ఇంటర్ సప్లిమెంటరీ ఫీజు గడువు పొడిగింపు
మే 4వ తేదీ వరకు చెల్లింపునకు అవకాశం
రూ. 3,000 ఆలస్య రుసుముతో గడువు
కాకతీయ, హైదరాబాద్ : తెలంగాణ ఇంటర్మీడియట్ పబ్లిక్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల (మే 2026) ఫీజు చెల్లింపు గడువును రాష్ట్ర ఇంటర్మీడియట్ విద్యా మండలి పొడిగించింది. విద్యార్థుల అభ్యర్థన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు బోర్డు అధికారులు వెల్లడించారు. మొదటి మరియు రెండో సంవత్సరం రెగ్యులర్ విద్యార్థులతో పాటు, ఫెయిల్ అయిన అభ్యర్థులు (జనరల్ మరియు వొకేషనల్) ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చని తెలిపారు.
మే 4 సాయంత్రం వరకు..
అర్హులైన విద్యార్థులు రూ. 3,000 ఆలస్య రుసుముతో మే 2వ తేదీ నుంచి 4వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష ఫీజును చెల్లించి, తమ దరఖాస్తులను ధ్రువీకరించుకోవచ్చని బోర్డు స్పష్టం చేసింది. మే నెలలో నిర్వహించనున్న సప్లిమెంటరీ పరీక్షలకు హాజరు కావాలనుకునే వారు నిర్ణీత గడువులోగా కళాశాలల ద్వారా ఫీజు చెల్లించాలని సూచించారు. గడువు ముగిసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ దరఖాస్తులను స్వీకరించబోమని బోర్డు అధికారులు స్పష్టం చేశారు.

