బేసిక్పై 1.5% కోత ప్రతిపాదనను పునఃపరిశీలించాలి
బేసిక్ పేతో కాకుండా కుటుంబ సభ్యుల ఆధారంగా నిర్ణయించాలి
ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణ ట్రస్ట్ ఏర్పాటును స్వాగతిస్తున్నాం
తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ వి.లచ్చిరెడ్డి
కాకతీయ, తెలంగాణ బ్యూరో: ప్రభుత్వం ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణ ట్రస్ట్ను ఏర్పాటు చేయాలనే నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ వి.లచ్చిరెడ్డి, సెక్రటరీ జనరల్ వొдనాల రాజశేఖర్ పేర్కొన్నారు. ఈ పథకం పారదర్శకంగా, సమానంగా, ఆర్థికంగా నిలకడగా, ఉద్యోగి స్నేహపూర్వకంగా ఉండేందుకు తోడ్పడుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం తరహాలో ఈహెచ్ఎస్ను సైతం పునర్వ్యవస్థీకరించాలన్నారు. పథకానికి సంబంధించిన వివరాలపై పూర్తి అవగాహన కల్పించిన తర్వాతనే ఉద్యోగుల సమ్మతి తీసుకుని హెల్త్ కార్డులు జారీ చేయాలన్నారు. ప్రాథమిక వేతనంపై 1.5% కోత విధించే ప్రతిపాదనను పునఃపరిశీలించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్ సోమవారం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో గుర్తింపు పొందిన 15 ఉద్యోగ సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్, డిప్యూటీ కలెక్టర్ల సంఘం అధ్యక్షులు వి.లచ్చిరెడ్డి, సెక్రటరీ జనరల్ వొడ్నాల రాజశేఖర్ ఉద్యోగుల ఆరోగ్య పథకం ఎలా ఉంటే ఉద్యోగులకు, వారి కుటుంబ సభ్యులకు సౌకర్యంగా, అందుబాటులో ఉంటుందో పలు ప్రతిపాదనలను అధికారుల దృష్టికి తేవడం జరిగింది.
పారదర్శకత – ఉద్యోగుల సమ్మతి
ఉద్యోగులను ఈహెచ్ఎస్లో చేర్చే ముందు ప్రభుత్వం పూర్తి మార్గదర్శకాలు, అమలు విధానాలను అందుబాటులో ఉంచాలని జేఏసీ నేతలు కోరారు. ఎంపానెల్ చేసిన ఆసుపత్రుల జాబితా, అందుబాటులో ఉన్న ప్రత్యేక వైద్య సేవల వివరాలు, ఆమోదించబడిన చికిత్సల ప్యాకేజీల వివరాలు, ఇన్పేషెంట్, ఔట్పేషెంట్ సేవల పరిధి గురించి సంపూర్ణ వివరాలతో పాటు లబ్ధిదారుల హక్కులు, బాధ్యతలకు సంబంధించిన సమాచారాన్ని ముందే ప్రచురించాలన్నారు. ఉద్యోగి వాటా, ప్రభుత్వ వాటా సమానంగా నేరుగా ఎంప్లాయి హెల్త్ కేర్ ట్రస్ట్ ఖాతాలో జమ చేయాలని ప్రతిపాదించారు. దీనివల్ల ఆసుపత్రిలో బిల్లుల చెల్లింపు వేగవంతంగా జరుగుతుందని, ఎంపానెల్ ఆసుపత్రుల పట్ల విశ్వాసం పెరిగి అంతరాయం లేని నగదు రహిత వైద్యం ఉద్యోగులకు అందుతుందని తెలిపారు. ఇది ఆర్థిక అంశాలపై పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంచుతుందన్నారు.
సీజీహెచ్ఎస్ తరహాలో స్లాబ్ విధానం
ప్రస్తుతం ప్రతిపాదిస్తున్న శాతం ఆధారిత కోతకు బదులుగా సీజీహెచ్ఎస్ మాదిరిగా స్లాబ్ ఆధారిత వాటా విధానాన్ని అమలు చేయాలన్నారు. నాన్-గెజిటెడ్ ఉద్యోగులకు నిర్ణయించిన స్లాబ్ ప్రకారం స్థిర నెలవారీ చందాతో సెమీ-ప్రైవేట్ వార్డు అర్హత కల్పించాలన్నారు. గెజిటెడ్ ఉద్యోగులకు అధిక స్థిర నెలవారీ చందాతో ప్రైవేట్ వార్డు అర్హత ఇవ్వాలన్నారు. ఉద్యోగులు తమ హోదాతో సంబంధం లేకుండా స్వచ్ఛందంగా అధిక స్లాబ్ను ఎంచుకుని మెరుగైన వార్డు ప్రయోజనాలు పొందేలా ఐచ్ఛిక అప్గ్రేడేషన్ సౌకర్యం కల్పించాలన్నారు.
ప్రస్తుత 1.5% వాటా విధానంపై అభ్యంతరాలు
ప్రస్తుత శాతం ఆధారిత విధానం వల్ల వయస్సు, జీతం పెరిగే కొద్దీ చెల్లించే ప్రీమియం పెరుగుతుందని, కానీ లబ్ధిదారుల సంఖ్య తగ్గుతుందని వివరించారు. ఉదాహరణకు 6 గురు కుటుంబ సభ్యులకు అర్హత ఉన్న యువ ఉద్యోగి తక్కువ మొత్తం చెల్లించి అందరికీ హెల్త్ కార్డులు పొందగలడని, కానీ పదవీ విరమణకు దగ్గరలో ఉన్న సీనియర్ ఉద్యోగికి భార్యాభర్తలు మాత్రమే అర్హులుగా మిగిలినా, అధిక బేసిక్ పే కారణంగా ఎక్కువ వాటా చెల్లించాల్సి వస్తుందని పేర్కొన్నారు. ఇది సీనియర్ ఉద్యోగులపై అసమాన ఆర్థిక భారం వేస్తుందని, అందువల్ల ఈ విధానంలో తగిన మార్పులు చేయాలన్నారు.
కుటుంబ ఆధారిత వాటా విధానం
ఉద్యోగి వాటాన్ని కేవలం బేసిక్ పేకు అనుసంధానించకుండా కుటుంబంలో ఉన్న లబ్ధిదారుల సంఖ్య ఆధారంగా నిర్ణయించాలని డిమాండ్ చేశారు. కుటుంబ పరిమాణాలు భిన్నంగా ఉన్న ఉద్యోగులందరికీ ఒకే రకమైన కోత విధించడం సమానత్వానికి విరుద్ధమన్నారు. ప్రతి నమోదు చేసిన కుటుంబ సభ్యుడికి నామమాత్రపు చందా విధిస్తూ గరిష్ట పరిమితి ఉంచాలన్నారు. దీనివల్ల వాటా నేరుగా లబ్ధిదారుల సంఖ్యకు అనుసంధానమై అన్ని వర్గాల ఉద్యోగుల మధ్య భారం సమానంగా పంచబడుతుందన్నారు. ప్రతి కుటుంబ సభ్యుడి కోసం వాటా వసూలు చేస్తున్నట్లయితే, ఆధారపడిన పిల్లలకు వయస్సు పరిమితితో సంబంధం లేకుండా హెల్త్ కార్డ్ ప్రయోజనాలు కొనసాగించాలని స్పష్టం చేశారు. ఉద్యోగుల హెల్త్ కేర్ ట్రస్ట్, ఎంప్లాయిస్ హెల్త్ స్కీం తుది రూపకల్పనలో ఈ సూచనలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలని వినమ్రంగా కోరారు. ఈ సమావేశంలో తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్, డిప్యూటీ కలెక్టర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి.లచ్చిరెడ్డి, ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణ, తెలంగాణ తహశీల్దార్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు ఎస్.రాములు, రమేష్ పాక, టీయూపీఎస్ ప్రధాన కార్యదర్శి పెంటయ్య పాల్గొన్నారు.

