సహకరించండి
ప్రజా రవాణాకు ఇబ్బంది కలిగించొద్దు
సమస్యల పరిష్కారంపై సానుకూలంగా ప్రభుత్వం
సీనియర్ ఐఏఎస్ అధికారులతో కమిటీ ఏర్పాటు
ఆర్టీసీ కార్మికుల సమ్మెపై మంత్రి పొన్నం ప్రభాకర్
కమిటీ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు..
యూనియన్ నేతలతో చర్చకు యాజమాన్యం పిలుపు
కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారంపై తమ ప్రభుత్వం సానుకూలంగా ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ప్రభుత్వం నిర్ణయాలు తీసుకునే అంశంలో కొంత జాప్యం జరగవచ్చని తెలిపారు. ఆర్టీసీ కార్మికులు లేవనెత్తిన అన్ని అంశాలను పరిశీలించడానికి నలుగురు అధికారులతో ఒక కమిటీ ఏర్పాటు చేసిందని ప్రస్తావించారు. ఆర్టీసీ ప్రతినిధులంతా ఆ కమిటీకి కార్మికుల సమస్యలు విన్నవిస్తే ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, తాను అధికారుల దగ్గర చర్చించి సమస్యలు పరిష్కరిస్తామని చెప్పుకొచ్చారు. ఉద్యోగులుగా మీరు.. ప్రభుత్వంగా తాము కలిసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూసే బాధ్యత ఉందని పేర్కొన్నారు. ఆర్టీసీ సంస్థ పరిరక్షణ, ఉద్యోగుల సంక్షేమం, ప్రయాణికుల సౌలభ్యం చూడటమే తమ ప్రభుత్వ లక్ష్యమని వ్యాఖ్యానించారు. ఎలాంటి భేషజాలకు పోకుండా అధికారుల కమిటీకి ఉద్యోగుల సమస్యలు విన్నవించాలని సూచించారు. ఆయా సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.
రోజూ 65 లక్షల మంది ప్రయాణికులు
ఈ సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగాలు రోజూ 65 లక్షల మంది ప్రయాణికులు ఆర్టీసీ బస్సులపై ఆధారపడి ప్రయాణాలు చేస్తూ ఉంటారని మంత్రి పొన్నం గుర్తు చేశారు. మరీ ముఖ్యంగా గ్రామాల్లోని పేదలకు బస్సు ప్రయాణమే ఆధారమని తెలిపారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంతోపాటు.. ఆర్టీసీపైనా ఉందని పేర్కొన్నారు. ఆర్టీసీ సంస్థ మనుగడను రక్షిస్తూనే కార్మికుల ప్రయోజనాలను కాపాడుకుంటామని స్పష్టం చేశారు. తమ డిమాండ్లపై పట్టుబట్టి ఉండకుండా.. కమిటీ ముందు కార్మిక సంఘాలు తమ బాధలు చెప్పుకోవాలని మంత్రి పొన్నం తెలిపారు. ప్రభుత్వంపై నమ్మకం పెట్టుకుని చర్చలకు సహకరించాలని సూచించారు. సమస్యను ముగించి ప్రజారవాణా సాఫీగా జరిగేలా చూడాలని కోరారు.
కమిటీ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు..
తమ డిమాండ్లను పరిష్కరించాలని లేకపోతే ఈనెల 22వ తేదీ నుంచి సమ్మెకు దిగుతామంటూ ఆర్టీసీ కార్మికులు హెచ్చరించిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించే దిశగా సీనియర్ ఐఏఎస్ అధికారులతో ఈ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలోనే ఉన్నతాధికారులు చర్చలకు ఆర్టీసీ జేఏసీ నేతలను ఆహ్వానించారు. కార్మికులు చేస్తున్న డిమాండ్లను పరిశీలించేందుకు ఈ స్పెషల్ కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీ.. కార్మిక సంఘాల నాయకులతో సమావేశమై చర్చించనుంది. ఈ నేపథ్యంలోనే ఆర్టీసీ యాజమాన్యం తాజాగా చర్చలకు ఆహ్వానించింది. ఆర్టీసీ ఈడీ వెంకన్న, సీపీఎం ఉషాదేవి నుంచి ఆర్టీసీ జేఏసీ కీలక నేతలకు పిలుపు వచ్చింది. రవాణాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఛైర్మన్గా ఈ కమిటీ ఏర్పాటైంది. ఇందులో ఆర్థిక, కార్మిక శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు సభ్యులుగా ఉండనున్నారు. ఇక టీజీఎస్ఆర్టీసీ వైస్ ఛైర్మన్, ఎండీ కన్వీనర్గా ఉంటారు. ఆర్టీసీ కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా అన్ని సమస్యలపై ఈ కమిటీ సమగ్ర అధ్యయనం చేపట్టి 4 వారాల గడువులోగా నివేదికను సమర్పించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

