తెలంగాణ రాష్ట్ర సేన ఆవిర్భావం
కొత్త పార్టీని ప్రకటించిన కల్వకుంట్ల కవిత
తెలంగాణ ఆత్మ కోల్పోయినందుకే బీఆర్ఎస్కు దూరం
మూడు కోట్ల మందికి అమ్మలా సేవ చేయడమే లక్ష్యం
సామాజిక న్యాయం కోసం మలి రాజకీయ ప్రస్థానం
టీఆర్ఎస్ ను గడపగడపకు చేరుస్తాం
గత పాపాల్లో నాకూ భాగముంది.. క్షమించండి
కేసీఆర్ ఆధ్వర్యంలో ఉద్యమ రథం దారి తప్పింది
ఆ కుటుంబంలో ఉన్నందుకు సిగ్గుపడుతున్నా
పార్టీ ఆవిర్భావ ప్రసంగంలో కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
కాకతీయ,తెలంగాణ బ్యూరో : తెలంగాణ రాజకీయ యవనికపై శనివారం పెను సంచలనం నమోదైంది. తన తండ్రి కేసీఆర్ స్థాపించిన భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) తెలంగాణ ఆత్మను కోల్పోయిందని ఆరోపిస్తూ ఆ పార్టీ మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సరికొత్త రాజకీయ ప్రయాణానికి శ్రీకారం చుట్టారు. హైదరాబాద్లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆమె తన కొత్త పార్టీ తెలంగాణ రాష్ట్ర సేన పేరును ప్రకటించారు. ఈ సందర్భంగా ఆమె చేసిన ప్రసంగం సొంత కుటుంబాన్ని మరియు గత ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని పశ్చాత్తాపం మరియు ఆగ్రహం మిళితమై సాగింది. ఉద్యమ పార్టీగా పుట్టిన బీఆర్ఎస్ క్రమంగా తన ఉనికిని కోల్పోయిందని విమర్శిస్తూ ఆమె చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.
Remember The Name: Telangana Rashtra Sena
We refuse to back down, come what may;
It is time the people of Telangana have their say.
We will not let our aspirations decay;
Be reduced to ashes if you dare come in our way.Your Time is Done, Our Time is Now.#TRS… pic.twitter.com/UICyMplYJ1
— Kavitha Kalvakuntla (@RaoKavitha) April 25, 2026
దారి తప్పిన రథంపై కవిత పశ్చాత్తాపం
పార్టీ ఆవిర్భావం సభలో కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ మనం ఎంతో కష్టపడి తెలంగాణ తెచ్చుకున్నాం కానీ మనం కలలు కన్న రాష్ట్రం రాలేదని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ ఆధ్వర్యంలో ఉద్యమ రథం దారి తప్పిందని అన్నారు. సామాజిక రథ చక్రం విరిగి ముక్కలైందని వ్యాఖ్యానించారు. ఆనాడు పరిపాలించిన ఆ కుటుంబంలో తాను ఒక భాగమైనందుకు ఈరోజు సిగ్గుపడుతున్నానని కవిత కుండబద్దలు కొట్టారు. గత పాలనలో ఇసుక దందాల మీద ప్రేమతో దళితుల ప్రాణాలు పోయాయని మరియు దారుణమైన నిఘా నీడలో ఫోన్ మాట్లాడాలన్నా భయం వేసే పరిస్థితి నెలకొందని తీవ్ర విమర్శలు చేశారు. తన తప్పులకు భాగస్వామ్యం ఉందన్న దానికి కేవలం క్షమాపణ చెబితే సరిపోదని ఆ తప్పులను దిద్దుకోవడానికే ఈ సేనగా ప్రజల ముందుకు వస్తున్నానని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు.
జాగృతి కాగడ నుంచి రాజకీయ శక్తి వరకు
తెలంగాణ జాగృతి ద్వారా ఇరవై ఏళ్లుగా బతుకమ్మను విశ్వవ్యాప్తం చేసి ఉద్యమంలో ఆడబిడ్డలను భాగస్వాములను చేసిన ప్రస్థానాన్ని ఆమె ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. జాగృతి అనేది ఆడబిడ్డల చేతిలో కాగడ అయ్యిందని కానీ బీఆర్ఎస్ అనే పార్టీ తెలంగాణ ఆత్మను పూర్తిగా కోల్పోయిందని దుయ్యబట్టారు. అందుకే రాజకీయ శక్తి ఉంటేనే సామాజిక న్యాయం సాధ్యమని నమ్మి ఈ పార్టీని స్థాపించానని స్పష్టం చేశారు. తెలంగాణలోని మూడు కోట్ల మందికి ఒక అమ్మలా పరిణతి చెంది ఆర్తితో కూడిన పాలన అందించడమే తన ప్రధాన అజెండా అని కవిత ప్రకటించారు. గతంలో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా సామాజిక తెలంగాణను నిర్మిస్తామని ఆమె హామీ ఇచ్చారు.
సామాజిక స్ఫూర్తితో ప్రజా పోరాటం
చాకలి ఐలమ్మ మరియు గద్దరన్న అలాగే మారోజు వీరన్నల పోరాట స్ఫూర్తితో సమ్మక్క సారక్కల సామాజిక స్ఫూర్తిని పుణికిపుచ్చుకుని తెలంగాణ రాష్ట్ర సేన ముందుకు వెళ్తుందని కవిత ప్రకటించారు. కొండ లక్ష్మణ్ బాపూజీ మరియు పాపన్న గౌడ్ అలాగే పంతు నాయక్ వంటి మహనీయుల ఆశయాల సాక్షిగా సామాజిక న్యాయ తెలంగాణను సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర సేన కేవలం ఒక పార్టీ మాత్రమే కాదని ఇది తెలంగాణ ఆత్మగౌరవ పోరాటమని ఆమె అభివర్ణించారు. రాజకీయ శక్తితో ప్రజా పోరాటాలను మిళితం చేసి కొత్త చరిత్రను రచిస్తామని పిలుపునిచ్చారు. సొంత తండ్రిపైనే కవిత తిరుగుబాటు జెండా ఎగురవేయడం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ పరిణామం తెలంగాణ రాజకీయాల్లో ఎటువంటి మలుపులు తిరుగుతుందోనని రాజకీయ విశ్లేషకులు ఆసక్తిగా గమనిస్తున్నారు.

