ఆధ్యాత్మిక చింతనతోనే మానసిక ప్రశాంతత
హన్మకొండ డీసీసీ అధ్యక్షుడు, కుడా చైర్మన్ ఇనగాల
శ్రీ కోదండ రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్న వెంకట్రామ్ రెడ్డి
అక్కెంపేటలో వైభవంగా విగ్రహ ప్రతిష్టాపన, కుంభాభిషేకం
కాకతీయ, ఆత్మకూరు: ఆధ్యాత్మిక చింతన ద్వారానే మానసిక ప్రశాంతత లభిస్తుందని హనుమకొండ డీసీసీ అధ్యక్షుడు, కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి అన్నారు. బుధవారం ఆత్మకూరు మండలం అక్కెంపేట గ్రామంలోని శ్రీ కోదండ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో నిర్వహించిన అన్నపూర్ణ సమేత రామలింగేశ్వర స్వామి, విఘ్నసిద్ధి వినాయక విగ్రహ ప్రతిష్టాపన మరియు కుంభాభిషేక మహోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గ్రామస్తులు, కమిటీ సభ్యులు కలిసి ఇంతటి భవ్యమైన ఆలయాన్ని నిర్మించడం అభినందనీయమని కొనియాడారు. భక్తులందరికీ ఆ దేవుడి ఆశీస్సులు లభించాలని, గ్రామాలు సుభిక్షంగా వర్ధిల్లాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ముద్దం కృష్ణ, రాజు మరియు ఇతర నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

