మా ఫోన్యూ హ్యాక్..
అధికారులూ తస్మాత్ జాగ్రత్త
మీరు రిటైర్ అయినా వదలిపెట్టం
హిట్లర్ను మించిపోయిన కాంగ్రెస్ పాలన
దొంగలను వదిలేసి ఫిర్యాదుదారులను జైల్లో ..
జూబ్లీహిల్స్ లో కూర్చుంటే సమస్యలు ఎలా తెలుస్తాయి?
రేవంత్ మళ్లీ గెలిచేదిలేదు… ఉన్నన్ని రోజులైనా సక్కగ పనిచేయ్
బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు
సంగారెడ్డి జైల్లో మన్నె క్రిశాంక్కు పరామర్శ
కాకతీయ, తెలంగాణ బ్యూరో: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీశ్ రావు మరోమారు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రేవంత్ మూర్కత్వం.. హిట్లర్ను మించిపోయిందని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్పై దాడి కేసులో సంగారెడ్డి జిల్లా కంది సెంట్రల్ జైలులో రిమాండ్లో ఉన్న బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్తో పాటు మరో ఏడుగురు పార్టీ కార్యకర్తలను హరీశ్ రావు పరామర్శించారు. అనంతరం హరీశ్ రావు మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పోలీసుల తీరుపై మండిపడ్డారు. కొంత మంది ఐపీఎస్లు తమ ఫోన్లను.. ఇంటి ముందున్న సిసి కెమెరాలను హ్యాక్ చేస్తున్నారని ఆరోపించారు. బెంగళూరు నుంచి హ్యాకర్లను తీసుకొచ్చి తమపై నిఘా పెడుతున్నారన్నారు. ‘అలాంటి అధికారులు జాగ్రత్త.. మీరు రిటైర్డ్ అయినా మిమ్మల్ని వదలం’ అని హెచ్చరించారు.
వంద కోట్లతో రేవంత్రెడ్డి ప్యాలెస్
జూబ్లీహిల్స్ ప్యాలెస్ చాలదన్నట్టు ఎంసీఆర్హెచ్ఆర్డీలో వంద కోట్లతో కొత్త ప్యాలెస్ కట్టుకుంటున్నావు. నీ పాలనలో సగం కాలం పూర్తయింది, మిగిలిన సగం కాలమైనా ప్రజలకు ఏదైనా మేలు చేసే ప్రయత్నం చెయ్ అని సూచించారు. రైతులు 20 రోజులుగా కొనుగోలు కేంద్రాల దగ్గర పడిగాపులు కాస్తుంటే శనగలు, సన్ ఫ్లవర్ కొనే నాథుడే లేడన్నారు. మీ మంత్రులు నిద్రపోతున్నారా..? మీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తోంది..? ఎకరాకు కేవలం 26 క్వింటాళ్లు మాత్రమే కొంటామని మక్కలకు కొత్త షరతులు పెట్టి రైతులను ఇబ్బంది పెడుతున్నారు. 13 లక్షల ఎకరాల్లో పంట వస్తే కనీసం సగం కూడా కొనలేని దుస్థితిలో మీరున్నారు. రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు ఆరు గ్యారంటీలతో పాటు ఏడో గ్యారంటీగా ప్రజాస్వామ్యం కల్పిస్తామని చెప్పి నేడు నియంతలా వ్యవహరిస్తున్నారన్నారు. కేసీఆర్, బీఆర్ఎస్ నాయకత్వంపై ఫేక్ పోస్టులు పెడుతున్న వారి గురించి పోలీసులకు ఆధారాలతో సహా ఫోన్ అప్పగించి క్రిశాంక్ ఫిర్యాదు చేశారు.. కానీ తప్పు చేసిన వారిని వదిలేసి, ఫిర్యాదు ఇచ్చిన క్రిశాంక్ నే అరెస్టు చేయడం అత్యంత దుర్మార్గం. దొంగలను వదిలేసి ఫిర్యాదుదారులను జైల్లో పెడతారా..? ముఖ్యమంత్రి, హోం మంత్రి రెండు బాధ్యతలూ మీరే పెట్టుకుని ఇలాంటి అరాచకాలకు పాల్పడతారా..? రేవంత్ రెడ్డి అని ప్రశ్నించారు.
అక్రమ కేసులు ఎత్తివేయాలి
వడ్ల కొనుగోలు కేంద్రాలు ఇంకా ప్రారంభం కాలేదు. వడ్లకు ఐదారు కిలోల తరుగు తీస్తున్నారు. తరుగు పెడితే తోలు తీస్తానన్న రేవంత్ రెడ్డి ఇప్పుడెవరి తోలు తీస్తాడో చెప్పాలి. మిల్లుల ముందు లారీలు నాలుగైదు రోజులుగా ఆగిపోతున్నాయి. యాసంగి సన్నవడ్లకు బోనస్ ఇస్తావా? ఇవ్వవా? స్పష్టం చెయ్. ఇవ్వలేకపోతే తప్పుకో లేదా జరిగింది చెప్పుకో అంతేకానీ ఏ సంగతీ చెప్పకుండా రైతులను మోసం చేయొద్దు. ఎండలో రైతులు మాడిపోతుంటే పట్టించుకునే తెలివి లేదా..? రైతుల కష్టాలు మీకు పట్టవా…? అని ఫైర్ అయ్యారు. ఇప్పటికైనా అక్రమ కేసులు బంద్ చేసి, ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలు గురించి ఆలోచించు. ప్రజలు మెచ్చే పాలన అందించు అని అన్నారు. క్రిశాంక్ పై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలి. మళ్లీ పీటీ వారెంట్లు వేసి ఇబ్బంది పెట్టాలని చూస్తే మాత్రం చూస్తూ ఊరుకోమని హరీష్ రావు హెచ్చరించారు.

