున్న అర్హులైన జర్నలిస్టులకు ప్రత్యేక నిబంధనలతో అక్రిడిటేషన్ కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. డిజిటల్ జర్నలిస్టులకు ప్రభుత్వ కార్యక్రమాలు, ప్రెస్కాన్ఫరెన్సులు, అధికారిక సమావేశాలు, కలెక్టరేట్లు, పోలీస్, ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లో వార్తా సేకరణకు సమాన అవకాశం కల్పించాలన్నారు. గుర్తింపు కార్డు కేవలం గుర్తింపునకు మాత్రమే కాకుండా విధి నిర్వహణలో రక్షణకు ఉపయోగపడేలా వ్యవస్థ ఉండాలని కోరారు.
దాడులు.. బెదిరింపులపై రక్షణ
అవినీతి, అక్రమాలు, మాఫియా, నేరాలు, ప్రజా సమస్యలపై వార్తలు రాసే డిజిటల్ జర్నలిస్టులు పలుచోట్ల బెదిరింపులు, దాడులు, ఆన్లైన్ వేధింపులు ఎదుర్కొంటున్నారని కిరణ్ గౌడ్ తెలిపారు. విధి నిర్వహణలో జర్నలిస్టులపై దాడులు జరిగితే వెంటనే స్పందించేలా ప్రతి జిల్లాలో ప్రత్యేక నోడల్ అధికారి లేదా హెల్ప్డెస్క్ ఏర్పాటు చేయాలని కోరారు. జర్నలిస్టులపై విధి నిర్వహణకు సంబంధించిన కేసులు నమోదైనప్పుడు చట్టపరమైన సహాయం అందించేందుకు ప్రత్యేక లీగల్ ఎయిడ్ సెల్ ఏర్పాటు చేయాలని సూచించారు. జర్నలిస్టులకు సురక్షిత పని వాతావరణం కల్పించడంతోపాటు సైబర్ వేధింపులు, ట్రోలింగ్, బెదిరింపులపై వేగంగా చర్యలు తీసుకునే విధానం అవసరమన్నారు.
డిజిటల్ మీడియాకు ప్రత్యేక పాలసీ
డిజిటల్ మీడియా కేవలం సోషల్ మీడియా కాదని, వార్తా సేకరణ, వాస్తవ నిర్ధారణ, విశ్లేషణ, ప్రచురణలో వృత్తిపరమైన ప్రమాణాలతో పనిచేస్తున్న జర్నలిజం విభాగమని కిరణ్ గౌడ్ పేర్కొన్నారు. డిజిటల్ జర్నలిస్టుల గుర్తింపు, రక్షణ, సంక్షేమానికి ప్రత్యేక విధానం రూపొందించాలన్నారు. సైబర్ సెక్యూరిటీ, ఫ్యాక్ట్ చెకింగ్, ఏఐ టెక్నాలజీ, డేటా జర్నలిజం, డిజిటల్ ఫోరెన్సిక్స్, క్రైమ్, ఎన్నికల కవరేజీ తదితర అంశాల్లో ప్రభుత్వం శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. డిజిటల్ జర్నలిస్టులకు సమాన హక్కులు, సమాన గుర్తింపు, సమాన రక్షణ, సమాన సంక్షేమం కల్పించడమే యూనియన్ లక్ష్యమని స్పష్టం చేశారు. డిజిటల్ మీడియా కేవలం సోషల్ మీడియా కాదని, వార్తా సేకరణ, వాస్తవ నిర్ధారణ, విశ్లేషణ, ప్రచురణలో వృత్తిపరమైన ప్రమాణాలతో పనిచేస్తున్న జర్నలిజం విభాగమని కిరణ్ గౌడ్ పేర్కొన్నారు. డిజిటల్ జర్నలిస్టుల గుర్తింపు, రక్షణ, సంక్షేమానికి ప్రత్యేక విధానం రూపొందించాలన్నారు. సైబర్ సెక్యూరిటీ, ఫ్యాక్ట్ చెకింగ్, ఏఐ టెక్నాలజీ, డేటా జర్నలిజం, డిజిటల్ ఫోరెన్సిక్స్, క్రైమ్, ఎన్నికల కవరేజీ తదితర అంశాల్లో ప్రభుత్వం శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. డిజిటల్ జర్నలిస్టులకు సమాన హక్కులు, సమాన గుర్తింపు, సమాన రక్షణ, సమాన సంక్షేమం కల్పించడమే యూనియన్ లక్ష్యమని స్పష్టం చేశారు.
సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి : కార్యదర్శి నాగరాజు
ప్రభుత్వం అమలు చేస్తున్న జర్నలిస్టుల ఆరోగ్య, సంక్షేమ పథకాలకు అర్హులైన డిజిటల్ జర్నలిస్టులను కూడా చేర్చాలని కార్యదర్శి నాగరాజు కోరారు. ఆరోగ్య బీమా, ప్రమాద బీమా, అత్యవసర వైద్య సహాయం, విధి నిర్వహణలో మృతి చెందిన జర్నలిస్టుల కుటుంబాలకు ఆర్థిక సాయం, పిల్లల విద్యకు తోడ్పాటు వంటి సంక్షేమ చర్యలు అందించాలన్నారు. దీర్ఘకాలంగా జర్నలిజంలో కొనసాగుతున్న వారికి వృద్ధాప్య సామాజిక భద్రత, అర్హులైన వారికి గృహ వసతి, ఇళ్ల స్థలాల కేటాయింపులో ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు.

