మైనారిటీ విద్యార్థులకు ‘నైపుణ్య’ డిగ్రీ కళాశాలలు
ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో ఏఐ, స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు
మూసీ తీరంలో సర్వమత సంస్కృతులకు నెలవుగా కట్టడాలు
ఆటో డ్రైవర్ల కోసం ఎలక్ట్రిక్ రీట్రోఫిట్టింగ్ ప్రణాళిక
ప్రతిభావంతులకు ప్రత్యేక ప్రోత్సాహకాలు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
మైనారిటీ సంక్షేమ శాఖపై అధికారులతో సీఎం సమీక్షా
పలు కీలక నిర్ణయాలకు ప్రతిపాదనలు..త్వరలోనే ఉత్తర్వులు
కాకతీయ,తెలంగాణ బ్యూరో : మైనారిటీ విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో నైపుణ్యాభివృద్ధి కోర్సులతో కూడిన ప్రత్యేక డిగ్రీ కళాశాలలను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సచివాలయంలో శుక్రవారం మైనారిటీ సంక్షేమ శాఖపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. విద్యార్థులకు కేవలం సంప్రదాయ కోర్సులు మాత్రమే కాకుండా, వారి జీవనోపాధికి తక్షణమే ఉపయోగపడేలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ , నైపుణ్యాభివృద్ధి శిక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు. పాఠశాల స్థాయి నుంచే బోధనలో ఏఐ సాంకేతికతను జోడించాలని సూచించారు. ప్రతిభావంతులైన బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు అందజేస్తున్నట్లే మైనారిటీ విద్యార్థులకు కూడా ప్రోత్సాహకాలు అందించేందుకు ప్రత్యేక కార్యక్రమం రూపొందించాలన్నారు. గ్రూప్-1, 2, 3 పరీక్షలకు ఎంపికైన మైనారిటీ అభ్యర్థులకు ఆ శాఖ పరిధిలోని కార్యక్రమాలపై అవగాహన కల్పించి బాధ్యతలు అప్పగించాలని అధికారులను ఆదేశించారు.
ఆటో డ్రైవర్లకు అండ.. ఇమామ్లకు భరోసా
ఆటో డ్రైవర్ల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం ఒక వినూత్న ప్రణాళికను సిద్ధం చేస్తోందని ముఖ్యమంత్రి వెల్లడించారు. ప్రస్తుతం ఉన్న డీజిల్, పెట్రోల్ ఆటోలను ఎలక్ట్రిక్ ఇంజిన్లుగా మార్చే (రీట్రోఫిట్టింగ్) ప్రక్రియను చేపట్టడం ద్వారా ఇంధన ఖర్చులు లేకుండా చేసి, వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే లక్ష్యమని రేవంత్ రెడ్డి తెలిపారు. అలాగే మతపరమైన సేవలు అందిస్తున్న ఇమామ్, మౌజమ్లకు ఇచ్చే గౌరవ పారితోషికాలను ఎలాంటి జాప్యం లేకుండా క్రమం తప్పకుండా విడుదల చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. భూ లభ్యత ఉన్న చోట ముస్లింల కోసం ఖబరస్తాన్లకు అవసరమైన స్థలాలను కేటాయిస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. విద్యా, క్రీడల ప్రాధాన్యతను విద్యార్థులకు తెలియజేసేలా గ్రూప్స్ అభ్యర్థులను, క్రీడాకారులను ఆహ్వానించి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.
మూసీ తీరంలో గంగా జమునా తెహ్జీబ్
హైదరాబాద్ నగరాభివృద్ధిలో భాగంగా చేపట్టిన మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టులో తెలంగాణ విశిష్ట సంస్కృతి ప్రతిబింబించాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. మూసీ అభివృద్ధిలో కేవలం గుడి మాత్రమే కాకుండా మసీదు, చర్చి, గురుద్వారా నిర్మాణాలు కూడా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఆయా మతాలకు సంబంధించిన సంస్కృతుల అధ్యయనం, భారత దేశ విశిష్టతను మరియు తెలంగాణలోని గంగా జమునా తెహ్జీబ్ను చాటిచెప్పేలా ఆ కట్టడాలు ఉండాలని పేర్కొన్నారు. ఇవి కేవలం ప్రార్థనా స్థలాలుగానే కాకుండా మన సంస్కృతులను అధ్యయనం చేసే గొప్ప కేంద్రాలుగా పరిఢవిల్లాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈ సమీక్షా సమావేశంలో రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి మహమ్మద్ అజారుద్దీన్, ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ, టీజీఎంఆర్ఈఐఎస్ ప్రెసిడెంట్ మహమ్మద్ ఫహీముద్దీన్ ఖురేషీ, హజ్ కమిటీ చైర్మన్ సయ్యద్ గులామ్ అఫ్జల్ బియాబాని, వక్ఫ్ బోర్డు చైర్మన్ సయ్యద్ అజ్మతుల్లా హుస్సేనీ, మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శి షఫీఉల్లా తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

