రాజ్యాంగ హక్కులపై బీజేపీ దాడి
బీజేపీ, బీఆర్ఎస్ కుమ్మక్కు రాజకీయం
గాంధేయవాదిని అవమానించడం ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టు
బీజేపీపై విప్ బల్మూర్ వెంకట్ ఆగ్రహం
మీనాక్షికి మద్దతుగా గాంధీభవన్లో కాంగ్రెస్ నిరసన
కాకతీయ, హైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ను తిరస్కరించడంపై పార్టీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గాంధీభవన్లో ప్రభుత్వ విప్ డాక్టర్ బల్మూర్ వెంకట్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆమెకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా బల్మూర్ వెంకట్ మాట్లాడుతూ, బీజేపీ, బీఆర్ఎస్ ముందస్తు ప్రణాళికలో భాగంగానే ప్రజాస్వామ్య విరుద్ధంగా మీనాక్షి నటరాజన్ నామినేషన్ను రిజెక్ట్ చేయించారని ఆరోపించారు. “మూడో వ్యక్తి గెలిచేందుకు తగిన సంఖ్యాబలం లేకపోయినా, అభ్యర్థిని నిలిపి ప్రజాస్వామ్య పద్ధతులను అపహాస్యం చేశారు. దేశంలో ఓటు చోరీతో పాటు ఇప్పుడు సీటు చోరీకి కూడా పడుతున్నారు. ప్రజాస్వామ్యయుతంగా గెలవలేక ఎన్నికల విధానాలను దుర్వినియోగం చేస్తూ, ఫలితాలు అనుకూలంగా లేకపోతే రాజ్యాంగ సంస్థలను సైతం తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు” అని ఆయన మండిపడ్డారు.
గాంధేయవాదాన్ని హత్య చేశారు
గాంధేయవాదాన్ని ఆచరిస్తున్న మీనాక్షి నటరాజన్పై కుట్ర చేయడం అంటే, మహాత్మా గాంధీని అవమానించడమేనని, ఆ సిద్ధాంతాన్ని హత్య చేయడమేనని బల్మూర్ వెంకట్ వ్యాఖ్యానించారు. ఇంచార్జీగా ఆమె రాకముందే జరిగిన ఒక పాత కేసును సాకుగా చూపి నామినేషన్ తిరస్కరించడం పౌరుల హక్కులను కాలరాయడమేనని ఆయన విమర్శించారు. ఈ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ఎన్నికల సంఘం తీరును తప్పుబట్టిన ఆయన, దీనిని రాజ్యాంగబద్ధమైన అన్ని మార్గాల్లో పోరాడతామని స్పష్టం చేశారు.

