మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి పెట్టండి
నీటి సమస్యలు రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలి
గ్రామ అభివృద్ధికి అధికారులు సమన్వయంతో పని చేయాలి
అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేయాలి
నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు
పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి
సంగెం మండల సమీక్ష సమావేశంలో అధికారులకు హెచ్చరికలు
కాకతీయ, సంగెం: గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి సూచించారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మంగళవారం సంగెం మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన మండల స్థాయి సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. పంచాయతీరాజ్, రెవెన్యూ శాఖల అధికారులతో కలిసి గ్రామాల్లోని తాజా పరిస్థితులు, అభివృద్ధి పనులపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామాల్లో పారిశుధ్యం (శానిటేషన్), తాగునీటి సరఫరా, వీధి దీపాల వ్యవస్థపై పంచాయతీ కార్యదర్శులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు. ముఖ్యంగా వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని ఎక్కడా తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. ఓహెచ్ఎస్ఆర్ నీటి ట్యాంకుల్లో మిషన్ భగీరథ నీరు, రా వాటర్ కలవకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. నీటి వృథాను అరికట్టేలా ప్రజల్లో అవగాహన కల్పించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం
గ్రామాల్లో గుడుంబా నియంత్రణకు కఠిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే ఆదేశించారు. గంజాయి, డ్రగ్స్ వంటి అసాంఘిక కార్యకలాపాలపై నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, యువత బాట పట్టకుండా చూడాలన్నారు. గ్రామాల సమగ్ర అభివృద్ధికి అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. రేషన్ షాపుల ద్వారా బియ్యం పంపిణీ సక్రమంగా జరిగేలా చూడాలని, అర్హులైన ప్రతి పేదవాడికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందడమే లక్ష్యంగా పనిచేయాలని స్పష్టం చేశారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సమావేశంలో జిల్లా పంచాయతీ అధికారి (డీపీఓ) కటకం కల్పన, డిఎల్పీఓ వేదవతి, తహసీల్దార్ రాజ్ కుమార్, ఎంపీడీఓ రవీందర్, జీపీఓలు, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

