కలం కార్మికులే సమాజానికి దిక్సూచి
పనిగంటలకు అతీతంగా జర్నలిస్టుల సేవలు
అమరవీరులకు, మధుసూదన్కు ఘన నివాళి
టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కార్యదర్శి రాజశేఖర్
కాకతీయ, మయూరి సెంటర్. : సమాజానికి కళ్లు, చెవుల్లా నిలిచే జర్నలిస్టులు పనిగంటలకు అతీతంగా ప్రజాహితం కోసం అంకితభావంతో పనిచేస్తున్నారని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర కార్యదర్శి రాజశేఖర్ కొనియాడారు. మే డే సందర్భంగా ఖమ్మం ప్రెస్ క్లబ్లో శుక్రవారం జిల్లా అధ్యక్షులు సయ్యద్ ఖదీర్ అధ్యక్షతన జర్నలిస్టుల ‘మే డే’ వేడుకలు ఉత్సాహంగా జరిగాయి. ఈ సందర్భంగా తొలుత జర్నలిస్టు అమరవీరులకు మౌనం పాటించి నివాళులర్పించారు. సాధారణ కార్మికులకు ఎనిమిది గంటల పని పరిమితి ఉంటుంది.. కానీ జర్నలిస్టులకు అర్ధరాత్రి, ఆపరాత్రి అనే తేడా లేదు. ఎక్కడ ఆపద ఉన్నా, ఎక్కడ అన్యాయం జరిగినా ప్రజల కోసం నిరంతరం అందుబాటులో ఉండాల్సిన బాధ్యత జర్నలిజం వృత్తిది. ఇది కేవలం వృత్తి మాత్రమే కాదు, అదొక నిరంతర సామాజిక యజ్ఞం. ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరువ చేయడంలో, నిజాలను వెలుగులోకి తేవడంలో కలం కార్మికుల పాత్ర అమోఘం.
సమస్యల పరిష్కారానికి ఐక్యంగా పోరాడాలి
సమాజం కోసం ఇంతగా శ్రమిస్తున్న జర్నలిస్టులు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. తక్కువ వేతనాలు, అక్రిడిటేషన్ కార్డుల మంజూరులో జాప్యం, ఇళ్ల స్థలాలు, హెల్త్ కార్డులు మరియు పెన్షన్ వంటి కీలక సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలి. జర్నలిస్టుల ఐక్యతే వారి బలమని, హక్కుల సాధన కోసం అందరూ కలిసికట్టుగా పోరాడాలి. కలం శక్తి ఒకటైతే సమాజాన్ని మార్చవచ్చు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సీపీఆర్ఓ మధుసూదన్ అకాల మరణం జర్నలిస్టు లోకానికి తీరని లోటని రాజశేఖర్ పేర్కొన్నారు. ఖమ్మం జిల్లాలో ఆయన అందించిన సేవలను గుర్తుచేసుకుంటూ, చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మధుసూదన్ కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని కోరారు. కార్యక్రమంలో సంఘం జిల్లా ఉపాధ్యక్షులు దువ్వా సాగర్, ఖమ్మం ప్రెస్ క్లబ్ అధ్యక్షులు దగ్గుపాటి మాధవరావు, అక్రిడిటేషన్ కమిటీ సభ్యులు మధుశ్రీ, అర్షద్, జిల్లా నాయకులు షేక్ జానీ పాషా, గరిడేపల్లి వెంకటేశ్వర్లు, ఫయాజ్, గణేష్ తదితరులు పాల్గొన్నారు.

