బిల్లులు వచ్చాయిగా.. ఇక అక్రమ వసూళ్లు ఆపండి!
మమ్మల్ని పీడించకండి.. వేధించకండి
ఒక్కో లారీపై రూ.3,000 వరకు అదనపు దోపిడీ
వినియోగదారులపై టన్నుకు రూ.200 వరకు భారం
ప్రశ్నిస్తే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులంటూ కాంట్రాక్టర్ల బెదిరింపులు
టీజీఎండీసీ ఎండీకి సమగ్ర ఫిర్యాదు చేశాం
స్పందించకుంటే రాష్ట్రవ్యాప్త ఆందోళన
పెద్ద అంబర్పేట ఇసుక లారీ ఓనర్స్ అసోసియేషన్ వెల్లడి
కాకతీయ,తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలోని వివిధ ఇసుక ర్యాంపులలో కాంట్రాక్టర్లు చేస్తున్న అక్రమ వసూళ్లు, లారీ యజమానులు, డ్రైవర్లపై జరుగుతున్న వేధింపులు రోజురోజుకు హద్దులు దాటుతున్నాయని పెద్ద అంబర్పేట ఇసుక లారీ ఓనర్స్ అసోసియేషన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈమేరకు గురువారం అసోసియేషన్ నాయకులు ఒక ప్రకటన విడుదల చే|శారు. ప్రభుత్వం నుంచి కాంట్రాక్టర్లకు బకాయి బిల్లులు విడుదలైనప్పటికీ, ర్యాంపుల్లో అక్రమ వసూళ్లను మాత్రం ఆపడం లేదని మండిపడింది. లారీ యజమానులను పీడించడం, వేధించడం తక్షణమే ఆపాలని డిమాండ్ చేసింది. ప్రభుత్వం నిర్ణయించిన రుసుములను తాము తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ (టీజీఎండీసీ) ద్వారా పూర్తిగా చెల్లించి ఇసుకను తీసుకువెళ్తున్నప్పటికీ, ర్యాంపుల్లోని కాంట్రాక్టర్లు ఒక్కో లారీపై అదనంగా రూ.3,000 వరకు అక్రమంగా వసూలు చేస్తున్నారని అసోసియేషన్ అధ్యక్షుడు పోలగోని భాస్కర్ గౌడ్ ఆరోపించారు. డిస్టినేషన్ పేరుతో టీజీఎండీసీ నుండి ఒక్కో లారీకి సుమారు రూ.5,000 వరకు కాంట్రాక్టర్లు చెల్లింపులు పొందుతున్నారని, అయినప్పటికీ లోడింగ్ కోసం వచ్చిన లారీల నుంచి మరోసారి రూ.3,000 వసూలు చేయడం వారి అక్రమ దోపిడీకి నిదర్శనమన్నారు. ఈ విధంగా టీజీఎండీసీ చెల్లింపులు, లారీ యజమానుల సొమ్ము కలిపి ఒక్కో లారీపై రూ.7,000 నుంచి రూ.8,000 వరకు కాంట్రాక్టర్లు అక్రమ లబ్ధి పొందుతున్నారని ధ్వజమెత్తారు. ప్రభుత్వం కాంట్రాక్టర్లకు కొంత బిల్లులు చెల్లించినప్పటికీ మణుగూరులోని వీరభద్రం ర్యాంపులో లోడింగ్ పేరిట అదనంగా లారీ యజమానుల నుంచి రూ. 2600, కాంటాకు రూ.400, జీపీ, సీరియల్కు రూ.200ల వసూళ్లకు పాల్పడటం దారుణమని అన్నారు. మొత్తంగా ఒక్కో లారీపై రూ.3200 వరకు అదనంగా వసూళ్లకు పాల్పడుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రశ్నిస్తే అట్రాసిటీ కేసులు.. బ్లాక్లిస్ట్ బెదిరింపులు
ఇటీవల కాంట్రాక్టర్లకు బకాయిలు విడుదల చేసినట్లు తెలిసినప్పటికీ, అక్రమ వసూళ్లపై అధికారులు ఇప్పటివరకు ఎటువంటి కఠిన చర్యలు తీసుకోకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోందని అసోసియేషన్ నాయకులు మండిపడ్డారు. అక్రమాలను ప్రశ్నిస్తూ కాంట్రాక్టర్లపై ఫిర్యాదు చేసిన లారీ యజమానుల వాహనాలకు లోడింగ్ నిరాకరిస్తున్నారని, వాహనాలను బ్లాక్లిస్ట్లో పెడతామని బెదిరిస్తూ డ్రైవర్లను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతటితో ఆగకుండా, తప్పుడు కేసులు నమోదు చేయిస్తామని, ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో ఇరికిస్తామని కాంట్రాక్టర్లు బెదిరింపులకు దిగుతున్నారని పలువురు బాధితులు వాపోయారు.
సామాన్యులపై గృహ నిర్మాణ భారం
ఈ అక్రమ లోడింగ్ వసూళ్ల ప్రభావం కేవలం లారీ యజమానులపైనే కాకుండా సామాన్య ప్రజలపై కూడా తీవ్రంగా పడుతోందని అసోసియేషన్ స్పష్టం చేసింది. ఇసుక కొనుగోలు చేసే వినియోగదారులపై ఒక్కో టన్ను ఇసుకకు అదనంగా రూ.100 నుంచి రూ.200 వరకు భారం పడుతోందని, ఫలితంగా గృహ నిర్మాణ ఖర్చులు విపరీతంగా పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. కాంట్రాక్టర్ల అక్రమ వసూళ్ల కారణంగా ప్రభుత్వానికి తీవ్రమైన చెడ్డపేరు రావడమే కాకుండా, ప్రభుత్వ ఆదాయ వ్యవస్థపై కూడా ప్రతికూల ప్రభావం పడుతోందని పేర్కొంది.
ఉన్నతస్థాయి విచారణ జరపాలి : అసోసియేషన్ ప్రధాన డిమాండ్లు
ఈ అక్రమాలపై టీజీఎండీసీ వైస్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ గారికి సమగ్ర ఫిర్యాదు సమర్పించామని, రాష్ట్రవ్యాప్తంగా ఇసుక ర్యాంపులలో జరుగుతున్న అక్రమ వసూళ్లు, బినామీ నిర్వహణ, అధికారుల నిర్లక్ష్యంపై ఉన్నతస్థాయి విచారణ జరిపించాలని అసోసియేషన్ డిమాండ్ చేసింది.
రాష్ట్రవ్యాప్తంగా ఇసుక ర్యాంపులపై ప్రత్యేక విచారణ కమిటీ ఏర్పాటు చేయాలి. లోడింగ్ పేరుతో జరుగుతున్న అక్రమ వసూళ్లను వెంటనే నిలిపివేయాలి. ఫిర్యాదు చేసిన లారీ యజమానులు, డ్రైవర్లపై వేధింపులు, బెదిరింపులను అరికట్టాలి. బినామీ కాంట్రాక్టర్లపై కఠిన చర్యలు తీసుకోవాలి. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులపై శాఖాపరమైన చర్యలు చేపట్టాలి. అక్రమ వసూళ్ల ద్వారా కూడబెట్టిన మొత్తాలపై ప్రత్యేక ఆడిట్ నిర్వహించాలి. ఫిర్యాదు చేసిన లారీలకు లోడింగ్ నిరాకరిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని అసోసియేషన్ డిమాండ్ చేసింది. ప్రభుత్వం మరియు టీజీఎండీసీ యాజమాన్యం తక్షణం స్పందించి న్యాయం చేయకపోతే, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఇసుక లారీ యజమానులందరినీ ఏకం చేసి ప్రజాస్వామ్యబద్ధంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని పెద్ద అంబర్పేట ఇసుక లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పోలగోని భాస్కర్ గౌడ్ హెచ్చరించారు.

