పెండింగ్ కేసుల పరిష్కారంలో జాప్యం వద్దు
బాధితులకు సత్వర న్యాయం అందించాలి
రాజన్న జోన్-3 డీఐజీ సన్ప్రీత్ సింగ్
కాకతీయ, కరీంనగర్ : పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించి బాధితులకు సత్వర న్యాయం అందించాలని రాజన్న జోన్-3 డీఐజీ సన్ప్రీత్ సింగ్ ఆదేశించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా మంగళవారం కరీంనగర్ టౌన్ ఏసీపీ కార్యాలయంలో నేరాల రికార్డులు, పెండింగ్ కేసులు, సీసీటీఎన్ఎస్ నిర్వహణ, శాంతిభద్రతల పరిస్థితిపై కమిషనర్ గౌస్ ఆలంతో కలిసి సమీక్ష నిర్వహించారు. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ ఫిర్యాదులపై వేగంగా స్పందించాలని సూచించారు. రానున్న వినాయక చవితి వేడుకలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ప్రశాంత వాతావరణంలో జరిగేలా పటిష్ట భద్రతా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కార్యక్రమంలో కరీంనగర్ టౌన్ ఏసీపీ సి.హెచ్. వెంకటస్వామి, టౌన్ ఇన్స్పెక్టర్లు రామచందర్ రావు, తిరుమల్, పుల్లయ్యలతో పాటు డివిజన్ పరిధిలోని ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

