22ఏ భూములపై సమరం
నిషేధిత జాబితా నుంచి భూములను తొలగించాలని డిమాండ్
98 శాతం భూములు తొలగించామని మంత్రి పొంగులేటి చెప్పడం పచ్చి అబద్ధం
బాధితులను కార్యాలయాల చుట్టూ తిప్పుతున్నారు
22ఏ జాబితా వెనుక భారీ కమీషన్ల బాగోతం ఉందని ఆరోపణ
నిషేధిత జాబితాను బహిర్గతం చేయాలి.. శ్వేతపత్రం విడుదల చేయాలి
సెప్టెంబరు 7 నుంచి అసెంబ్లీలో బాధితుల తరఫున పోరాడతాం : మాజీ మంత్రి హరీశ్రావు
కాకతీయ, తెలంగాణ బ్యూరో : 22ఏ నిషేధిత భూముల వ్యవహారంలో ప్రభుత్వం చెబుతున్న లెక్కలకు.. క్షేత్రస్థాయిలో బాధితుల పరిస్థితులకు పొంతన లేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్రావు ధ్వజమెత్తారు. ‘‘98 శాతం భూములను 22ఏ జాబితా నుంచి తొలగించామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి చెబుతున్న మాటలు పచ్చి అబద్ధం. అదే నిజమైతే వందలాది మంది బాధితులు తమ గోడు చెప్పుకోవడానికి సమావేశానికి ఎందుకు వస్తారు?’’ అని ప్రశ్నించారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం షాపూర్నగర్లోని ఎం.జే. గార్డెన్స్లో ఎమ్మెల్యే కేపీ వివేకానంద ఆధ్వర్యంలో 22ఏ నిషేధిత భూముల బాధిత కుటుంబాలతో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. బాధితుల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకుని.. బీఆర్ఎస్ పార్టీ వారి తరఫున అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
‘ప్రభుత్వం చేసిన తప్పుకు ప్రజలెందుకు తిరగాలి?’
‘‘ప్రజల భూములను 22ఏ జాబితాలో చేర్చడం ప్రభుత్వం చేసిన తప్పు. ఆ తప్పును సరిదిద్దుకోవడానికి దరఖాస్తుల పేరుతో సామాన్య ప్రజలు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ ఎందుకు తిరగాలి? లక్షలాది ప్రజల ఆస్తులను రాత్రికి రాత్రే నిషేధిత జాబితాలో పెట్టి వారికి కంటి మీద కునుకు లేకుండా చేయడం ఏంటి? ప్రభుత్వం ప్రజలకు రక్షణగా ఉండాలి కానీ.. వాళ్ల ఆస్తుల విషయంలో ఇబ్బందులకు గురిచేయడం సరికాదు’’ అని హరీశ్రావు అన్నారు. ‘‘58 ఏళ్ల క్రితం ఏర్పడిన పద్మారావునగర్ ఫేజ్-1, 1950ల నాటి స్ప్రింగ్ఫీల్డ్, నిజాంపేట్ వంటి కాలనీల్లోని దశాబ్దాల క్రితం నాటి పట్టా భూములను కూడా 22ఏలో చేర్చారు. ఇలాంటి భూములను నిషేధిత జాబితాలో చేర్చడం తుగ్లక్ చర్య కాక మరేమిటి?’’ అని ప్రశ్నించారు.
‘లంచాలు ఇస్తేనే పనులా?’
ప్రభుత్వ కార్యాలయాల్లో పని కావాలంటే లంచాలు చెల్లించాల్సిందే అన్నట్లుగా పరిస్థితి తయారైందని హరీశ్రావు ఆరోపించారు. ‘‘ముఖ్యమంత్రి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఏజెంట్లు వసూళ్లకు దిగుతున్నారనే ఆరోపణలు బాధితుల నుంచి వస్తున్నాయి. మహబూబ్నగర్కు చెందిన ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే స్ప్రింగ్ఫీల్డ్ కాలనీలో విల్లాకు, ఫ్లాట్కు రూ.30 వేల చొప్పున వసూలు చేస్తున్నారని బాధితులు బహిరంగంగానే చెబుతున్నారు. డబ్బులు ఇస్తేనే పని అవుతుందని వాపోతున్నారు’’ అని అన్నారు. అమీన్పూర్కు చెందిన ఓ బాధితుడి పరిస్థితిని ప్రస్తావిస్తూ.. ‘‘ఎంఆర్వో, ఆర్డీవో, కలెక్టర్ అంటూ కార్యాలయాల చుట్టూ తిప్పించుకుని.. చివరకు బయట బ్రోకర్లను కలిస్తేనే పని అవుతుందని పరోక్షంగా బెదిరిస్తున్నారు’’ అని ఆరోపించారు.
‘కమీషన్ల కోసమే 22ఏ కుట్ర’
‘‘ఈ 22ఏ వ్యవహారం వెనుక భారీ కమీషన్ల బాగోతం దాగి ఉంది. దీనికి ఏ-1 రేవంత్రెడ్డి, ఏ-2 పొంగులేటి శ్రీనివాస్రెడ్డి. 50-50 కమీషన్ల కోసమే ఈ దోపిడీ జరుగుతోంది’’ అని హరీశ్రావు తీవ్ర ఆరోపణలు చేశారు. ‘‘రేవంత్రెడ్డికి రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగా తెలుసని చెబుతుంటారు. ఆ వ్యాపారం తెలిసిన వ్యక్తి ప్రజల కష్టాలు తీర్చాలి కానీ.. వారి రక్తం పీల్చి పిప్పి చేయడం ఏంటి?’’ అని ప్రశ్నించారు. రాష్ట్రంలో హెచ్ఎండీఏ, టీజీఐఐసీ, హౌసింగ్ బోర్డు భూములతోపాటు చివరకు పిల్లలు ఆడుకునే వెయ్యి గజాల పార్కులను కూడా అమ్మకానికి పెడుతున్నారని ఆరోపించారు. ‘‘ఇలా అమ్ముకుంటూ పోతే రేపు గుడికో, బడికో.. చివరకు స్మశానవాటికకు కూడా భూమి మిగలదు’’ అని అన్నారు.
‘రాష్ట్రవ్యాప్తంగా సమస్య’
22ఏ సమస్య హైదరాబాద్కే పరిమితం కాలేదని హరీశ్రావు పేర్కొన్నారు. ‘‘రాష్ట్రవ్యాప్తంగా సుమారు కోటి ఎకరాల వ్యవసాయ భూములను కూడా 22ఏలో పెట్టారు. ఈ సమస్యపై ప్రభుత్వం సమగ్రంగా దృష్టి పెట్టాలి’’ అని డిమాండ్ చేశారు. మల్కాజిగిరిలో తాను 22ఏ భూముల సమస్యపై మాట్లాడినప్పుడు అక్కడికి వచ్చిన బాధితుల పేర్లు నమోదు చేసి వారి భూములను జాబితా నుంచి తొలగించారని తెలిపారు. తెలంగాణ భవన్కు వచ్చిన బాధితుల వివరాలు తీసుకున్న తర్వాత కూడా కొన్ని భూములను జాబితా నుంచి తొలగించారని చెప్పారు. ‘‘అంటే బీఆర్ఎస్ పోరాటం వల్లే ప్రభుత్వంలో ఈ మాత్రం కదలిక వచ్చింది’’ అని పేర్కొన్నారు.
‘సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి’
22ఏ జాబితాలో భూములను ఎవరు చేర్చారో తేల్చాలని హరీశ్రావు డిమాండ్ చేశారు. ‘‘భూములను ఎవరు నిషేధిత జాబితాలో పెట్టమన్నారు? ఏ ప్రాతిపదికన చేర్చారు? దీనిపై సమగ్ర విచారణ జరగాలి. తక్షణమే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి’’ అని అన్నారు. నిషేధిత భూముల జాబితాను ప్రభుత్వం బహిరంగంగా అందుబాటులో ఉంచాలని కోరారు. ‘‘22ఏ జాబితాను సీక్రెట్గా ఎందుకు ఉంచుతున్నారు? వెబ్సైట్లో జాబితాను ఎందుకు బ్లాక్ చేశారు? ప్రభుత్వం వెంటనే పూర్తి వివరాలతో శ్వేతపత్రం విడుదల చేయాలి’’ అని డిమాండ్ చేశారు.
‘అసెంబ్లీలో దద్దరిల్లేలా పోరాటం’
‘‘ప్రజల గొంతుకగా బీఆర్ఎస్ ఎప్పుడూ ముందుంటుంది. ప్రజల కష్టాలు ఎక్కడుంటే అక్కడ పార్టీ అండగా నిలబడుతుంది. సెప్టెంబరు 7న అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన వెంటనే 22ఏ బాధితుల సమస్యలను సభలో ప్రధానంగా ప్రస్తావిస్తాం. అవసరమైతే సభను దద్దరిల్లేలా స్తంభింపజేసి అయినా బాధితులకు న్యాయం జరిగేలా కొట్లాడతాం’’ అని హరీశ్రావు స్పష్టం చేశారు. ప్రజల భూములతో చెలగాటమాడుతున్న రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డిని ముఖ్యమంత్రి వెంటనే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. 22ఏ జాబితాపై సమగ్ర విచారణ, పూర్తి వివరాలతో శ్వేతపత్రం, బాధితుల భూములకు పరిష్కారం లభించే వరకు బీఆర్ఎస్ పోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.

