పుష్కరిణి నిర్మాణానికి భూమి విరాళం
స్వామివారి పుష్కరిణి నిర్మాణానికి దాతలు సహకరించాలి
మాజీ సర్పంచ్ జ్ఞాపకార్థం రూ.8 లక్షల విలువైన గుంట భూమి విరాళం
ఆలయ ప్రధాన అర్చకులు సముద్రాల సుదర్శనాచార్యుల విజ్ఞప్తి
కాకతీయ, గీసుగొండ : స్వామివారి పుష్కరిణి నిర్మాణానికి దాతలు ముందుకు వచ్చి సహకరించాలని ఆలయ ప్రధాన అర్చకులు సముద్రాల సుదర్శనాచార్యులు కోరారు. ఊకల్ గ్రామ మాజీ సర్పంచ్ కీర్తిశేషులు పిన్నింటి రామారావు జ్ఞాపకార్థం ఆయన సతీమణి పిన్నింటి సోమక్క రూ.8 లక్షల విలువైన గుంట భూమిని పుష్కరిణి నిర్మాణానికి విరాళంగా అందజేశారని తెలిపారు. మండలంలోని ఊకల్ గ్రామంలో కొలువుదీరిన శ్రీ వల్లీ దేవసేన సమేత నాగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయంలో శ్రావణ మాస చివరి మంగళవారం సందర్భంగా పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు సముద్రాల సుదర్శనాచార్యుల ఆధ్వర్యంలో స్వామివారికి పంచామృతాలతో అభిషేకం చేసి, వైదిక మంత్రోచ్ఛారణల మధ్య విశేష పూజలు నిర్వహించారు. అనంతరం వివిధ రకాల పూలతో స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించారు. గీసుగొండ సీఐ విశ్వేశ్వర్ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ తిమ్మాపురం రాజేశ్వరరావు, కోశాధికారి కొత్తగట్టు రాజేందర్, డీఎల్పీఓ వేదవతి, రాయ తదితరులు పాల్గొన్నారు.

