రాష్ట్రంలో నేరాలు పెరిగాయి..
శాంతిభద్రతలు పూర్తిగా దిగజారాయి
ముఖ్యమంత్రి, బండి సంజయ్ మధ్య ‘చీకటి ఒప్పందాలు’
డీజీపీని కలిసి ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు
కౌశిక్ రెడ్డిపై దాడికి కేంద్ర మంత్రి బండి సంజయ్దే బాధ్యత
బీఆర్ఎస్ ప్రతినిధి బృందం ఆరోపణలు
కాకతీయ,తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా దిగజారిపోయాయని, వెనుకబడిన రాష్ట్రాల్లో ఉన్న అరాచక పరిస్థితులు నేడు తెలంగాణలో కనిపిస్తున్నాయని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ప్రతినిధి బృందం మండిపడింది. కరీంనగర్లో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి నివాసం, కార్యాలయంపై జరిగిన దాడులపై శుక్రవారం డీజీపీకి ఫిర్యాదు చేసిన అనంతరం వారు మీడియాతో మాట్లాడారు.
రాష్ట్రంలో నచ్చని రాజకీయ పార్టీల కార్యాలయాలు, నేతల ఇళ్లపై దాడులు చేస్తున్నారని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి విమర్శించారు. కరీంనగర్లో పోలీసుల వైఫల్యాన్ని డీజీపీ దృష్టికి తీసుకెళ్లామని, నిన్నటి ఘటనలో కౌశిక్ రెడ్డిని చంపేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. బండి సంజయ్ రెచ్చగొట్టే వ్యాఖ్యల వల్లే కార్యకర్తలు దాడులకు తెగబడ్డారని, కాబట్టి ఆయనపై కేసు నమోదు చేసి ఏ-1గా చేర్చాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి వెంటనే భద్రత పెంచాలని కోరారు.
ముఖ్యమంత్రికి బండి సంజయ్ ‘సహాయ’ మంత్రి: వివేకానంద
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి బండి సంజయ్ మధ్య చీకటి ఒప్పందాలు, వ్యాపారాలు ఉన్నాయని బీఆర్ఎస్ఎల్పీ విప్ కె.పి. వివేకానంద సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డికి ఎప్పుడు ఆపద వచ్చినా బండి సంజయ్ ‘సహాయ మంత్రి’లా ఆదుకుంటున్నారని ఎద్దేవా చేశారు. “కేటీఆర్ను డ్రగ్స్ అని విమర్శిస్తే మేము అదే భాషలో సమాధానం చెబుతాం. మా ప్రభుత్వం వచ్చాక బండి సంజయ్ గుజరాత్ వెళ్లి దాచుకోవాల్సి వస్తుంది” అని హెచ్చరించారు. రాజ్యాంగాన్ని రక్షించాల్సిన హోంశాఖ సహాయ మంత్రి గుండాలను పెట్టి దాడులు చేయించడం దారుణమని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ మండిపడ్డారు. పోలీసులే గుండాలను బతిమిలాడుతున్న పరిస్థితి రాష్ట్రంలో ఉందని, బిహార్ సంస్కృతిని తెలంగాణకు తీసుకురావద్దని డీజీపీని కోరామన్నారు. దాడులు ఇలాగే కొనసాగితే ఆత్మరక్షణ కోసం తాము కూడా ప్రతిదాడులు చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. కేటీఆర్ పుట్టుకపై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు హోంశాఖ సహాయ మంత్రి వాడే భాషలా ఉందా? అని ఎమ్మెల్సీ దాసోజ్ శ్రవణ్ నిలదీశారు. రాష్ట్రంలో పోలీసు శాఖ ఎవరి కోసం పనిచేస్తోందని ప్రశ్నించారు. ఐపీఎస్ అధికారి భార్య హత్యకు గురవ్వడం, మహిళా సీపీ సుమతిపైనే పోకిరీలు అల్లరి చేష్టలకు పాల్పడటం చూస్తుంటే భద్రత ఎక్కడుందో అర్థమవుతోందని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ కార్యాలయాలపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించేదాకా తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. ఈ బృందంలో ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, డాక్టర్ కె. సంజయ్ తదితరులు ఉన్నారు.

