సీన్ రివర్స్!
సీఎం అనుకున్నది కావడం లేదా..?
సురేఖపై చర్యలకు జాతీయ నాయకత్వం బ్రేకులు
కట్టలు తెంచుకున్న ఆగ్రహానికి అగ్రనాయకత్వం కట్టడి
సీఎం వచ్చాకే మాట్లాడుతానన్న సురేఖ వ్యాఖ్యల వెనుక అంతరార్థం అదేనా..?
కొండా ఫ్యామిలీకి నేరుగా సోనియాగాంధీ నుంచి సపోర్ట్
అందుకే మల్లు రవి స్వరం మారిపోయిందా..?!
బీసీ మహిళా మంత్రిపై అందరూ మాట్లాడటమేంటని అధిష్ఠానం ఆరా!
సీఎం రేవంత్రెడ్డి కోటరీలో రాజకీయ కలకలం!!
కాకతీయ, తెలంగాణ బ్యూరో : ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని లక్ష్యంగా చేసుకుని మంత్రి కొండా సురేఖ కుమార్తె సుష్మిత చేసిన వ్యాఖ్యలతో మొదలైన వివాదం అనూహ్య మలుపు తిరిగిందా? కొండా సురేఖపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం వర్గం నుంచి వచ్చిన డిమాండ్లకు జాతీయ నాయకత్వం బ్రేకులు వేసిందా? వ్యవహారం ఢిల్లీ పెద్దల దృష్టికి వెళ్లడంతో పరిస్థితిని చల్లబరిచే ప్రయత్నాలు మొదలయ్యాయా? అన్న చర్చ కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా సాగుతోంది. తొలుత సురేఖపై చర్యలు తప్పవన్న స్థాయిలో సాగిన చర్చ.. ఇప్పుడు అధిష్ఠానం జోక్యంతో వెనక్కి తగ్గినట్లు కనిపించడం రాజకీయ వర్గాలను విస్మయానికి గురిచేస్తోంది. అంతేకాదు.. ‘‘సీఎం వచ్చాకే మాట్లాడుతా’’ అని కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు కూడా ఈ పరిణామాలకు సంకేతమేనా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

చర్యలకు బ్రేకులెందుకు?
సుష్మిత వ్యాఖ్యలపై కాంగ్రెస్లో మొదట తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. ముఖ్యమంత్రిపై సొంత పార్టీకి చెందిన కుటుంబం నుంచి ఇలాంటి వ్యాఖ్యలు రావడాన్ని నాయకత్వం తీవ్రంగా పరిగణించినట్లు ప్రచారం జరిగింది. సీఎల్పీలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కొండా సురేఖపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయడం, మహిళా నేతలు బహిరంగంగా స్పందించడం కూడా ఈ వివాదం తీవ్రతను పెంచింది. దీంతో పార్టీ క్రమశిక్షణ కింద చర్యలు తప్పవన్న అభిప్రాయం బలపడింది. అయితే ఇప్పుడు పరిస్థితి మారిందన్న చర్చ సాగుతోంది. జాతీయ నాయకత్వం నుంచి వచ్చిన సూచనలతోనే రాష్ట్ర నాయకత్వం దూకుడును తగ్గించిందన్న ప్రచారం కాంగ్రెస్ వర్గాల్లో వినిపిస్తోంది. సురేఖపై వెంటనే చర్యలు తీసుకుంటే బీసీ మహిళా మంత్రిపై పార్టీ వివక్ష చూపుతోందన్న భావన ఏర్పడే అవకాశం ఉందని అధిష్ఠానం ఆరా తీసినట్లు సమాచారం.

కొండా కుటుంబానికి ఢిల్లీ అండా?
కొండా కుటుంబానికి కాంగ్రెస్ అధిష్ఠానంతో ఉన్న పాత సంబంధాలు ఇప్పుడు మరోసారి చర్చకు వస్తున్నాయి. ముఖ్యంగా సోనియాగాంధీతో కొండా కుటుంబానికి ఉన్న రాజకీయ అనుబంధం నేపథ్యంలో ఈ వివాదంలో జాతీయ నాయకత్వం జాగ్రత్తగా వ్యవహరిస్తోందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో ఒక మంత్రి కుటుంబానికి సంబంధించిన వివాదాన్ని కేవలం క్రమశిక్షణ సమస్యగా చూడకుండా.. దాని వెనుక ఉన్న సామాజిక, రాజకీయ అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని ఢిల్లీ పెద్దలు భావిస్తున్నారన్న చర్చ సాగుతోంది. అందుకే తొలుత కనిపించినంత వేగంగా చర్యలు లేకపోవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
మల్లు రవి స్వరం మారిందా?
ఈ పరిణామాల మధ్య కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి వైఖరిపైనా చర్చ మొదలైంది. మొదట తీవ్రంగా స్పందించిన నాయకుల స్వరాల్లోనూ ఇప్పుడు మార్పు కనిపిస్తోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బీసీ మహిళా మంత్రి విషయంలో పార్టీలోని పలువురు నేతలు ఒకేసారి మాట్లాడటం సరికాదన్న భావన అధిష్ఠానం వ్యక్తం చేసిందా? అందుకే కొందరు నాయకులు తమ వ్యాఖ్యలను మృదువుగా మార్చుకున్నారా? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అయితే ఈ మార్పు వెనుక అధికారికంగా ఏ నిర్ణయం వెలువడలేదు. కానీ రాష్ట్ర కాంగ్రెస్లో తాజా పరిణామాలను గమనిస్తున్న నేతలు మాత్రం ఢిల్లీ నుంచి వచ్చిన సంకేతాల ప్రభావమేనని విశ్లేషిస్తున్నారు.
‘సీఎం వచ్చాకే మాట్లాడుతా’..
తన కుమార్తె వ్యాఖ్యలపై కొండా సురేఖ ఇప్పటివరకు బహిరంగంగా ఘాటైన వివరణ ఇవ్వకుండా ‘‘ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వచ్చిన తర్వాత మాట్లాడుతా’’ అన్న ధోరణి అవలంబించడం కూడా చర్చనీయాంశమైంది. సాధారణంగా ఇలాంటి వివాదం తలెత్తిన వెంటనే మంత్రి తన వైఖరిని స్పష్టం చేయాల్సి ఉండగా.. సీఎం రాక కోసం వేచి చూస్తానని చెప్పడం వెనుక అంతరార్థం ఏమిటన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సీఎంతో నేరుగా మాట్లాడి సమస్యను పరిష్కరించుకునే ప్రయత్నమా? లేక అధిష్ఠానం నుంచి వచ్చిన సూచనల మేరకు వేచి చూసే ధోరణి అవలంబిస్తున్నారా? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. రేవంత్రెడ్డి తిరిగి హైదరాబాద్కు వచ్చిన తర్వాతే ఈ వివాదంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
బీసీ కార్డు తెరపైకి..
ఇప్పటివరకు వ్యవహారం ముఖ్యమంత్రి వర్సెస్ కొండా కుటుంబంగా కనిపించినా.. ఇప్పుడు బీసీ మహిళా మంత్రి అంశం కూడా చర్చలోకి రావడం పరిస్థితిని మరింత సంక్లిష్టంగా మార్చింది. ఒక బీసీ మహిళా మంత్రిపై పార్టీకి చెందిన పలువురు నేతలు వరుసగా బహిరంగంగా మాట్లాడటం ఎందుకన్న ప్రశ్నను అధిష్ఠానం పరిశీలిస్తున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటికే రాష్ట్ర రాజకీయాల్లో సామాజిక సమీకరణాలు కీలకంగా మారిన నేపథ్యంలో సురేఖపై కఠిన చర్యలు తీసుకోవడం ద్వారా కొత్త రాజకీయ సమస్యలు తలెత్తకుండా జాతీయ నాయకత్వం జాగ్రత్త పడుతోందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. దీంతోనే చర్యల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తోందన్న ప్రచారం సాగుతోంది.
సీఎం కోటరీలో కలకలం!
మొత్తంగా సుష్మిత వ్యాఖ్యలతో మొదలైన వివాదం ఇప్పుడు ముఖ్యమంత్రి కోటరీలోనే రాజకీయ కలకలానికి కారణమైందన్న చర్చ జరుగుతోంది. సీఎంకు మద్దతుగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ముందుకు వచ్చినా.. మంత్రుల మౌనం, ఆ తర్వాత జాతీయ నాయకత్వం జోక్యం చేసుకున్నట్లు జరుగుతున్న ప్రచారం కొత్త సమీకరణాలకు తెరతీసింది. ముఖ్యమంత్రి రాక తర్వాత కొండా సురేఖతో నేరుగా చర్చిస్తారా? సురేఖపై చర్యల విషయంలో వెనక్కి తగ్గుతారా? లేక పార్టీ క్రమశిక్షణను కాపాడేందుకు ఏదైనా నిర్ణయం తీసుకుంటారా? అన్నదే ఇప్పుడు కీలకం. మరోవైపు ఈ వ్యవహారంలో సోనియాగాంధీ స్థాయిలో కొండా కుటుంబానికి రాజకీయంగా అండ ఉందన్న ప్రచారం ఎంతవరకు వాస్తవమన్నదానిపైనా కాంగ్రెస్ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఒకవైపు సీఎంకు ఎమ్మెల్యేల బహిరంగ మద్దతు.. మరోవైపు మంత్రుల మౌనం.. ఇంకోవైపు అధిష్ఠానం జోక్యం అన్న ప్రచారం.. వెరసి తెలంగాణ కాంగ్రెస్లో ఈ వ్యవహారం ఇప్పుడు సాధారణ వివాదాన్ని దాటి నాయకత్వ సమీకరణాల పరీక్షగా మారింది.

