దమ్ముంటే రేవూరితో రాజీనామా చేయించి రండి
రేవంత్ వచ్చినా.. రేవూరి తాత వచ్చినా పరకాలలో పోటీ చేస్తా
సీఎం రేవంత్రెడ్డిపై కొండా సుస్మితా పటేల్ తీవ్ర వ్యాఖ్యలు
కాకతీయ, గీసుకొండ : కొండా ఇలాకాలోకి వచ్చి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తమ కుటుంబంపై ఎందుకు మాట్లాడుతున్నారని కొండా సుస్మితా పటేల్ ప్రశ్నించారు. దమ్ముంటే పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డితో రాజీనామా చేయించి ఎన్నికలకు రావాలని సవాల్ విసిరారు. రేవంత్రెడ్డి వచ్చినా.. రేవూరి ప్రకాశ్రెడ్డి కుటుంబం నుంచి ఎవరొచ్చినా పరకాలలో తాను పోటీ చేసి గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. గీసుకొండ మండలంలోని ఎస్ఎస్ ఫంక్షన్హాల్లో మంత్రి కొండా సురేఖ జన్మదిన వేడుకల సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో సుస్మితా పటేల్ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పరకాల ఎన్నికలకు ముందు రేవూరి ప్రకాశ్రెడ్డి ఎవరో ప్రజలకు తెలియదని సుస్మితా పటేల్ అన్నారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత రేవంత్రెడ్డికి కళ్లు నెత్తికెక్కాయా? అని ప్రశ్నించారు. రేవంత్రెడ్డి పీసీసీ అధ్యక్ష పదవి కోరుకున్న సమయంలో తొలుత కొండా మురళీ, కొండా సురేఖ పేర్లను కోరుకున్నారని తెలిపారు. కొండా మురళీకి ఎమ్మెల్సీ పదవి ఇస్తానని రేవంత్రెడ్డి హామీ ఇచ్చారని, ఆ మాట ఇచ్చారో లేదో ప్రమాణం చేయాలని సవాల్ చేశారు. హామీ ఇచ్చినప్పటికీ పదవి ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు.
‘దమ్ముంటే రాజీనామా చేయించి రండి’
పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డితో రాజీనామా చేయించి ఇప్పుడే ఎన్నికలకు రావాలని సుస్మితా పటేల్ సవాల్ చేశారు. రెండేళ్ల వరకు ఎందుకు వేచి ఉండాలని, ఇప్పుడే తేల్చుకుందామని అన్నారు. కాంగ్రెస్ టికెట్ ఇవ్వకపోయినా పరకాల నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుస్తానని ప్రకటించారు. రేవంత్రెడ్డి వచ్చినా, రేవూరి ప్రకాశ్రెడ్డి తాత వచ్చినా పరకాల నుంచి పోటీ చేసి గెలుస్తానని వ్యాఖ్యానించారు. త్వరలోనే పరకాలలో ఇల్లు కట్టుకుని ప్రజలకు అందుబాటులో ఉంటానని తెలిపారు.
రేవంత్రెడ్డికి ఇంకా కాంగ్రెస్ సంస్కృతి పూర్తిగా అబ్బలేదని సుస్మితా పటేల్ విమర్శించారు. టీడీపీ నాయకులంటే ఆయనకు ఎందుకు ఇష్టమో అర్థం కావడం లేదన్నారు. కాంగ్రెస్ ఇప్పుడు ‘అచ్చ కాంగ్రెస్’కు బదులుగా ‘పచ్చ కాంగ్రెస్’గా మారిపోయిందని ఆరోపించారు. సీఎం రేవంత్రెడ్డి, ఆయన సోదరుడు కలిసి దోచుకుంటున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. సీఎం బీసీ ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని పలువురు తమ వద్దకు వచ్చి చెబుతున్నారని తెలిపారు. వేం నరేందర్రెడ్డి గత మూడేళ్లుగా సీఎంకు ఇచ్చిన సలహాలు ఏమిటో చెప్పాలని ప్రశ్నించారు. కొండా మురళీ, కొండా సురేఖ మంచివారు కాబట్టే ఇంతకాలం రేవంత్రెడ్డి గురించి తాము మాట్లాడలేదని, ఇకపై తాను ‘చిట్టక్క’గా మాట్లాడుతున్నానని సుస్మితా పటేల్ అన్నారు. ఏఐసీసీపై తనకు గౌరవం ఉందని, అయితే రేవంత్రెడ్డి ఇకపై జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.

